Dharmakruthi Chapters Last Page
9;
స్వామివారు కుంభకోణంలో ఉండే సమయంలో దర్భాంగా మహారాజు దక్షిణదేశయాత్ర కోసం రామేశ్వరం దాకా వెళ్లి కుంభకోణంలో శ్రీవారిని దర్శించారు. శ్రీవారితో హిందూ దేవాలయాలు, సంస్కృతీ సంప్రదాయాల గురించి ఎంతో సేపు ముచ్చటించి అత్యంత ఆనందం పొందారు. శ్రీవారు తప్పక ఉత్తర భారతం దయచేసి తమ ఆధిత్యం స్వీకరించి ధర్మప్రచారం చేయాలని ప్రార్థించారు. దర్బాంగా సంస్థానం నేపాల్ దేశాన్ని అంటి పెట్టుకొని ఉంది. పాల్ బ్రంటన్ శ్రీవారి దర్శనం చేసినప్పుడు నేపాల్ రాజా ఆహ్వానంపై ఉత్తర దేశ యాత్ర మొదలు పెట్టాం అని చెప్పినట్లు "A search in Secret India" లో వ్రాశారు. బహుశః శ్రీవారు దర్బాంగా మహారాజు గురించి చెప్పి ఉండాలి శ్రీవారి మనస్సులో ఉత్తరదేశ యాత్ర చేయాలని సంకల్పం వచ్చింది. స్వామివారి పూర్వాచార్యులు చాలామంది ఉత్తర దేశ యాత్ర చేసారు. ఈ మధ్యకాలంలో 65వ పీఠాధిపతులు శ్రీ మహాదేవేంద్ర సరస్వతీ స్వామి వారణాసి యాత్ర మొదలుపెట్టి పూరీ నుండి అనాచారంగా ఉన్నదనే భావంతో తిరిగి వచ్చేసారు అని చెప్పుకొన్నాం కదా.