Maa Swami    Chapters   

10. శ్రీకాంచీయతి

శ్రీహరి సాంబశివశాస్త్రి

శ్రీ కాంచీయతులు, జగద్గురువులు, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ

స్వామివారు స్ఫూర్తికి వచ్చినపుడు బహుముఖములుగ కాంతిపుంజం విరజిమ్మే బ్రహ్మతేజోమయమూర్తి యొకటి భక్తుల హృదయాలలో గోచరమౌతుంది. శాంతపావనుడగు అచింత్యవైభవము ఆముఖదీప్తిలో ప్రస్ఫుటమౌతుంది. ''స్మితపూర్వభాషీ రాఘవః''- అన్న సూక్తిని స్ఫురణకు దెచ్చే మందస్మిత వదనం ఆమూర్తికి అమూల్యమైన సహజాలంకారం.

-: యత్రరామస్తత్రాయోధ్యా :-

శ్రీచరణులు నిలిచినచోట శ్రీనిలయం. అదియొక దివ్యతీర్ధం. పవిత్రయాత్రాస్థలం. అచట ప్రశాంత రమణీయ వాతావరణం నెలకొంటుంది. అచట జేరెడి భక్తునకు- శాంతమిద మాశ్రమపదం- అన్న భావన కలుగక మానదు.

వాడవాడలనుండి యొందరెందఱో ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్ధులు, తత్త్వవేత్తలు శ్రీచరణుల దర్శనభాగ్యమపేక్షించి నిత్యంవస్తూ ఉంటారు. భారతము పంచమవేదము. అది ధర్మశాస్త్రజ్ఞులకు ధర్మశాస్త్రంగాను, ఐతిహాసికుల కితిహాసంగానూ, నీతివిచక్షుణులకు నీతిశాస్త్రంగాను, కవిపుంగవులకు మహా కావ్యంగాను, అధ్యాత్మవిదులకు వేదాంతశాస్త్రంగాను-- ఈ రీతిగా వారివారి ప్రతిభా యోగ్యతా చిత్తసంస్కారాల ననుసరించి వేదంవలె సాక్షాత్కరిస్తుంది. శ్రీచరణులు గూడ చమత్కృతి ప్రధాన సంభాషణ చతురుడుగా, చారిత్రక పరిశోధకుడుగా వివిధభాషాతత్త్వవిదుడుగా, న్యాయవేత్తగా, రాజకీయ విశారదుడుగా, విమర్శకుడుగా, సాహితీవేత్తగా, మహోపాసకుడుగా, మంత్రశాస్త్రమర్మజ్ఞుడుగా, యోగీశ్వరుడుగా, ధర్మదేవతగా, అధ్యాత్మవిదుడుగా, దేశికుడుగా, ఆప్తబంధువుగా, వాచంయమిగా-- ఈ రీతిగా వివిధ రూపాలతో గోచరిస్తూ ఉంటాడు. ఆశ్రితుల ననుగ్రహిస్తూ ఉంటాడు. విసుగు విరామం లేకుండా నిరంతరం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అసంగభావం వారిలో గోచరిస్తూ ఉంటుంది. 'ఆసక్తః సుకమన్వభూత్‌'- అను కాళిదాససూక్తిని స్ఫురింపజేస్తూ ఉంటారు.

తొలిసారిగా శ్రీచరణులకు మా 'భారతీనిరుక్తి' గ్రంధాన్ని వినిపించుటకై విజయవాడనుండి ఏలూరు వెళ్ళాము. అది ధనుర్మాసం. మధ్యాహ్నసమయం. తెల్లవారుజాముననే లేచి పూజాకార్యక్రమం పూర్తిచేసి పరివారమంతా ప్రగాఢనిద్రలో మునిగియున్నది. పీఠంలో అలజడి యేమాత్రం లేదు. మారాక శ్రీవారికి తెలియజేయుట యెట్లో? కింకర్తవ్యమ్‌? ఎవరైనా రాకపోదురా? అని యట్లే నిరీక్షిస్తున్నాం. సుమారు పదినిముసములు గడచినవో లేవో- ఇంతలో మందహాసం చేసుకుంటూ పెద్ద బాదమాకు చేతితో పట్టుకొని శ్రీవారు లోపలనుండి వచ్చారు. ఆకు నేలపైవేసి కూర్చుని మమ్ములనుకూడ కూర్చొనుటకు సైగచేశారు. మరుమాట లేదు. మీ గ్రంధాన్ని చదవండి- అన్నారు. మేము గ్రంధాన్ని వినిపించుటకు రాగలమని ముందుగా శ్రీవారితో చెప్పలేదు. మారాకకు కారణం శ్రీవారికెట్లు తెలిసింది? మా వార్త నందించుట కచట నెవరునులేరే! మాయాశ్చర్యానికంతులేదు. అనుగ్రహంతో శ్రీవారే మా గ్రంథాన్ని వినుటకు వచ్చుట మా భాగ్యం మా గ్రంథంలో కొంత భాగం వినిపించాం. మధ్యలో శ్రీవారు రామయణప్రసక్తి తెచ్చారు. విజయవాడలో రామాయణ నామౌచిత్యం, కాండ విభాగతత్త్వం, సుందరకాండ సౌందర్యం మున్నగువాటిని గూర్చి చెప్పారుకదా? ఆ విషయాలు గ్రంథస్థంచేశారా? చేయకపోతే చేసి వినిపించండి. అయితే మూడు నియమాలు పాటించాలి. 1. గ్రంథరచన మీ అహంకారాన్ని పెంపొందించకూడదు. 2. పరనింద ఉండరాదు. 3. గ్రంథరచనతో ధనార్జన చేయరాదు.

ఈ నియమాలు పాటిస్తూ గ్రంథచరనచేసి వేదమాతృసేవ చేయండి-- అని యాదేశించారు. అవకాశమున్నపుడల్లా మీ గ్రంథాన్ని వినిపిస్తూ ఉండండి అని చెప్పి నవ్వుతూ లేచారు.

మా భారతీనిరుక్తి గ్రంథాన్ని వినిపించుటకై కంచి వెళ్ళాము. సావకాశంగా పదునైదురోజులు మా గ్రంథం విన్నారు. ఒకరోజున మా గ్రంథం చదువుచుండగా ఒక వృద్ధుడైన ఋగ్వేద ఘనపాఠి వచ్చాడు. నెమ్మదిగా శ్రీవారిని సన్న్యాసస్వీకరణ కనుమతి నిమ్మని యర్థించాడు. అంతట శ్రీవారు-- ఋగ్వేదంలో ఏదేని యొక్క ఋక్కునకు వరుసగా పదక్రమఘనదండాది వికృతులను చెప్పుమని కోరారు. ఒక మంత్రానికి ఆయన అన్నీ వరుసగా చక్కగా చెప్పారు. అపుడే కామాక్షి కోవెలనుండి ప్రసాదంగా వచ్చియున్న పెద్ద పూలదండను శ్రీవారు ఆ ఘనాపాఠి మెడలో వేయించారు-- 'మీరు దండం (సన్న్యాసం) అడిగారు. నేను దండ ఇచ్చాను'- అన్నారు శ్రీవారు నవ్వుతూ.

శ్రీవారి యనుగ్రహానికి ఈ చమత్కారానికి ఆ ఘనాపాఠి చకితుడై ఆనందాశ్రువులు రాలుస్తూ మరుమాటాడక సెలవు తీసికొన్నాడు.

దండధారణ (సన్న్యాసం) సులభసాధ్యంకాదు; అది అసిధారావ్రతం; ఆసంగభావం మీలోలేదు- మీరు దండలకే అర్హులు; దండానికి కాదు- అనే విషయాన్ని నిపుణంగా, మనస్సు నొచ్చకుండా ఘనపాఠికే కాక యటనున్న పండితుల కందఱకు ఉపదేశించినట్లయింది.

'మహాత్మనా మింగితై శ్చేష్టితై ర్బహవో అపూర్వా విషయావ్యజ్యన్తే'

ఒకనాడు స్వాహా ప్రకరణం చదువుతున్నాము. ఈ శబ్దం హోమవాచక సాంకేతిక శబ్దంగా పరిగణించబడుతుంది. కాని యిది పరదేవతకు, వేదమునకుగూడ వాచకము. వేదమే తనకు స్వాహా, స్వధా వివరించుకొన్నది అంటూ స్వాహాదేవీ స్వరూపవర్ణన పరమైన షడ్వింశ బ్రాహ్మణభాగాన్ని చదువుతున్నాం. శ్రీవారు ఆనందిస్తూ ఎంతో ఉల్లాసంగా వింటున్నారు. ఆ సమయంలో భక్తులెవరో సమర్పించిన సవత్సయైన కపిలధేనువును పరిచారకులు శ్రీవారికడకు కొనితెచ్చారు. వెంటనే అప్రయత్నంగా-

'ఏషాస్వాహాదేవీ గోరూపిణీ సమాగతా స్వాహాకృపతో

భవదీయా భారతీనిరుక్తిః శశ్వత్‌ విజయతేతరామ్‌'

అనే మాటలు శ్రీచరణుల ముఖంనుండి వెల్వడినవి.

అప్రయత్నలబ్ధమైన శ్రీవారి యాశీస్సు మమ్ము ముగ్ధులగావించింది. ఎనలేని ఉత్సాహాన్ని ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించింది. సావధానంగా పరిశీలిస్తే- మేమేకాదు- ఎందఱందరో శ్రీవారికడకు వస్తూ ఉంటారు. వారి వారి అనుభవాలను వింటూ ఉంటే 'అందఱికంటె తమనే శ్రీవారెక్కువగా ప్రేమిస్తారు; అనుగ్రహిస్తారు. అనేతృప్తి వారి యందఱిలో ప్రస్ఫుటమౌతూవచ్చింది. అందఱ కన్నివిధాల తృప్తిని కలిగించటం మహాత్ముల లక్షణం. అట్టి మహాత్ములే శ్రీచరణులు. రమతే ఇతి రామః రమయతీతిరామః- ఆ శబ్దార్ధ ప్రతిరూపమే శ్రీ కాంచీయతి.

శ్రీ శంకరార్య పద మాస్థిత మిద్ధదీప్తిం

శ్రీ కామకోటి పద దేశిక మాప్త బంధుమ్‌

శ్రీ చంద్రశేఖర ముదారగుణం వరేణ్యం

కాంచీయతీంద్ర గురురాజ మహం ప్రపద్యే

శ్రీ చంద్రశేఖర పదాబ్జనిలీనభృంగం

శ్రీ దేవతాపదసరోరుహ సౌరభాఢ్యమ్‌

శ్రీ వేదవాజ్మయ సముద్ధరణౖకదీక్షం

కాంచీయతీంద్ర మనిశం మనసాస్మరామి

ధర్మోత్తరే పథిచరస్త మనల్ప సత్త్వం

భక్తాంశ్చ ధర్మమహితే పధి చారయన్తమ్‌

బోధామృత ప్రశమితాఖిల తాపబృందం

కాంచీయతీంద్ర మిహనౌమి జగద్గురుం తమ్‌

Maa Swami    Chapters