Nadichedevudu   Chapters  

 

11. ఆ తల్లికి కలిగిన ఆనందం అడుగుతారూ!

కరుణా జలధి కామకోటి చంద్రశేఖరేంద్ర సరస్వతి దయకు పాత్రులైనవారు ఒక వింత అనుభవానికి లోనవుతారు. అది ఎంత ఆనందదాయకమో, అంత ఆశ్చర్యజనకం.

అందుకు చక్కని ఉదాహరణలు రెండు సంఘటనలను తాను కళ్లారాచూసి ఆనందించి, తన ఆనందాన్ని నాకు పంచియిచ్చిన సహృదయులు, స్వామిభక్తులు 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' పత్రికావ్యవస్థకు మాజీ జనరల్‌ మేనేజర్‌ శ్రీ టి.కె. త్యాగరాజన్‌!

* * *

తంజావూరుజిల్లా పేరాలం జంక్షనుకు మూడు మైళ్లదూరంలో విల్లుకుడి అనే గ్రామం ఉంది. 1949లో శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతిస్వామి ఆ ఊళ్లో నాలుగు రోజులు మకాం చేశారు.

ఆ ఊళ్లో మా అక్కగా రున్నారు. పాదపూజ చెయ్యడానికి ఆమె స్వామిపాదులను తన ఇంటికి ఆహ్వానించి, ఆ రోజుకు నన్ను కూడా అక్కడికి రమ్మని కబురు చేసింది.

స్వామి దర్శనంకోసం ఆ ఊరి వాళ్లూ, చుట్టుపక్కల గ్రామస్థులూ, వందలాది ప్రజలు వచ్చారు.

పూజ ముగిసింది. భక్తు లందరికీ స్వామి తీర్థం ఇస్తున్నారు. తీర్థం పుచ్చుకుంటున్న వారిలో బొంబై నుంచి వచ్చిన భార్యా భర్తలు ఇద్దరున్నారు. ఆ రాత్రే వారు తిరిగి బొంబైపోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. వారితోబాటు, వారి కుమారుడు కూడా ఉన్నాడు: సుమారు 25 ఏండ్ల యువకుడు.

దంపతు లిరువురూ తీర్థం తీసుకున్నారు. కుమారుడు తీర్థం కోసం చెయ్యిజాపాడు.

''నీవూ, నీ భార్యా ఇద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి'' అన్నారు స్వామి.

ఆ మాట విని తెల్లబోయాడు ఆ యువకుడు. దేనికో తటపటాయిస్తున్నాడు. ఇంతలో పక్కగా నిలిచిన ఆడవాళ్లవైపు నుంచి ఇంచుమించు ఇరవై సంవత్సరాల ఒక యువతి గబగబా ముందుకువచ్చి, ఆ యువకుడితోపాటు తానూ చెయిజాపింది. ఇద్దరూ కలిసి తీర్థం పుచ్చుకున్నారు.

తీర్థం తీసుకుని ఆ అమ్మాయి ఆ యువకుడి వెంట ఉండకుండా, దూరంగా వెళ్లి నిలబడ్డది.

స్వామి ఆ నలుగురినీ ఆశీర్వదించి, బొంబై వెళ్లండని ఆనుజ్ఞ ఇచ్చారు.

* * *

ఈ తతంగ మంతా చూస్తున్న మాకు ఆశ్చర్యం వేసింది.

బొంబైనుంచి వచ్చిన తలిదండ్రు లిద్దరికీ స్వామి తీర్థం మివ్వడమేమిటి, కుమారుడు రాగానే, 'భార్యా భర్తలు ఇద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి' అని ఆదేశించడం ఏమిటి, ఆ యువకుడి భార్య, ఎక్కడినుంచో ఊడిపడినట్టువచ్చి, తీర్థం పుచ్చుకుని, తిరిగి దూరంగా వెళ్లి నిలబడడ మేమిటి, నలుగురూ కలిసి బొంబై వెళ్లండని స్వామి వారిని ఆజ్ఞాపించడమేమిటి? ఇదంతా ఏదో వింతగా తోచింది అందరికీ!

బొంబై నుంచి వచ్చిన ఆ పెద్దమనిషిని సమీపించి, ఆయనను అడిగాను ''ఏమిటి ఈ వ్యవహారమంతా?'' అని

ఆయన కాస్త ముందు వెనకాడాడు తమ ఉదంతం చెప్పడానికి, తరవాత బయటపెట్టాడు కథ. కట్నం విషయంలో ఏదో కొంత పేచీ వచ్చిందనీ, ఆ కారణంగా మూడు సంవత్సరాల నుంచీ తన కొడుకూ కోడలూ కలిసి కాపురం చెయ్యడంలేదనీ, తమ కోడలు అక్కడికి వచ్చే సంగతి తమకు ముందుగా తెలియదనీ, తాము స్వామి దర్శనం నిమిత్తం మాయూరం నుంచి కారులో వచ్చామనీ, స్వామి ఆజ్ఞ ననుసరించి, ఇప్పుడిక కోడలును కూడా వెంటబెట్టుకుని బొంబైకి వెళ్లదలిచామని కథంతా వెళ్లగక్కాడు.

అంతటితో నేను తృప్తిచెంది ఊరుకోలేదు. ఆ అమ్మాయిని అడిగాను - ''ఏమిటమ్మా నీ పరిస్థితి?'' అని. భరించలేని ఆవేదనతో ఆ అమ్మాయి మాట్లాడలేకపోయింది. అంతట, పక్కనే ఉన్న ఆ పిల్ల తల్లి ఇలా చెప్పింది.

''కట్నం విషయంలో వచ్చిన మనస్పర్థల వల్ల మూడేళ్లుగా నా కూతురు నా దగ్గరే ఉంటున్నది. స్వామితో మా అవస్థ చెప్పుకుంటే, స్వామి ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో మేము ఇక్కడికి వచ్చాము. అంతేగాని, మా వియ్యంకుడూ, వియ్యపురాలూ, అల్లుడూ, వీరంతా ఇక్కడికి వచ్చే సంగతి ముందుగా మాకు తెలియదు. ఈ మూడేళ్లనుంచీ మాకూ వారికీ ఉత్తర పత్తరాలేమీ లేవు. ఇదంతా మాకూ వింతగానే ఉంది. అంతా స్వామిదయ!''

బొంబై కుర్రవాడు తీర్థం పుచ్చుకోడానికి చెయిజాపినప్పుడు. 'భార్యాభర్తలిద్దరూ కలిసి తీర్థం పుచ్చుకోండి' అని స్వామి సూచించడానికి, ఆ యువకుని భార్య అక్కడే ఉన్నట్టు స్వామికి ఎట్లా తెలుసు?

ఈ ప్రశ్నకు సమాధానం ఎవ్వరూ చెప్పలేరు.

కోడలును కూడా వెంటబెట్టుకుని నలుగురూ బొంబైకి వెళ్లండని స్వామి ఆదేశించారు కాబట్టి, వెంటనే బయలుదేరి తమతో రమ్మని పిల్లవాని తండ్రి కోడలుతో చెప్పాడు.

''మేము ఇక్కడికి వచ్చేటప్పుడు బొంబై ప్రయాణం సంగతి మాకు తెలియకపోవడంచేత, అమ్మాయి తన బట్టలు తెచ్చుకోలేదు'' అన్నది పిల్ల తల్లి.

''లేకపోతే పరవాలేదు. అమ్మాయికి కావలసిన బట్ట లన్నీ మేము బొంబైలో కొంటాము.'' అంటూ కోడలును వెంటబెట్టుకుని బయలుదేరారు బొంబై ఆసాములు!

ఆ అమ్మాయి తల్లికి కలిగిన ఆనందం అడుగుతారూ!!!







ఇతర ధర్మాలన్నీ వేదం నుంచే

ఇతర మతకర్తలు చెప్పిన ధర్మాలన్నీ పరిశీలించి చూస్తే, అవి వేదాలలోనే కనిపిస్తాయి. ఇతర ధర్మగ్రంథాలన్నీ వేదాలకు పిమ్మటనే పుట్టినట్టు చరిత్రవల్ల తెలుస్తున్నది. వేదాలు చెప్పని ధర్మమూ, సత్యమూ లేవు. వేదమెప్పుడు పుట్టిందో మనం నిర్ణయించలేము. వేదకాల నిర్ణయం చేయబూనడం నష్టజాతకాన్ని గుణించడం వంటిది.

Nadichedevudu   Chapters