Maa Swami    Chapters   

11. ఉపాస్తి

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి

స్వసై#్మ నమః పథ మహం కరవాణి వాణి

మత్తో నహీతర దనేకమథైకకంవా,

అస్మా దసత్తదధివా స్వరసప్రసారా

దావిర్భవత్వవాకమః ప్రతియోగి త్వం త్వం.

శ్రీ చంద్రశేఖరపదాంకిత సంయమీంద్ర

శ్రీ పూజ్యపాద మహనీయ వపుర్విశేషే,

నారాయణాధి పద రాఘవపూర్వనామ

ప్రహ్వం వవుర్భవతు సంప్యవహారి హారి.

శ్రీ శ్రీ శ్రీ ప. ప. శ్రీమచ్చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు నిరంతర సిద్ధులు. జగత్ప్రసిద్ధులు. జగత్కుటుంబులు. కంచికామకోటి పీఠాధ్యక్షులు. ప్రస్తుతము పంచమాశ్రమనిష్ఠులు.

ఒకపుడు దత్తాత్రేయులవారిని 'శాస్త్రములలో నాలుగు ఆశ్రమములెకలవు. ఐదవ ఆశ్రమము లేదుకదా' యని శిష్యులు ప్రశ్నింప 'అది నాయట్టివానికి మాత్రమె గోచరించునదని' సమాధానము చెప్పెను. ఆ ప్రశ్నోత్తర గ్రంథము చదివినను పరవాక్యర్ధముతప్ప ఆ విషయము అనుభవమునకు రాలేదు.

ప్రస్తుతకాలమున శ్రీ స్వామివారిని దర్శించిన వారికి ఆ విషయము అనుభవమునకు రాక తప్పదు. వారి ప్రవర్తనము మనము అర్ధము చేసికొనుట కష్టము. కాని, లోకమంతయు స్వామి వారికి నాయందు యెక్కువ వాత్సల్యమని చెప్పుకొనుచుందురు. ఆ భావము రామాయణములో వానరము లన్నియు శ్రీరామచంద్రమూర్తికి 'నాయందే అనుగ్రహమని, నాయందే అనుగ్రహమని, నన్ను చూచి నవ్వెనని, నన్ను చక్కగ చూచెనని, నన్ను మెచ్చుకొనెనని, నా వైపుకు బాహువులు చాచెనని' చెప్పుకొనుచున్నట్లు వాల్మీకిమహాముని వర్ణించెను. అట్టి మహాపురుషులకు దక్క మరొకళ్ళకు అట్టి సర్వాహ్లాదనశక్తి ఉండదు. ఆ మహాత్ములు ఎక్కడనో అవతరించి, బ్రహ్మచర్యము గడపుకొని, 13వ సంవత్సరముననే ఆశ్రమస్వీకారము చేసి పీఠాధిపతులైనప్పటినుండి నిత్యము దేశసంచారము చేయుచు, భక్తులను ఉద్ధరించుచు ఉపన్యాసరూపముగా ధర్మజ్ఞానములు వెదజల్లుచు వచ్చిరి. వారి వాచికమందలి ప్రభావము నిత్యసత్య మైనదిగనుక విన్నదే అని చెప్పకతప్పదు.

లోకములో ఉపన్యాసధోరణుల మాదిరి, వెంటనే జారిపోకుండ బుద్ధిమంతులు సంగ్రహించి, భాషాంతరమునగూర్చి భారతమునవ్యాప్తి నొందించిరి. ఆ ఉపన్యాసములన్నియు ఒక ముఖమున దెచ్చి, తెలుగుభాషలో గ్రంథరూపమున సాధన గ్రంథమండలి వారు ఇంతవరకు తొమ్మిది భాగములు ప్రకటించిరి. ఇది పదవ భాగము. ఈ విధముగా శ్రీ బులుసు సూర్యప్రకాశశాస్త్రి గారు శ్రీ స్వామివారి అనుగ్రహమునకు లోకాదరణమునకు పాత్రులైరి.

వేదములు, ఉపనిషత్తులు, భాష్యములు ఉన్నవికదా, ఈ విజ్ఞానమునకు శ్రీ స్వామివారి ఉపన్యాసములనే కొనియాడు టెందులకు? అని కొందరు ప్రశ్నింపవచ్చును. కాని ఆ విద్యలు సంస్కృతభాషలో నున్నవి. భాషవచ్చియు అర్ధమగుట దుర్లభము. వానిని చదువు విద్యార్ధులు తర్కమీమాంసతో సంబంధముచేసికొని చదువవలయును. వారు చెప్పిన ఉపన్యాసములుకూడా తర్కమీమాంసానుసూత్యములుగానే ఉండును. అది సామాన్యులమనస్సుకు పట్టుట కష్టము. శ్రీ స్వామివారన్ననో గురుప్రాసాదమును పొంది, కైకొన్న విద్యను అనుభవించి, తమ అనుభవమును తేటమాటలతో వెల్లడించిరి.

ఈ ఉపన్యాసములు పండితులకు పామరులకుకూడ ఆవశ్యకములు. పామరులకు సులభముగా అర్ధమగును. పండితులకు తమ అనుభవము సరిగా- సరిగాదా అని రుజువు చూచికొనుట కుపయోగించును. శ్రీ స్వామివారి ఉపన్యాసధోరణిలో లోకజ్ఞానము, శాస్త్రజ్ఞానము, ధర్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానముకూడ 'నేను-నేనని' వెలువడుచుండును. చాలమంది ఉపన్యాసకులున్నను ఇట్టి అనుభవము చెప్పుట శ్రీ స్వామివారికే తగినది. ఇట్టి ధోరణి యక్షప్రశ్నలలో ధర్మరాజు సమాధానమునకు సరిపోవును.

శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్యులవారి భాష్యాది ప్రసంగములలో కూడ ఇది సర్వజ్ఞిత్వము. మామూలుగా కన్పట్టుటున్నది. కావున యిట్టి మహాపురుషులు అగతికులకు గతి కల్పింప నవతరించుచుందురు. ఆ దృష్టితో ఈ ఉపన్యాస సంపుటములను పఠించి, సర్వశాస్త్రపారమైన అనుభవమును పొంది, భక్తులెల్లరు కృతార్ధులయ్యెదరు గాక!

ఓం తత్సత్‌.

Maa Swami    Chapters