Dharmakruthi  Chapters   Last Page 

19. పరాపర గురువులు

రాజాగోవింద దీక్షితుల వారి వంశానికి చెందిన శ్రీ వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులు కామకోటి 64వ పీఠాధిపతులయ్యారు. వీరి సన్యాసాశ్రమ నామము చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి. స్వామివారు పీఠాధిపత్యానంతరము కొంతకాలము కుంభకోణములోనే ఉండి తపస్సు చేశారు. మంత్రశాస్త్రములో మంచి పరిశ్రమ చేశారు. శ్రీవిద్యా సంప్రదాయములో అందెవేసిన చేయిగా ప్రసిద్ధి చెందారు.

అమ్మవారు వీరికి అనవరతము ప్రత్యక్షముగా ఉండేదని ప్రసిద్ధి. ఒకసారి ఔత్తరాహికులైన పండితులు స్వామి దర్శనానికి వచ్చారట. స్వామివారు వారి బసకు, భోజనానికి తగిన ఏర్పాట్లు చేయించి, సన్మానం చేయబోతున్నంతలో వారు తమకు కావలసినది ఈ సన్మానం కాదనీ, స్వామివారితోనే శాస్త్రవాదం కావాలనీ కోరారట. స్వామివారు అలాగే కానీయండని తమ దైనందిక పూజాదికములు ముగించి, తిరువిసైనల్లూరు, కుంభకోణము, తిరువిడైమరుదూరు, తంజావూరు ప్రాంతములలోని పండితులను రావించి విద్వత్సభ ఏర్పాటు చేశారు. ఔత్తరాహ పండితులు సుఖాసీనులయిన తరువాత పూర్వపక్షం ఆరంభించమన్నారు.

పూర్వపక్షం ప్రారంభించిన పండితుడు రెండు మూడు వాక్యములు చెప్పి శ్రీవారి వంకకు చూసి నిశ్చేష్టుడై ఊరకుండి పోయారు. వారిలో వారు మాట్లాడుకొని, చివరకు వారి పెద్ద స్వామివారితో మీ ఒళ్ళో కూర్చుని జ్యోతిలా వెలిగిపోతున్న ఆ బాలిక చిఱు మందహాసపు సొగసు మాకు పై వాక్యం తోచకుండా చేస్తోంది. దయచేసి ఆమెను లోపలికి పంపివేస్తే వాదం ఆరంభిస్తామన్నారట. అక్కడున్న మిగతా పండితగణము, పరిచారక వర్గం ఆశ్చర్యమగ్నులై పోయారు. స్వామివారు చిరునవ్వుతో ''సన్యాసినైన నా ఒళ్ళో దండకమండలాదులు తప్పితే బాలిక ఉండే అవకాశమున్నదా? ధైర్యంగా మీరు పూర్వపక్షాన్ని ఆరంభించండి అన్నారట. వారంతా సాష్టాంగంగా నమస్కరించి ''పరదేవతా స్వరూపులయిన మీతో వాదన కోరడం అపచారం. మా అజ్ఞనాన్ని క్షమించండి'' అని ప్రార్ధించారు. ''అదృష్టవంతులయ్యా మీరు! అమ్మవారి దర్శనం లభించింది'' అని సంతోషపడి తగిన సత్కారములు చేసి పంపారు.

వీరికి తమ మఠ అధ్వర్యములో నడుస్తున్న కామాక్షీదేవాలయపు కుంభాభిషేకము చేయించాలని అభిప్రాయం కలిగింది. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం వారి తోడ్పాడుతో కంచికి విజయం చేశారు. కలాకర్షణ హోమము అయిన తరువాత అమ్మవారి కళను కలశములో ఆవాహన చేసి, అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి, విగ్రహాన్ని కదిలించి జలావాసం చేయించారు. అప్పుడు చూస్తే గర్బాలయము అంతా పటిష్టము చేయవలసిన అవసరం కనిపించింది. ప్రభుత్వం వారు మంజూరు చేసిన ద్రవ్యం, మరి మఠద్రవ్యం కలిపినా ఈ కార్యానికి కావలసిన మొత్తానికి తక్కువగా కనిపించింది. ఇక తప్పదని స్వామివారు మద్రాస్‌ పర్యటనకు బయలుదేరారు.

శ్రీవారు చెన్నపురిలో ఒకరోజు రాత్రి రెండు గంటలకు ధ్యానమగ్నులై ఉండగా అమ్మవారు కనిపించి వారి చేయి తమ శిరోజములపై ఉంచి, పాలాభిషేకం అయిన కురులు ఎలా జటలు కట్టాయో చూడు తైలాభిషేకము ఎప్పుడు చేయిస్తావు. డబ్బులు కొఱతపడితే నేనీయనా అని ప్రశ్నించిందట. ధిగ్గున లేచిన స్వామివారు వెంటనే కాంచీపుర ప్రయాణము సమకట్టారు. ఆ రోజుల్లో మదరాసు నగర ద్వారాలు రాత్రిపూట మూసివేసి ఉంచేవారట. శ్రీవారి కోర్కెపై తెల్లవారక ముందే నగర ద్వారాలు తెరిపించారు తెల్లదొరతనము వారు. స్వామివారు నేరుగా కంచికామాక్షి దేవాలయానికి వెళ్ళి జీర్నోద్ధరణ పనులు పర్యవేక్షించారు. ధనం ఎక్కణ్నుంచి వచ్చిందో కానీ అవసరానికి వర్షించిందట. అమ్మవారికి అష్టబంధన మహాకుంభాభిషేకములు జరిపించి, అమ్మ సన్నిధిలో ఆనందభాష్పములతో మైమరచిపోయారు.

తరువాత మహాస్వామివారు''శ్రీమఠం ఖైదు అయిన కథ''లో వివరించిన తాటంక ప్రతిష్ఠ ఉదంతం, తంజావూరు కనకాభిషేకం జరిగినాయి. కుంభకోణము చేరిన స్వామివారు తమకు అవసాన కాలమాసన్నమయిందని గ్రహించి తదనంతర శిష్యులను స్వీకరించి మహాదేవేంద్రసరస్వతీస్వామి వారనే పేరుతో సన్యాసమిచ్చి, ప్రశాంతచిత్తులై బ్రహ్మలీనులై పోయారు. వీరి అదిష్ఠానము కుంభకోణపు మఠపు పెరటిలో తూర్పు మూలన వడకోటి బృందావనమనే పేరుతో పూజింపబడుతోంది. అయితే వీరి సమయములో శ్రీమఠాన్ని కదలించివేసిన సంఘటనల గురించి చెప్పుకోకుండా వీరి చరిత్ర పూర్తి కాదు.

క్రీ| శ|| 1817 నుండి క్రీ| శ|| 1879 వరకూ శృంగేరీ పీఠములో విరాజమానులయిన ఉగ్రనృసింహభారతీస్వామివారు మహాప్రతిభాశాలురు. మన మహాస్వామివారి మాటలలో మహా తపస్వి, మహాతేజస్వి, చిన్నతనములోనే కాలి నడకన రెండు మార్లు కాశీయాత్ర చేసి విద్యాభ్యాసము చేశారు. మణికుట్టి శాస్త్రిగారి వద్ద ప్రస్తానత్రయ భాష్యశాంతి చేశారు. ఇరవై ఏళ్ళ వయస్సులో శృంగేరీ పీఠాన్ని అదిష్టించారు. అప్పటికి మూడు తరములుగా శృంగేరీ ఆచార్యులు యుద్ద భయం వలన పూనాలో ఎక్కువ కాలం గడిపారని బోడస్‌ వ్రాసిన మరాఠీ పుస్తకంలో ఉన్నది.

వీరు ఆహార భయ నిద్రాదులను జయించినవారు. కేవలం కందమూలాలు కొంతకాలం, కాకరకాయలు కొంతకాలం భుజిస్తూ రోజుకు ఇరవై గంటలు అత్యాశ్చర్యకమైన తపశ్చర్య ఆచరించారు. అణిమాది సిద్ధులు వీరి పాదాక్రాంతమయ్యాయి. శృంగేరీ బిరుదములలో చెప్పబడిన 'సర్వతంత్ర స్వతంత్ర' బిరుదము వీరి యెడ సార్ధకమైనది. వీరిని చూసినంతనే గౌరవభావము కలిగి సంస్థానాధీశులు పాదాక్రాంతులయిపోయేవారని, ఏదైనా ఒక నిర్ణయం తీసుకొంటే దానిని సాధించేదాకా వదిలిపెట్టడం వారి మనస్తత్వం కాదని వారి చరిత్రలో వ్రాసి ఉన్నది. వీరి మహత్తుల గురించిన అనేక సంఘటనలు చెప్పబడినవి. మచ్చుకు ఒకటి రెండు చెప్పుకొందాం.

ఒకప్పుడు వీరు మధుర మీనాక్షి దేవాలయానికి వెళ్ళారు. అమ్మవారికి తామే స్వయంగా పూజ చేయాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. అక్కడి అర్చకులు శైవాగమమునకు సంబంధించినవారు. వారు స్వామివారు సైతం లోపలికి రావడానికి ఒప్పుకోలేదు. ఆగ్రహించిన స్వామివారు అమ్మవారి జీవకళను కొబ్బరికాయలోనికి ఆవాహన చేసి, తమతో విడిదికి పట్టుకొని పోయారు. ఆ విషయం బహిరంగంగా చెప్పి మరీ వెళ్ళారు. అమ్మవారి విగ్రహంలో జీవకళ లోపించిన విషయం అర్చకులు గ్రహించి కాళ్ళావేళ్ళా పడితే క్షమించి స్వయంగా దేవాలయానికి వెళ్ళి తిరిగి కళాప్రతిష్ట చేశారు. ఈ రోజునకు కూడా శృంగేరీ పీఠములో మీనాక్షీ దేవికి ప్రతిదినము మహానివేదనము జరుగుతుందట.

ఒక సంస్థానాధీశులు స్వామివారిని స్వయంగా వచ్చి ఆహ్వానించడానికి బదులు, తమ ప్రతినిధి ద్వారా ఆహ్వానం పంపారట. రాజుగారికి పక్షవాతం వచ్చింది. తన తప్పు గ్రహించి, బుద్ది తెచ్చుకొని, స్వామివారి పాదాలను ఆశ్రయిస్తే క్షమించి సంస్థానానికి విజయం చేశారు. పక్షవాతం గుణమయిందని వేరే చెప్పనక్కరలేదు కదా!

మహదేవశాస్త్రి అనే పేరుగల మహాప్రతిభాశాలి అయిన పండితుడు తన వాదనా పటిమతో అందరిని పరాజితులను గావించి, శృంగేరీ స్వామివారితో, వారి తపోవృద్దత్వాన్ని, జ్ఞానవృద్దత్వాన్ని, వయోవృద్దత్వాన్ని కూడా గణనలోనికి తీసుకోకుండా వాదనలోనికి దిగి స్వామివారినే తికమక పెట్టారట. ''మహాదేవా! నీకు సరస్వతి మంచి వాక్పటిమను ప్రసాదించింది. నా మీదే ప్రయోగింప చూశావు. ఇకనుంచి మరచి పోతావు'' అని నిగ్రహించారట. తరువాత మహదేవులు శివగంగ పీఠాధిపతులుగా చాలా కొద్దికాలం ఉన్నారు. మతిమరుపు సంభవించింది.

వీరి మహిమలు, ఆధ్యాత్మిక ఔన్నత్యం కారణంగా వీరి కీర్తి దిగ్దంతాలకు పాకింది. ఉగ్ర నరసింహభారతీ స్వామివారు శృంగేరీ పీఠపు ఔన్నత్యాన్ని పునరుద్దరించడానికి అహర్నిశలూ కృషి చేశారు. కుడలి, శివగంగ, విరూపాక్ష పీఠముపై వివిధ కోర్టులలో కేసులు వేశారు. అయితే వాదనకు తగిన ఆధారాలు లేకపోవడంతో శృంగేరీ వాదము కొన్ని కేసులలో కోర్టులలో నిలువలేదు. వీరి విస్తృత దక్షిణ దేశ పర్యటనలో కంచి కామకోటి పీఠమునకున్న ప్రత్యేక మర్యాదలన్నీ తాము పొందాలని ప్రయత్నించారు.

1838 లో మహామఖ సందర్బంగా కామకోటి పీఠాధిపతులు పల్లకీలో వెళ్ళే మార్గంలోనే తమ పల్లకీ వెళ్ళాలని పట్టుబట్టారు. అయితే కుంభకోణంలో ఉన్న ఇతర మఠాధిపతులు ఒప్పుకోనందున ప్రభుత్వము వారికి వేరే మార్గము నిర్ణయించింది. మిగిలిన మఠముల ఎదురుగా పల్లకీ పైన వెళ్ళే అధికారం కామకోటి పీఠాధిపతులకే ఉన్నదని నిర్ణయమయింది. 1844 లో అఖిలాండేశ్వరీ దేవాలయ కుంభాభిషేకపు కేసులో వివిధ కోర్టులలో జరిగిన వివాదము శ్రీమఠం ఖైదు అయిన కథలో చూడవచ్చు. 1868 లో తిరిగి కుంభకోణం కామకోటి మఠం వీధిలో ఊరేగింపుగా వెళ్ళడానికి ప్రయత్నించి నిరోధించబడ్డారు. తిరుచ్చి ప్రాంతాలలో అగ్ర సంభావనకు ప్రయత్నించి కలెక్టరు చేత కూడదని కట్టడి చేయబడ్డారు.

మద్రాసు సమీప ప్రాంతాలలో అగ్రపూజకై ప్రయత్నించడం చెన్నపురి మహాజన భకు నచ్చలేదు. అది ఆ ప్రాంతాలకు పరంపరగా గురువులయిన కామకోటి పీఠ మర్యాదకు వ్యతిరేకమని ఆ ప్రాంత ప్రజలలో భావన కలిగింది. ఈ సమయంలో వీరు మదరాసు నగరానికి విచ్చేయనున్నామని చెన్నపురి మహాసభకు శ్రీముఖం పంపారు. మదరాసు మహాజన సభ ప్రత్యేక సమావేశంలో ఈ శ్రీముఖాన్ని చర్చించింది. ఆ నగరంలో సర్వప్రాతినిధ్యం గల సభ నిర్ణయానుసారం ఆ సభాధ్యక్షులు కామకోటి పీఠ గౌరవ ప్రపత్తులకు భంగం కాని విధంగా మాత్రమే శృంగేరీ స్వామివారు మదరాసు విజయం చేయవచ్చునని ఆహ్వానించారు. దానికి ఆ స్వామివారు బదులు వ్రాస్తూ ''శ్రీ కంచి కామకోటి పీఠానికి విరోధము చేయవలెనని అభిప్రాయము ఉండేది లేదని యీ వివరం తెలిసేదీ'' అంటూ సమాధానంగా శ్రీముఖం పంపారు.

పై వివరాలను బట్టీ ఈ స్వామివారిని అన్యధా అర్ధం చేసుకోరాదు. వారు తపస్సంపన్నులు, జీవన్ముక్తులు, మహాపురుషులనే విషయం మనం మరచిపోరాదు. వారి ప్రస్థావన వచ్చినప్పుడల్లా మహాస్వామివారు వారి యెడ ఎంతో గౌరవంతోనే మాట్లాడేవారనే విషయం తెలుసుకోవాలి. అయితే ఎటువంటి మహోన్నతుని ఔద్ధృత్యాన్ని పరాపర గురువులు ఎదుర్కొన వలసి వచ్చింది అని చెప్పడానికే వీరి వృత్తాంతాన్ని చెప్పాను.

Dharmakruthi  Chapters   Last Page