Dharmakruthi  Chapters   Last Page

 

24. మాతృమూర్తి

మ అక్కగారిని పరామర్శించడానికి వచ్చిన మహాలక్ష్మమ్మగారు తన పుత్రునే సన్యాసిగా ముండన కాషాయదండ కమండలాదులతో కడసారిగా దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. చిదంబర అగ్నిప్రమాదం తరువాత గినిని గుండెలకు హత్తుకొని తండ్రితో కూడా కుమారుని ఎక్కడికీ పంపనని పలికిన మాతృమూర్తి తన వెంటనే వచ్చిన కుమారుని శ్రీమఠానికి సమర్పించి తిరుగు ముఖం పట్టారు.

మహాలక్ష్మమ్మగారికి గిని అంటే ప్రత్యేక అభిమానం అని మనం ముందే చెప్పుకొన్నాము. చిన్నతనం నుంచీ ఆమె తమ కుమారుని దగ్గర కూర్చోపెట్టుకొని అనేక పురాణ కధలు చెప్పేవారు. అనేక శ్లోకాలు నేర్పించేవారు. చిలుక పలుకుల గిని అమ్మ చెప్పినవన్నీ ఇట్టే గ్రహించి తన రమ్యమైన కంఠంతో ఒప్పగించేవారు. అమ్మగారిది ధర్మశాస్త్రంలో గట్టి పాండిత్యమున్న నాగేశ్వరశాస్త్రి కుమార్తె అవడం వదలన నిప్పులు కడిగే ఆచారము. స్వామివారి మడి మరి వారిదేనేమో. సుబ్రహ్మణ్య శాస్త్రిగారు హెజీబు కుమారుడు. ఆయనవి రాచపోకడలు. సంగీతాలు, స్నేహలూనూ.

గినికి అప్పుడు పదమూడేండ్లు. ఎప్పుడూ కొంగుపట్టుకొని తిరుగుతూ, నవ్వుతూ, నవ్విస్తూ, విసిగిస్తూ, సంతోషపెడుతూ తననలరించే ఈ ముద్దుల తనయుడు ఈ పాలు గారే పసివాడు నిస్సంగునిగా, నిర్లిప్తునిగా జీవితాంతం సన్యాసిగా గడపబోతున్నాడా? ''లొట్టలు క్రొంబొదుగులో జిఱు ముట్టియగ్రుమ్ముదూడ నా చిట్టిని చేతబట్టుకొని సింహఘటాలి నెదుర్పజూచెదో'' అంటారు విశ్వనాధవారి దశరధుడు. అప్పటికి శ్రీరామునికి పదునారేండ్లు. బ్రహ్మర్షి విశ్వామిత్రుని తోడు ఉంది. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. మన గినికి పట్టుమని పదమూడేండ్లు కూడా నిండలేదే! మళ్ళీ తన కుమారుని తాను కనులారా చూడలేదు. మాట్లాడలేదు. ఈ హఠత్సంఘటనకు బిత్తరపోయారామె.

కామకోటి పీఠాచార్యుల వారికి, వారి పూర్వాశ్రమ బంధువులు, తండ్రితో సహా యావన్మందీ సామాన్య శిష్యగణంతో పాటు వచ్చి నమస్కారం చేసుకొంటారు. వారికి ప్రత్యేక మర్యాదలు ఏమీ ఉండదు. తల్లిగారు మాత్రం ఎదురుబడరు. పీఠాధిపతుల మర్యాదననుసరించి పరదేవతకు తప్పించి నమస్కరించే అవకాశం లేదు. అయితే తల్లి ఎదురుబడితే, యతి అయినప్పటికీ నమస్కరించకపోతే ధర్మభంగం అవుతుంది. అందువల్లనే వారు తల్లిగారిని కలుసుకోరు. ఈ విషయం పరంపరగా శ్రీమఠంతో పరిచయమున్న మహాలక్ష్మమ్మగారు ఎరుగుదురు. ఈ ఎఱుక వారికి మరింత దిగులు కలుగచేసి ఉంటుంది.

తరువాత కాలంలో కూడా ఎవరైనా వారి ముందు శ్రీవారి ప్రస్థావన తెస్తే తల్లి తండ్రులిద్దరూ మౌనంలోనికి జారిపోతుండేవారు. బహుశః తమ పుత్రుడు లోకోద్దరణకై అవతరించిన దైవాంశసంభూతుడని సరిపెట్టుకొన్నారేమో! పదమూడు సంవత్సరములుగా పెంచుకొన్న మమకారం, ప్రేమ, ఆశలు సమూలంగా తెంపుకొని తన గారాబు పట్టిని మనకై సమర్పించి వెనుదిరిగారు జగన్మాత. జీవన్ముక్తుని కన్న ఆ తల్లితండ్రులు ధన్యులు. వారిపై తరాలు క్రింది పది తరాలు తరించాయి. స్వామివారి కాలంలో జీవించి వారిని దర్శించిన మనందరం తరించాము.

పట్టుబట్టి అమ్మతో శ్రీమఠానికి బయలుదేరిన గిని శ్రీమఠానికి అధిపతులుగా ఒంటరిగా మిగిలిపోయారు. తరువాతి కాలంలో చాటుగా దర్శించాలనీ, పుత్రుని వాక్యములు వినాలనీ మహాలక్ష్మమ్మగారు రెండు మూడు పర్యాయములు ప్రయత్నించారట. అది తెలుసుకొనిన స్వామివారు అర్ధాంతరంగా ఆ ఊరినుంచే మకాం ఎత్తేశారట. సన్యాసాశ్రమపు నిస్సంగత్వం క్షణికంగానైనా చెదిరిపోతుందేమోనన్న ఒక healthy fear. అయితే తమ 95 ఏళ్ల వయస్సులో వారి అమ్మగారి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు స్వామివారి కన్నులలో ఆ పదమూడేళ్ల మెరుపు, మురిపం ఉత్సాహం కన్పించాయి.

1932 జూన్‌ 14వ తేదిన శ్రీవారు బుగ్గ గ్రామంలో విద్వద్గోష్ఠిలో మునిగి ఉన్నారు. దూరంగా చేతిలో తంతితో మఠం మేనేజర్‌ నిలుచుని ఉండటం గ్రహించారు. కుంభకోణం నుంచే నా టెలిగ్రాం అని అడిగారు. ఔనని సమాధానం వచ్చింది. శ్రీవారు మౌనముద్రాంకితులయ్యారు. సభ నిశ్శబ్ధంగా ఉంది. స్వామి మనస్సులో ఉవ్వెత్తున లేస్తున్న భావతరంగాలు కనులనుండి బయటకు దూకటానికి ప్రయత్నిస్తున్నట్లున్నాయి. మరుక్షణంలో తమాయించుకొన్నట్లు కన్పించారు. మాతృనిర్యాణం విన్న సన్యాసి ఏం చేయాలి అని పండితులను ధీరోదాత్తమైన కంఠధ్వనితో ప్రశ్నించారు. పండితులకు విషయం అర్ధం అయింది. చింతాక్రాంతులయ్యారు. స్వామివారు నిదానంగా లేచి బయలుదేరారు. శిష్యులందరూ భగవన్నామ సంకీర్తనతో స్వామిని అనుసరించారు. స్వామి అక్కడకు రెండు మైళ్ల దూరంలో నున్న జలపాతంలో స్నానం చేశారు. పండితులు, పామరులు, పరివారం, యావత్‌ శిష్యగణమూ శ్రీవారి వెనుకనే స్నానం చేశారు. మఠపక్షాన భూరిదానాలు చేయబడినవి. పదవరోజున పెద్ద ఎత్తున అన్నదానం చేయబడింది.

శ్రీవారు అవతారం చాలించే రోజు ఉదయాన అమ్మగారి జన్మస్థలమైన ఇచ్చంగుడి వేద పాఠశాలలో పెట్టడానికి తీసుకొని వెళుతున్న మహాలక్ష్మమ్మగారి పటం శ్రీవారి ముందుంచబడింది. అప్పటికి శ్రీవారు చాలాకాలంగా మౌనంగా, సహజ సంవిన్మయీ స్థితిలో ఉన్నారు. అయినా ఆ పటాన్ని చూసి, చేతితో ప్రేమగా స్పృశిస్తూ అమ్మ అంటూ గౌరవాదరాలతో అలా ఎంతోసేపు చూస్తూనే ఉన్నారట. ఆ రోజున స్మరించిన ఇంకో విషయం తనకు సన్యాసదీక్ష ఈయబడిన కలవై. శ్రీవారు ఏ ఊరిలో ఉన్నా ప్రతిరోజు సంధ్యావందనం అయిన వెంటనే కనులు మూసుకొని ఖచ్చితంగా ఒక గంట జపం చేసేవారు. ఇది శ్రీమఠంలో ''ఒరుగంట జపం'' గా ప్రసిద్ధి. ఆ ఒక గంట జపం అయిపోయిన తరువాత కలవై వైపుకు తిరిగి నమస్కారం చేసేవారు. అక్కడి గురు పరమగురువుల అధిష్టానాల మధ్య అనేక రోజులు ఆవాసం చేశారు. కలవై అంటే కలయిక అనే అర్ధం కూడా ఉన్నది. ఆ రోజు పదిగంటల సమయంలో ఆకస్మాత్తుగా కనులు తెరిచి కలవై వైపు నమస్కారం చేసి కలవై అన్నారట. అక్కడున్న పారిషదులు శ్రీవారు కలవై వెళ్టాలనుకొంటున్నారేమో అనుకున్నారు. ఈ విధంగా తమ అవతార విరమణ సమయంలో స్వామి తమ జన్మకారకులయిన తమ అమ్మగారిని, పునర్జన్మ కారకులయిన గురు పరమగురువులను స్మరించుకొన్నారు. స్వామిని మనకు ప్రసాదించిన వారు మనందరకూ నిరంతరము స్మరణీయులు.

Dharmakruthi  Chapters   Last Page