Maa Swami    Chapters   

2.విశ్వానికి వెలుగు చూపగలిగినది వేదమే

నేడు విదేశాలలో సయితం అనేకులు ఆత్మవిద్మపట్ల ఆసక్తి చూపుతూ, ఆత్మశోధన కావిస్తున్నారని, అట్టి వారందరికి వెలుగు చూపగల శాస్త్రసంపద మనకు పుష్కలంగా వున్నదనీ, దానిని భద్రపఱచుకొంటూ, ఆ వేదశాస్త్రములయందు నిష్ణాతులైన వారిని సన్మానించుకొంటూ, వారి సంఖ్య పదింతలయ్యేటట్టు కృషిచెయ్యవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది.

ఈ రోజుల్లో చాలామంది-మనదేశంలోనేకాదు-విదేశాల్లోకూడా సత్యం ఏది? జన్మకుసార్ధక్యం ఏమిటి? జీవిత పరమార్ధం ఏమిటి? అది ఎంతదూరంలో వుంది? దీన్ని పొందడానికి మనం ఏమి చెయ్యాలి?- అని ఆత్మ శోధన చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఈజన్మలో పూర్తిఅయితే మంచిదే-లేక కొంతకృషి జరిగినా మంచిదే.

''ఇలా అన్నిచోట్లా ఆత్మవిచారం జరుగుతున్న దానినిబట్టి సత్యానికి విలువ తగ్గలేదనీ యింకా ఎక్కువ అవుతున్నదనీ తెలుస్తున్నది''. అందువల్ల ఆత్మవిద్యయందు కృషిచేసే పండితుల సంఖ్య యింకా ఎక్కువ అయేటట్లు మనమందరం కృషి చెయ్యాలి.

''వేదం వృక్షం, వేదాంతం పుష్పం, అద్వైతం ఫలం'', ఫలంవుంటేనే అనుభవం, ఉపనిషత్తుల తాత్పర్యాన్ని- అద్వైతానుభవాన్ని అనుగ్రహించినవారు ఆదిశంకరులు.

''ఏసుక్రీస్తూ, గౌతమబుద్ధుడూ'' మున్నగువారు కొన్నిబోధలు చేశారు. తర్వాత కొంతకాలానికి కొన్ని బోధలు చేశారు. తర్వాత కొంతకాలానికి కొన్ని సభలవంటివి ఏర్పడి, వాటన్నిటిని సేకరించి, భద్రపఱచి ప్రచారం చేశారు. అయితే ఆదిశంకరుల విషయంలో మనకు ఆ చిక్కు లేకపోయింది. వారు స్వయంగా రచించిన మహా గ్రంధాలన్నీ మన భాగ్యవశంచేత మనకు యథాతథంగా లభించినాయి.

''ఆచార్యులవారి ఈ గ్రంథాలను అవగాహన చేసుకోడానికి తర్క, వ్యాకరణ, మీమాంసాశాస్త్రాల పరిచయం కావాలి. అందువల్ల ఈ అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి మా పరమగురువులు అద్వైత సభను ఏర్పాటు చేశారు. దాని కార్యదర్శి ఒక ట్రస్టును ఏర్పాటుచేసి, యిందుకు అవసరమైన పథకాలను అమలు పరచారు. అందుకు తగ్గమూలధనంకూడా వారు ఏర్పాటు చేశారు. దానినుంచే నేడు కొందరు వేదాధ్యయనపరులకు పారితోషికము లివ్వబడుతున్నాయి.

ఆదిశంకరులు అనుగ్రహించిన అద్వైత పరమార్ధమును విపులీకరించారు. వారి వాక్యములలో ఒక శ్లోకమైనా చదివి, దీనిని అనుసంధానం చేసుకోవడమే వారికి మనం సమర్పించుకోవలసిన కానుక అనిచెప్పారు.

పుణ్యశ్లోకులు ఆదిశంకరులు

''ఆదిశంకరులు వేదధర్మాన్ని ఉద్ధరించిన పుణ్యశ్లోకులు.'' వారు ఉత్తమగ్రంధాలు వ్రాయటమే కాక దేశం అంతటా పర్యటించి అందరకు దర్శనమిచ్చి అనుగ్రహించారు.

''ఆదిశంకరుల తల్లిదండ్రులు సంతానంకోసం తపస్సుచెయ్యగా వారిరువురకు ఈశ్వరుడొక్కసారే స్వప్నంలో సాక్షాత్కరించాడు. అల్పాయుష్కుడు, మహామేధావియైన వాణ్ణిగాని, ఆయుర్దాయం ఒక్కటే పూర్ణంగావుండి తదితరగుణాలు వ్యతిరేకంగా వుండేవాణ్ణిగాని- ఎవరు కావాలో కోరుకోమన్నారు. వారు మహాపురుషుణ్ణ కోరారు. శంకరుడు తానే అవతరిస్తున్నట్టు చెప్పాడు.'' ఆ విధంగా అవతరించిన శంకరులకు ఎనిమిది సంవత్సరాల వయసువరకే ఆయుర్దాయం ఉన్నది. తరువాత ఆశ్రమస్వీకారం చెయ్యటంవల్ల మరొక ఎనిమిదేళ్ళ అయువు లభించింది. పదహారు సంవత్సరాలకు భాష్యాల్ని వ్రాసారు. వేదవ్యాసులు మారువేషంతో ఆచార్యులవారితో తీవ్రచర్చచేశారు. తుదకు మరోపదహారు సంవత్సరాల ఆయువును ప్రసాదించారు. వ్రాసిన భాష్యాలను దేశంలో ప్రచారం చెయ్యమన్నారు. ఆవిధంగా ఆచార్యులవారు ముప్పది సంవత్సరాల జీవితం వేదధర్మాన్ని అద్వైత మార్గాన్ని ఉద్ధరించటానికై అంకితం చేశారు.''

''నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం,

దేవీ సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్‌.''

అని భారతాన్ని పఠించటానికి ముందు పై ధ్యానశ్లోకం చదువుతారు. పరమాత్ముడే గురుశిష్యరూపంలో నరనారాయణులుగా అవతరించాడు. వారు బదరికాశ్రమంలో తపస్సు చేశారు. నారాయణుడు పూర్ణాంశంతో అవతరించాడు. నరుడు అంశావతారం. వారిరువురిని ధ్యానించాలి. అపుడు జయాన్ని పలకాలి. జయం అంటే భారతం. భారతానికీ పేరు ఉన్నది. బ్రహ్మకపాలంలో వేదవ్యాసుడు లక్షశ్లోకములుగల గ్రంథాన్ని వ్రాశాడు. ఈ గ్రంథంలో ధర్మపుత్రాదులకు జయం కలిగింది. ధర్మానికి జయం కలిగింది. అందువల్ల జయనామం దీనికి తగి ఉన్నది.

సంస్కృతభాషలో గద్యం తక్కువ. అన్ని శాస్త్రాలను పద్యాలలోనే బోధిస్తారు. వైద్యం, శిల్పం, జ్యోతిషం అన్ని శ్లోకాలలోనే ఉంటాయి. వాటిని వల్లించడం సులభం. అడవిలో ఉన్నా లైబ్రరీసహాయం అక్కరలేదు. బీజగణితాదులుకూడ సంస్కృతంలోనే ఉన్నవి. అక్షరాలకు కొన్ని సంఖ్యల సంజ్ఞచేశారు. వీటినే కటవయాది సంఖ్యలు అంటారు.

వేదాలలో వనసల సంఖ్యల్నికూడ ఈ సంజ్ఞలతో గుర్తిస్తారు. ''వాయవ్యగ్గ్‌ శ్వేతమాలభేత'' అన్నపుడు- ఆ సంబంధమైన వనసల్ని ''భజాండ'' శబ్దంతో గుర్తిస్తారు. భ-4, జ-8, డ-3,- అని వస్తుంది. ''అంకానాం వామతో గతిః''- అన్న సూత్రంవల్ల సంస్కృతంలో అంకెలను ఎడమనుండి కుడికి లెక్కకట్టాలి. ఈ సంఖ్య 384 అని స్పష్టమవుతుంది.

భారత జయశబ్దంకూడ ఇంతే. 'జ' అంటే 8. 'య' అటే 1. వెనుకనుండి రాగా 18 అని సంఖ్యవస్తుంది. కాగా, భారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయి. యుద్ధదినాలు పద్దెనిమిది. అక్షౌహిణీలు పద్దెనిమిది. ఈ జయశబ్దంలో ఈ అర్ధం అంతా గర్భితమై ఉంది.అందువల్ల ''తతో జయ ముదీరయేత్‌'' అనేశ్లోకంలో ''సంజయ'' అన్నపుడు 'జయ'శబ్దముకూడ ఈ సూచననుఇస్తుంది.

ఐతే ఆదిశంకరుల అవతారం ఏ సంఖ్య సూచిస్తుంది? వారి నామకరణం ఒక విశేషాన్ని సూచిస్తోంది. తిరువాన్కూరు మహారాజు సంగీత కీర్తనలు వ్రాశాడు. స్వాతి తిరునాళ్‌ ప్రసిద్ధుడే. స్వాతి నక్షత్రంలో జన్మించాడు. అలాగే మూలతిరునాళ్‌ కూడ ఉన్నారు. వారి జన్మనక్షత్రంతో వారు పెట్టుకొంటారు. ఆ సంప్రదాయం కేరళ##దేశంలో ఉంది. కేరళలోనే జన్మించిన ఆదిశంకరుల జన్మతిథి ననుసరించే వారి నామకరణం చేయబడింది. 'శంకర' పదంలో -ర,2,క 1,శం 5 అనగా రెండవదైన వైశాఖమాసంలో, మొదటిదైన శుక్లపక్షంలో, ఐదవదైన పంచమినాడు జన్మించినట్టు స్పష్టమవుతోంది.

పీఠంలో ఆయాగురువులు సిద్ధిపొందినపుడు శ్లోకాలు వ్రాసి చదువుతారు. ఆయా సిద్ధపురుషులు పుణ్యశ్లోకులు, వారిని గూర్చి పుణ్యశ్లోకాలు వ్రాస్తారు. అలాంటిది ఆదిశంకరులను గూర్చిన శ్లోకం ఉన్నది.

''వత్యక్షే గురువస్తుత్యాః'' అనికూడ ఉన్నది. ఈ పుణ్యశ్లోకంలో ''మహేశాంశాజ్ఞామధుర'' అంటూ ''మహామోహధ్వాంతప్రశమనరవిః'' ప్రయోగించారు. షణ్మతగురువన్నారు. ఉత్పత్తిలయములు రెండు తమంతతామే చేసుకొంటారు. ''ఫలేస్వస్మిన్‌'' అని ఉండటంచేత ఫలం అంటే పూర్ణఫలం అని అర్ధం- అద్వైతరూపమైన ఈశ్వరతత్వం అదివృక్షానికి తుదిగా వచ్చేది ఫలం; చిగురు, మొగ్గ, పువ్వు, కాయ-తుదకు ఫలం, అది మధురరూపంగా ఉంటుంది. చింత, వేపలలోకూడ ఫలంలో కొంత మాధుర్యం వుంటుంది. ఈ ఫలశబ్దం-వారి ఆయువునుకూడా సూచిస్తోంది. ల 3 - ఫ 2 - 32 సంవత్సరాలని అర్దం.

భగవద్గీతలోని మొదటి శ్లోకాన్నిగూర్చి ఒక్క విషయం చెప్తాను. గీతలో మంగళశ్లోకం ఏది? ఆశీస్సు, నమస్క్రియ, వస్తునిర్దేశం ఇందులో ఏదో ఒకటి ఆరంభంలో ఉండాలి. రఘువంశంలో ''వాగర్ధా వివసంవృక్తీ'' అని నమస్క్రియ ఉన్నది. 'కురుకర్మైవ తస్మాత్త్వం'-తస్మా ద్యుధ్వస్వభారత - అని శ్రీకృష్ణుడు చెపుతాడు. నష్టోమోహః- అంటూ, కరిష్యే వచనం తవ అంటాడు అర్జునుడు. ఆయన ''కురు'' అంటుంటే ఈయన ''కరిష్యే'' అంటుంటాడు. తిలక్‌ గీతా రహస్యంలో గీత అంతా కర్మయోగం అన్నారు. ఆచార్యులవారు డ్ఞానప్రధానం అని నిరూపించారు. 'ధర్మక్షేత్రే కురుక్షేత్రే' అన్నపుడు క్షేత్రం అంటే శరీరం అని అర్ధం. 13వ అధ్యాయంలో ఈ అర్ధం ఉన్ది. ధర్మసస్యాన్ని ఈ శరీరంలో వృద్థిచెయ్యాలి. ఒక మంచిపని ఆరంభిస్తాం. మరల విఘ్నం వస్తుంది, చాపల్యం వస్తుంది. మనస్సు మారుతుంది. ఈ యుద్ధంలో యుయుత్సువులమై ఉన్నాము. అలా వున్న వారెవరు? నే ననే మమకారం ''పాండు'' అంటే పరిశుభ్రత, మామకములు పాండవములు అనేవి చిత్తవృత్తి విశేషాలు. ఇవే యుద్ధానికి సిద్ధపడ్డవి. ''కిం అకుర్వత?'' ఏం చేశారు? ఏదో చేశారు. చెప్పటానికి లేదు.

శరీరం ధర్మక్షేత్రార్జంగా ఉండాలి. 'సంజయ' అన్నపుడు-సన్‌-జయ-అని గ్రహించాలి. 'సన్‌' అంటే ఉపనిషత్తులలో ''సదేవసోమ్యేద మగ్ర అసీత్‌'' అని చెప్పబడిన పరతత్త్వం, సన్‌-సత్స్వరూపంగా ఉండి, జయ-జయమును పొందుము అని అర్ధం. ఇలా ఉపదేశించారు. వస్తునిర్దేశరూపమైన అర్ధం ఇందులో ఉన్నది.

ఇంకొక్క శ్లోకాంశం చెప్తాను.

యావా నర్ధ ఉదపానే సర్వత స్సంపృతోదకే

తావాన్‌ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః

ఇది గీతలో రెండవ అధ్యాయంలో ఉన్నది. దీని అర్ధం విచారణచేసినపుడు ''శంకరవిజయం'' లోని ఆదిశంకరుల వర్ణసంస్మృతికి వస్తోంది. అందులో ''వేదేబ్రహ్మనమః'' అని ఆరంభిస్తూ ఆదిశంకరుల పాండీతీవైభవాన్ని వర్ణించారు. తుదకు సమస్తవిద్యాప్రయోజనాలు అద్వైత బ్రహ్మవిద్యానందంలో లీనం పొందాయన్నారు. జలసమృద్ధమైన సరస్సు సన్నిహితమైనపుడు బావియొక్క ప్రయోజనం వేరే లేకుండగా అందులోనే అంతర్లీనమైనట్టు అని అక్కడ ఉపయోగించారు. సరిగా అదే అర్ధం పై శ్లోకంలో సాక్షాత్కరిస్తోంది. పూర్వార్ధంలో ''యావాన్‌''తో 'తావాన్‌' కలుపుకోవాలి. అలాగే ఉత్తరార్ధంలో పై 'యావాన్‌' 'తావాన్‌'తో కలుపుకోవాలి. విజ్ఞానతః-అన్నపుడు 'విజ్ఞానే' అని సప్తమ్యర్ధం గ్రహించాలి. అఖండ బ్రహ్మజ్ఞానాన్ని తెలపటం దీని ఆశయం.

కష్టాలు తొలగించుకోటానికి చాలా శ్రమలు పడుతున్నాం. లౌకిక పరిహారాలు చేస్తున్నారు. ఆస్తికుల వైదిక ప్రయోగాలతో లాభం పొందటానికి యత్నిస్తున్నారు. ఆపదలో నున్నపుడు నాస్తికుడు కూడా రహస్యంగానైనా ఆస్తిక పరిహారాలకై యత్నిస్తాడు. కాని, ఈశ్వరభక్తి చిత్తశుద్ధితో అలవరచుకొన్నవాడు ఏ పరిహారాలు లేకుండానే అన్ని ప్రయోజనాలను పొందుతాడు. పెద్దమానును ఇటు అటు లాగాలంటే దానికి ఏనుగును కట్టి లాగించాలి. అదే మాను మహాప్రవాహంలో ఒకపుడు తేలికగా కొట్టుకుపోతుంది. అలాగే పరమేశ్వర భక్తి ప్రవాహం మనలో పెల్లుబుకుతూంటే మహాకష్టాలనే ఈ దుంగలు తేలి, వాటంతటవే కొట్టుకుపోతవి.

Maa Swami    Chapters