Nadichedevudu   Chapters  

 

4. స్వామితో సంభాషణ

వైకుంఠ ఏకాదశికి కంచి వెళ్లాలని నేను సంకల్పించుకున్నది కంచి వరదుని సేవించుకోడం కొరకే. కామకోటి శంకరాచార్య దర్శనం తలవని తలంపుగా తలస్థించింది. అయినా దాని ప్రభావం నామీద చెరగని ముద్రవేసింది.

ఆ స్వామి పూజావిధానం, ఆపూజలో ఆయన తన్మయత్వం, ఆతన్మయతలో సైతం ప్రతి చిన్న విషయంపై ఆయన చూపిన శ్రద్ధా, ఆ మెలకువా, శ్రీ చంద్రమౌళీశ్వరుని పూలతో పూజించేటప్పుడు, హారతు లిచ్చేటప్పుడు, వింజామరలు వీచేప్పుడు, శ్రీ త్రిపురసుందరీ, చంద్రమౌళీశ్వరులను ఊయలలో ఊపేటప్పుడు, చేత దండం పుచ్చుకుని స్వామి ప్రదక్షిణం చేసేప్పుడు, చివరకు, తన తలపైనుంచి కిందికి జారుతున్న కాషాయాన్ని సవరించుకునేప్పుడు సైతం, కళాశోభితమైన ఆ సౌకుమార్యం, అతిలోక సౌందర్యం, నన్ను పూర్తిగా లోగొన్నవి. రోజులు గడిచిన కొద్దీ వాటి ప్రభావం పదింతలూ, నూరింతలూ అయింది.

మరోసారి కంచికి ప్రయాణం కట్టి, ఆచార్య స్వామిని చూచి రావాలనిపించింది. దూరదూరంనుంచి గాక, దగ్గిరకు వెళ్లి స్వామిని చూడాలనీ, స్వామితో మాట్లాడాలనీ, స్వామి మాటలు ఆలకించాలనే అభిలాష రేకెత్తింది.

ఈ స్వామి అందరు పీఠాధిపతులవంటి స్వామికారనీ, అపురూపమైన అసాధారణమైన ఒక వ్యక్తిత్వం ఏదో ఈయనలో ఉన్నదనీ, అంతకు ముందే నాకు ఏర్పడిన అభిప్రాయం వైకుంఠ ఏకాదశి నాడు ఆయనను సందర్శించిన తరువాత మరింత దృఢపడింది. మహా పురుష సంశ్రయం కోసం మనస్సు ఉవ్విళ్లూరింది.

అయినప్పటికీ, ఆధ్యాత్మికంగా ఒక గురువును అన్వేషిద్దామనో, ఆయన వల్ల ఉపదేశం పొందుదామనో అభిలాష మాత్రం అప్పటికి నాకు లేదు.

చెన్నపురి ఆంధ్రమహాసభలో నాతోపాటు గౌరవ కార్య నిర్వాహకుడుగా ఉంటున్న ఒక న్యాయవాది మిత్రుని తోడు చేసుకుని, ఇద్దరం కలిసి ఒక ఆదివారం మధ్యాహ్నం కంచి చేరాము. స్వామి వారింకా విష్ణుకంచిలో చిన్న మఠంలోనే ఉన్నారు. మా అదృష్టమేమో, మేమక్కడికి చేరినవేళకు స్వామి వెంట, వారి శిష్యలు తప్ప ఇతరులెవరూ లేరు. మా ఇరువురి పేర్లూ ఒక చీటీమీద వ్రాసి, స్వామి దర్శనానికి వచ్చినట్టు శిష్యులతో చెప్పాము.

''ఇప్పుడే భిక్ష ముగించారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. కాసేపటికి వెలుపలికి వస్తారు. కూచోండి'' అని శిష్యులు చెప్పారు.

వారి మాటలు విని మేము కూర్చున్నామో లేదో, మరొక శిష్యుడు వచ్చి, ''స్వామి ఇప్పుడే వస్తున్నారు'' అంటూ, వారు కూచోడానికి ఒక పీట వేశారు.

ఇంతలో చేత్తో దండం పుచ్చుకుని స్వామి రానే వచ్చారు. మేమిద్దరం స్వామికి సాష్టాంగం చేశాము, మా మా ప్రవర, గోత్రనామాలూ చెప్పుకుంటూ. స్వామి మమ్మల్ని తమకు అభిముఖంగా కూచోమన్నారు. ప్రశాంతగంభీరంగా ఉంది స్వామి వదనం. ప్రసన్నతను కుమ్మరిస్తున్నవి ఆయన నేత్రాలు. శరీరకాంతి చెప్పశక్యం కాదు. అప్పటికి స్వామి వయస్సు అరవై డెభ్భయి ఏళ్లమధ్యలో ఉండవచ్చు. వయస్సుచే కాకున్నా, నిరంతర జపతపాల వల్లా, ఉపవాసవ్రతాల మూలంగానేమో శరీరం శుష్కించి, కాస్త ముడతలు పడినట్టు కనిపిస్తున్నది. లోకసేవాచరణంలో ఎవని శరీరం శుష్కించుతుందో వాడే నిజంగా ధన్యాత్ముడంటాడు స్వామి వివేకానందుడు.

శరీరం ఒకింత సడలినా దేహకాంతి మాత్రం దర్శనీయంగా ఉంది. లావణ్యమంటే అదే కాబోలు!

ముక్తాఫలేషు ఛాయాయాః

తరలత్వమివాంతరా

ప్రతిభాతి యదంగేషు

లావణ్యం తదిహోచ్యతే.

ముత్తెపు గోళాల్లో లోలోన చలిస్తూన్న కాంతివలె దేహంపై ప్రకాశించే కాంతి 'లావణ్య'మట.

ఇక ఆ స్వామి నయన సౌందర్యం, అహో! అది వర్ణనాతీతం. నేనేమిటి, దేశ##దేశాల ప్రముఖు లెందరెందరో దివ్య సౌందర్యం వెలిగక్కే ఆ నేత్రకమలాలకు నీరాజనా లర్పించారు.

లోకంలో సాధారణ సౌందర్య ప్రమాణాల ప్రకారం, అంగప్రత్యంగసౌష్ఠవం దృష్ట్యా, స్వామి సౌందర్య వంతుడు కాకపోవచ్చు. కాని, అనిర్వచనీయమైన, అఖిలజనానందకరమైన ఏదో ఒక తేజస్సూ, ఒక వర్చస్సూ, ఆయనలో ఉన్నవి. అదేనేమో బ్రహ్మతేజస్సు!

''గురుకృపాలహరి'' అనే సంస్కృత పద్య కావ్యంలో సుప్రసిద్ధకవులు శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు స్వామి సౌందర్యం ఇలా అభివర్ణించారు:

రక్తాంతస్పృహణీయ దీర్ఘనయనం

స్వాకుంచిత భ్రూలతం!

హాసస్మేరముదార ఫాలఫలకం

స్ఫూర్జత్కపోలారుణం!

శ్రీ కర్ణం సుననం సుచారు రదనం

పూర్ణేందు బింబాననం

వందే శ్రీగురుమూర్తి మిందుమకుటం

శ్రీ కామపీఠాధిపమ్‌''

[కొనలయందు ఎర్రని జీరలతో సొంపునింపు చారడేసి కన్నులు, కొంచెం వాలిన కనుబొమలు, చిరునవ్వుదులకించే వెడల్పయిన లలాటం, లేత ఎరుపురంగు చెక్కిళ్లు, శ్రీకారములవంటి చెవులు, చక్కని ముక్కు, ఇంపైన పలువరస, పున్నమి చందురునికి సాటివచ్చే నెమ్మోమూ కలిగిన కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర గురుమూర్తికి నమస్కారం]

ఇంటి పేరుతో సహా నాపేరూ, ప్రవరా విని, మందహాసం చేస్తూ,

''మీరైతే బ్రాహ్మణులా? మీ ఇంటిపేరులోనూ, మీ ఋషుల పేర్లలోనూ క్షత్రియులా!'' అని స్వామి చమత్కరించారు.

(మాఇంటి పేరు ''నీలంరాజు''. మా గోత్ర ఋషులు, ''హరిత, అంబరీష, యవనాస్య'')

స్వామి విసరిన ఛలోక్తివల్ల మా కొత్తదనం కొంత సడలింది. స్వామికి మేము మరింత సన్నిహితుల మైనాము.

* * *

నేను నా విద్యార్థి దశలోనే మహాత్మగాంధి ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో ప్రవేశించి రాజకీయాల్లో పాల్గొన్నాననీ, టంగుటూరు ప్రకాశంగారు స్థాపించిన ఆంగ్ల ''స్వరాజ్య'' పత్రికలో, కాశీనాథుని నాగేశ్వరరావుగారు నడిపిన 'ఆంధ్రపత్రిక'లో పనిచేశాననీ, రాజకీయాల్లో గాంధి అనుయాయుణ్ణి అనీ స్వామికి విన్నవించాను.

ఆ తరువాత స్వామి నాలుగున్నర గంటలు సావకాశంగా, తెరిపి లేకుండా వివిధ విషయాలను గురించి సంభాషించారు. మన సంస్కృతి, మన చరిత్రా, ఆనాటి మన రాజకీయాలూ, మన దేశనాయకుల వైఖరులూ, మన సంఘసంస్కర్తల నడవడులూ, ఒకటేమిటి- ప్రసక్తానుప్రసక్తంగా సమస్త విషయాలూ చర్చనీయాంశాలు అయినాయి.

దేశవిభజన విషయంలో గాంధి - జిన్నాల మధ్య జరిగిన వాదప్రతివాదాలను, ఉత్తర ప్రత్యుత్తరాలను పూర్వాపరాలతో పూసగుచ్చినట్టు విశ్లేషించి చెప్పారు. కాంగ్రెసు నాయకులు జిన్నాసాహేబ్‌ వ్యూహంలో చిక్కుకున్న పరిస్థితులు ఎలా కల్పించబడ్డాయో, తత్ఫలితంగా అఖండ భారత స్వరూపం ఏవిధంగా అంతరించిందో సహేతుకంగా నిరూపణ చేశారు. (ఈ సందర్భంలో ఇటీవల వెలుగు చూసిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వ్రాతలు స్వామి అభిప్రాయాలను బలపరుస్తున్నాయి.)

నాలుగున్నర గంటలు స్వామి ముచ్చటైన తెలుగులో, నేటి మన ఉపన్యాసకుల ధోరణిలో గాక, మన పూర్వీకులు మాట్లాడుకునే సరళ##మైన వాడుకభాషలో మాట్లాడారు. కాకపోతే, అరవదేశంలో స్థిరపడ్డ తెలుగు ప్రజల యాసమాత్రం అక్కడక్కడా కాస్త తొంగిచూసింది. పండితుల పదాడంబరం మాటవరసకైనా కానరాలేదు. పదంకోసం వెతుక్కోవడం లేదు. తరంగం లేని సముద్రంలో పడవ నడిచినట్టు ప్రసంగం యావత్తు ఆశుకవిత్వంలా సాగింది. యావద్భారతజాతిని కలవరపరచిన ప్రధాన సమస్యలను గురించి అంత తర్కసహంగా, యుక్తియుక్తంగా అనుద్వేగంగా ప్రసంగించడం అందరికీ సాధ్యం కాదు.

అంతసేపు నేనూ, నా మిత్రుడూ శ్రోతలంగా చెవులప్పగించి స్వామి ప్రసంగం విన్నాము. ఆ స్వామి మాట్లాడిన వైఖరి చూస్తే ' శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామి తెలుగువాడే, ఆయన మాతృభాష తెలుగే' నన్న అభిప్రాయం కలిగింది. కాదు, కన్నడమన్నమాట అటు తరువాతనే తెలిసింది.

కాగా, గాంధి - జిన్నాలమధ్య జరిగిన వాద ప్రతివాదాలను, పూర్వా పరసందర్భాలను ఇంచుమించు తేదుల క్రమంగా స్వామి వివరించిన తీరు చూస్తే, ఆయన ధారణాశక్తి ఎంతటి వారికైనా దుర్లభమని తోచింది. అసాధారణమైన ఉపాసనాబలమేదో ఆశక్తికి కారణమై ఉండాలి. లేదా, ఆ మేధాసంపద జన్మసిద్ధమైనా కావాలి.

ఆవిషయం అలాఉంచి, మరో ముఖ్యాంశం గమనించుదాం. నాటి దేశపరిస్థితులను స్వామి చర్చించిన తీరునుబట్టి, దేశ రాజకీయ సమస్యల పట్ల స్వామికి గల అవగాహన గానీ, రాజ్యాంగ పరిజ్ఞానం గానీ కలవారు, అగ్రశ్రేణికి చెందిన రాజకీయ నాయకులలో సైతం ఎందరో ఉండరు.

1894 సంవత్సరం మే నెల 20 తేది, దక్షిణదేశంలోని విళ్లుపురంలో శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీమతి మహాలక్ష్మి పుణ్యదంపతులకు జన్మించిన 'స్వామినాథ' అనే బాలుడు తన 13 ఏట సన్యాసదీక్ష పుచ్చుకుని, చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరుతో కామకోటిపీఠం అధిష్ఠించకుండా, అందరితోపాటు ఆంగ్ల విద్య నభ్యసించి రాజకీయ రంగంలో ప్రవేశించినట్లయితే, గాంధి, నెహ్రూల సరసన ఏ మహానాయకుడుగానో, ఏ ప్రముఖ రాజ్యాంగవేత్తగానో, ప్రపంచఖ్యాతి కాంచే వాడని చెప్పడానికి జ్యోతిశ్శాస్త్రవేత్త కానక్కరలేదు.

మతవిషయాలకు మాత్రమే పరిమితమైన పీఠాధిపతులుగా ఉంటూ, అహర్నిశలు జపహోమతపాదులతో, పూజాపునస్కారాలతో, శాస్త్రపురాణ చర్చలతో, అనుదినం తమ్ము సందర్శించే అశేషభక్తజనుల సమస్యల పరిష్కారంతో నిమగ్నులైన కాషాయధారులకు వర్తమాన రాజకీయాలను గురించి అంతటి సదవగాహనం ఎలా సాధ్యమన్నది ఊహించడానికే వీలుకాని విషయం. ఒక్కరాజకీయమా? చారిత్రకమా? శాస్త్ర విషయమా? ధర్మనిర్ణయమా? ఇంతటి వివిధ విషయాభిజ్ఞత ఎంతటి ప్రజ్ఞావంతుడైనా ఒకేఒక వ్యక్తిలో నిక్షిప్తం కావడం ఎలా సంభవం?...అసదృశం! అపూర్వం!

అయినా, ఇలా ఆశ్చర్యం చెందవలసిన పనిలేదట. వేదానికి భాష్యం రాయడమేగాక, విజయనగరమహా సామ్రాజ్యస్థాపనకు కారణభూతులైన శ్రీ విద్యారణ్యులు ఇలా అంటారు:

తదిత్థం తత్వవిజ్ఞానే

సాధనాను పమర్దనాత్‌

జ్ఞానినా చరితుం శక్యం

సమ్యక్‌ రాజ్యాది లౌకికమ్‌||

''తపస్సువల్ల తత్వజ్ఞానాన్ని బడసి పరిణతులైన మహాజ్ఞానులు, రాజ్యపాలనా సమర్ధులు కూడా కాగలరు''



లోకక్షేమం

మన లోపాలను మనం సంస్కరించుకోనిపక్షంలో లోక క్షేమం కోసం యత్నించే అధికారం మనకు లేదు.

మానసికదౌర్బల్యాన్ని అణచి, దుఃఖాతీతుడై ఆత్మోపలబ్ధి నందుకొన్న వాడి ఉనికి ప్రపంచ సౌఖ్యానికి కారణ మవుతుంది. అతడు ప్రపంచసంస్కరణకు పాటుబడ నవసరంలేదు. లోకక్షేమం తానుగా సిద్ధిస్తుంది.

Nadichedevudu   Chapters