Nadichedevudu   Chapters  

 

12. 'అమ్మతో చెప్పుకో నీగోడు'

స్వామి కంచి పొలిమేరల్లో ఉన్న శివాస్థానం వద్ద మకాంచేస్తూ ఉన్నప్పుడు తమిళ దేశం నుంచి ఒక పేద బ్రాహ్మణుడు స్వామిని సందర్శించాడు.

తన కుమార్తె వివాహం తలపెట్టుకున్నాననీ, అయితే వరుడి తర పువారు వరకట్నంకింద పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారని, ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకులేదనీ, ఏదైనా దారి చూసిస్తారనే ఆశతో అక్కడికి వచ్చాననీ దీనాతిదీనంగా విన్నవించుకున్నాడు.

''స్వామీ, వేరే దిక్కులేక మీ వద్దకు వచ్చాను. మీరు అనుగ్రహిస్తే తప్ప, నా కుమార్తెకు మెళ్లో మూడు ముళ్లూపడే అవకాశంలేదు'' అని కంటనీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకు నిలబడ్డాడు.

స్వామి: నేను సన్యాసిని. నీ కివ్వడానికి నావద్ద బంగారం ఎక్కడ ఉంటుంది? నా ఎదుట విలపిస్తే ఏం లాభం? ఊళ్లోకి పోయి, అమ్మ (కామాక్షీదేవి) దగ్గర కూచోని, ఆ తల్లికి నీ గోడు చెప్పుకో! నీ ఘోష విని ఆమె ఏమైనా కటాక్షించవచ్చు.

'సరే, అట్లాగే చేస్తా' నంటూ ఆ బ్రాహ్మణుడు అంగోస్త్రం నడుముకు బిగించుకుని, కాంచికామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లి, ఆ దేవికి ఎదురుగ్గా కూచుని ఆమెను ప్రార్థించాడు.

కొంతసేపయింది. ఉత్తరదేశంనుంచి ఎవరో ఒక షావుకారు స్వామిని దర్శించడానికి శివాస్థానం వచ్చాడు. స్వామికి నమస్కరించాడు. స్వామి కుశలప్రశ్న చేశారు.

స్వామివద్ద సెలవు పుచ్చుకుని వెళ్లబోయేముందు ఆ షావుకారు లోపలి జేబులోనుంచి ఒక పొట్లం తీసి, శిష్యుడిచేత ఒక పళ్లెం తెప్పించి, ఆ పొట్లం ఆ పళ్లెంలో పెట్టి, స్వామికి సమర్పించాడు.

''ఏమిటి ఆ పొట్లం?'' అని అడిగారు స్వామి.

''అందులో కాస్త బంగారం ఉంది. దానిని తమకు సమర్పించుకుంటున్నాను'' అన్నాడు షావుకారు.

స్వామి: ''సన్యాసికి నాకెందుకు ఆ బంగారం? నన్నేమి చేసుకోమంటావు?''

షావుకారు: స్వామీ, మీకు సమర్పించాలని ఎందుకో నాకు అనిపించింది. దానిని మీ చిత్తం వచ్చినట్టు వినియోగించండి. మీరు ఏమి చేసినా నాకు సమ్మతమే.

''సరి. పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది. సుఖంగా వెళ్లిరా'' అని దీవించారు స్వామి.

* * *

షావుకారు బయలుదేరి వెళ్లిన కాసేపటికి, కుమార్తె పెళ్లి నిమిత్తం వచ్చిన బ్రాహ్మణుడు అమ్మవారి గుడినుంచి తిరిగి వచ్చాడు.

''స్వామీ, తాము సెలవిచ్చినట్టు అమ్మ దగ్గరకు వెళ్లి నా కథంతా వెళ్లబోసుకున్నాను. ఎట్లాగైనా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించాలి'' అంటూ స్వామి ముందు కూలబడ్డాడు.

పక్కన బల్లపైన ఉన్న పళ్లెం చూపించి, స్వామి ఇలా అన్నారు. ''ఆ పళ్లెంలో ఒక పొట్లం ఉన్నది. ఆ పొట్లంలో ఏమున్నదో, దానిని విప్పిచూడు.''

వణుకుతున్న చేతులతో బ్రాహ్మణు డా పొట్లం విప్పి చూశాడు.

స్వామి: ''ఏం ఉన్నది పొట్లంలో?''

బ్రాహ్మణుడు భయంతో, సంభ్రమంతో ''బంగారు కాసులున్నవి స్వామీ!''

స్వామి: ''ఎన్ని ఉన్నవి? లెక్కపెట్టు.''

బ్రాహ్మణుడు: (లెక్కవేసి) ''పదమూడు కాసులు'' అంటూ తడబడుతూ, తడబడుతూ సమాధానం చెప్పాడు.

స్వామి: నీ వెన్ని కాసులు కావా లన్నావు?

బ్రాహ్మణుడు: పదమూడే, స్వామీ!

స్వామి: సరే. సరే, అవి తీసుకు వెళ్లి నీ కుమార్తె వివాహం చేసుకో!

బ్రాహ్మణుడు ఆనందబాష్పాలతో ''అనుగ్రహంస్వామీ, పరమానుగ్రహం'' అంటూ స్వామి పాదాలకు సాగిలబడ్డాడు.

- టి.కె. త్యాగరాజన్‌





గాంధిజీ - అహింస

అవశ్యాచరణీయమైన అహింస కూడా అన్ని యెడలా, అన్నిచోట్లా, అన్ని వేళలా పనికి రాదు. గాంధిజీ వంటి అహింసావ్రతుడు కూడా ఆబెయ్య బాధా విముక్తి కొరకు హింస నవలంబించవలసి వచ్చింది.

Nadichedevudu   Chapters