Maa Swami    Chapters   

10. బ్రంటన్‌ కథ

''విశాఖ''

పాల్‌ బ్రంటన్‌ క్రీ.శ. 1898 లో లండనులో జన్మించారు. విద్యాభ్యాసం ఇంగ్లాండులోను, అమెరికాలోనూ జరిగింది. తత్త్వశాస్త్రంలో ఆయన డాక్టరేటు పుచ్చుకొన్నారు. బహుగ్రంథకర్త. ఆయన పుస్తకాలు బహుభాషలలో అనువదింపబడినవి. 'గుప్తభారతంలో అన్వేషణ' (A Search in Secret India) అనే పుస్తకం వారు వ్రాశారు. ఊ పుస్తకం పందొమ్మిది ముద్రణలు చూచింది.

ఈ పుస్తకంలో తత్త్వాన్వేషణకోసం ఆయన ఎన్నిపాట్లు పడ్డారో వివరంగా వర్ణించారు. ఎంతో మంది యోగులను, మహాత్ములను దర్శించినారు. సత్యదర్శనకోసం తహతహలాడి గురువును అన్వేషిస్తూ ఆయన భారతదేశానికి వచ్చారు. కానీ ఆయనకళ్ళకు అధికముగా కనబడినవారు ఫకీరులూ, ఇంద్రజాలము చేసే మోసగాళ్ళు. కొన్నిచోట్ల మహాత్ముల దర్శనం చేసినా, వారు ఆయన మనస్సును పూర్తిగా ఆకట్టుకొనలేక పోయారు. ''నేను వట్టిచేతులతో భారతంనుండి తిరిగి వెళ్ళిపోవాలా? పాతకాలపు ఋషులు ఈ దేశంలో నామరూపాలు లేకుండా మాయమైపోయారా'' అన్న నిరుత్సాహంకూడ ఒకపుడు ఆయనకు కలిగింది.

మద్రాసులో మకాం చేస్తున్నపుడు, ఆయన వెంకటరమణి అనే ఒక రచయితను కలుసుకోవటం తటస్థించింది. వెంకటరమణిని పరిచయంచేస్తూ వ్రాసిన తన స్నేహితునిలేఖ ఆయన తెచ్చాడు. ఆయనపెట్టెలో ఎన్నో ఈలాంటి పరిచయ పత్రాలు ఉన్నాయి.... వానినేవీ ఆయన వాడదలుచుకోలేదు.

వెంకటరమణి మద్రాసు యూనివర్సిటీలో సెనేట్‌ మెంబరు. ప్రతిభావంతుడైన రచయిత. ఆయన వ్రాసిన పుస్తకాలలో- గ్రామజీవితం ఇతివృత్తం. నిరాడంబరమైన జీవి. వెంకటరమణి పాల్‌ బ్రంటన్‌ను చూడటానికి వచ్చారు.

ఇద్దరూ ఇష్టాగోష్టి చేశారు. రాజకీయాలు చర్చించారు. తమ అభిమాన పాత్రులైన కవుల కావ్యాలను ఉగ్గడించారు. ఈ సంభాషణ మధ్యలో బ్రంటన్‌ తాను ఏ కార్యార్ధం భారతదేశం వచ్చారో వెల్లడించారు. 'భారతదేశంలో నిజమైన యోగులున్నారా? వారిని తాను దర్శించగలడా? వారు తనకు తత్త్వాన్వేషణలో సాయపడగలరా?'

అందులకు వెంకటరమణి ఇలా అన్నారు. ''ప్రస్తుతం ప్రజలధ్యాస ప్రాపంచిక సౌఖ్యాలపైననే ఉంది. తత్త్వాన్వేషణ చేసేవారు చాలతక్కువ. భారతదేశంలో మహనీయులు లేకపోలేదు. కాని వారిని వెదికి పట్టడం కష్టం. వాళ్ళెక్కడో, జనసంపర్కంలేని చోటులలో ఏకాంతంగా ఎవరికీ తెలియరాక గడుపుతూవుంటారు. వారిని కనుక్కోవటం మాబోటి వారికే కష్టం. మీబోటి పాశ్చాత్యులకు దాదాపు దుర్లభ##మే. మీరు అదృష్టవంతులైతేగాని వారిని దర్శించలేరు. దానికీ యోగం ఉండాలి.''

మరుసటిరోజు వెంకటరమణి ఆకస్మికంగా పాల్‌ బ్రంటన్‌ వద్దకు వచ్చారు. క్రిందిరోజు సంభాషణ గుర్తుతెస్తూ ''మాగురువు చెంగల్పట్టులో విడిదిచేసినట్లు తెలిసింది. వారు శంకరాచార్య పరంపరకు చెందినవారు. దక్షిణభారతానికి వారు ఆధ్యాత్మికాచార్యులు. వేలకొలది జనులు వారిని భగవదంశగా గ్రహించి ఆరాధిస్తారు- వారి కటాక్షం నాయందున్నది. వారు ఋషితుల్యులు. ఆ మహానుభావుణ్ణి మీరు దర్శింపగలిగితే మీకు వారు యోగుల విషయంలో ఏదైనా త్రోవచూపకపోరు'- అని అన్నారు.

వెంకటరమణి, బ్రంటనూ చెంగల్పట్టు ప్రవేశించి స్వామి విడిదిచేసినచోటుకు వెళ్ళారు. జన సమ్మర్దం ఎక్కువగా ఉన్నది. రెండువందలకు పైగా జనం కాచుకొని ఉన్నారు స్వామి దర్శనార్ధం. వెంకటరమణి ఎలాగో కష్టపడి బ్రంటనుకు దర్శనసౌలభ్యం కల్పించాడు. బ్రంటనుకై స్వామి తన కార్యక్రమాన్ని మార్చుకొని, ఒక గంటలో రావచ్చునని కబురు ప్య:్య: ఎలాగో కష్క·ž్ఱ్వషణకోసం ఆయన ఎన్నిపాట్లు పడ్డారో వివరంగా వర్ణించారు. ఎంతో మంది యోగులను, వంపారు.

చిన్న ద్వారంకల గదిలో స్వాములవారు కూర్చుని ఉన్నారు. వెనుకవున్న ద్వారంనుండి వెలుగు వస్తున్నది. స్వాములవారిని సమీపించి బ్రంటను తాను తెచ్చిన ఫలపుష్పాలను అర్పించి వందనం చేశారు. నిశ్చలంగా నాతిహ్రస్వం, నాతిదీర్గంగా ఉన్న స్వామి శరీరం, వారి కాషాయ వస్త్రములూ, బ్రంటను చూచారు. స్వామి వయస్సు అపుడు దాదాపు నలభై. స్వామివారి ముఖవర్చస్సుకు బ్రంటన్‌ ముగ్ధులైపోయారు. వారి కళ్ళలోని ప్రశాంతిని గుర్తించారు. బ్రంటన్‌ ఆంగ్లంలో మాట్లాడగా, వెంకటరమణి స్వామివారి జవాబులను అనవదించి బ్రంటన్‌కు తెలియచేశారు.

వెంకటరమణికి స్వామి త్రికాలజ్ఞానసంపన్నులని చాల నమ్మకం. అందుచేత బ్రంటన్‌ ప్రపంచ భవిష్యత్తునుగూర్చి స్వామిని ప్రశ్నించదలచి;

ప్రపంచములోని రాచకీయ ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడు మళ్ళా కుదుట బడుతాయని మీరు అనుకొంటున్నారు? అని అడిగారు. ''ప్రపంచంలో మార్పు అంత సులభంగా రాదు. దానికి కొంత వ్యవధి అవసరం. దేశాలు మారణాయుధములకోసం ప్రతి సంవత్సరం కోట్లకొలది ఖర్చుపెట్టుతున్న కాలంలో అభివృద్ధి ఎలా సాధ్యం?''

''కానీ నిరాయుధీకరణగూర్చిన మాటలుకూడ ఈరోజుల్లో వినవస్తున్నవి. వాని ప్రభావం ప్రపంచ పరిస్థితులపై ఉంటుందికదా?''

''యుద్దనౌకలు భగ్నంచేసినా, మారణాయుధాలు తుప్పుపట్టినా ప్రజలు ఆయుధాలు లేవుకదా అని ఊరుకోరు. కఱ్ఱలసాయంతోనైనా యుద్ధం చేస్తారు. మారవలసినది మనస్తత్వం. ఆయుధ పరికరాలు కాదు. దేశాలమధ్య జాతుల మధ్య పరస్పర సౌహార్దృం నెలకొల్పాలి. ఆధ్యాత్మిక దృక్పథంతో దేశాలమధ్యనా దేశంలోకూడా సమత్వం సాధించాలి. అటువంటి పరిస్థితులు ఏర్పడితేకానీ, శాంతి సౌభాగ్యాలురావు.''

''ఆ స్థితి చాలదవ్వులో ఉన్నట్లు కనిపిస్తుంది. మరి వేరే విమోచన ఏదీ లేదా?''

''భగవంతుడు ఒకడు ఉన్నాడుకదా!''

''భగవంతుడే వుంటే ఆయన చాలదూరంలో ఉన్నట్లున్నది.''

''భగవంతునికి మానవాళిపై ప్రేమ ఎన్నడూ వుంటుంది.''

''ఈ విపత్కర పరిస్థితులనుచూస్తే, భగవంతుని ప్రేమకు బదులు ఆయన నిరాదరణ నాకు కనిపిస్తోంది'' అని బ్రంటన్‌ అసహనంగా అన్నారు. తర్వాత తన తొందరపాటుకు నొచ్చుకొన్నారు. స్వామి వింతగా చూస్తూ?

''సహనశీలి దృష్టి ఎప్పుడూ గంభీరంగా వుంటుంది. మానవులను నిమిత్తమాత్రంగా చేసుకొని భగవంతుడు సకాలంలో తన కార్యాలను చక్కదిద్దుతూ వుంటాడు. దేశాల మధ్య ఉన్న సంక్షోభం, ప్రజలలోని నైతికపతనం, కోట్లాదిజనుల ఆర్తనాదం- అన్నీ కలసి, ఒక మహాత్ముని రాకకు కారణం ఔతుంది. ప్రతి శతాబ్దంలోనూ, ఎవరో ఒకరు మహానుభావులు పుట్టుతూనే ఉంటారు. ఆధ్యాత్మిక పతనం ఎంతెంత గొప్పగా వుంటుందో, అంత గొప్ప మహాత్ముడు దానిని ప్రతిఘటించడానికి జన్మిస్తూ ఉంటాడు.''

'ఐతే మనకాలంలో కూడా అలాంటి మహాత్ముడు ఉదయిస్తాడంటారా?'

'ఆ! మనం ఉన్న శతాబ్దంలో ఇప్పుడున్న చీకటిని తొలగించడానికి ఒక కారణజన్ముడి అవసరం ఎంతైనా ఉన్నది. అంటే మీ అభిప్రాయంలో, మనుష్యుడు అత్యంత పతనావస్థకు వచ్చినాడనియా?''

'లేదు. నేను ఆవిధంగా అనుకోవటం లేదు. ప్రతి జీవిలోనూ, ఆత్మపదార్ధం ఒకటి వున్నది. అది కట్టకడపట జీవిని భగవంతుని వద్దకు తిరిగి తీసికొని వస్తుంది.'

'మా పాశ్చాత్యదేశాలలో మనుష్యులను చూస్తే, వాళ్ళ హృదయసీమలలో భగవంతుడుకాదు క్రూరపిశాచం ఉన్నట్లు అనిపిస్తుంది.'

'మనం మనుష్యులను దూషించి ప్రయోజనం లేదు. వాళ్ళ పరిసరాలనూ, వాతావరణమూ అర్ధంచేసుకోవాలి. ప్రజలు పరిసరాలకు లోబడి వ్యక్తిగతంగా ఉన్న మంచిని మరచిపోయి దుర్మార్గంలోపడిపోతున్నారు. ఈ విషయం ప్రాచ్య ప్రతీచీదేశాలకు రెంటికి అనువర్తిస్తుంది. సమాజానికి మనం ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని గుర్తుకు తేవాలి. ఆర్ధిక సంపద ఒక్కటే చాలదు. దానికి తోడుగా ఆధ్యాత్మిక సంపదా ఉండాలి. ఈ రెంటి సమన్వయం సాధిస్తేకాని లోకానికి ముక్తిలేదు. కాలు జారినపుడంతా మళ్ళా మనం లేచి తిరుగుతున్నాం. అదేవిధంగా ఈ పతితావస్థకూడా అదృశ్యమై ఒక ఉన్నతస్థితి రావడానికి ఆస్పదం ఉన్నది.'

'అంటే మీరు లోకవ్యవహారంలోకూడా ఆధ్యాత్మిక సూక్తులను ప్రవేశ##పెట్టాలని అంటారా?'

'ఔను. అది ఆచరణీయమే. లోకవ్యవహారంలో ధర్మనిష్ఠ ఏర్పడితే అది బహుజనసహితంగానూ, బహుజనసుఖంగానూ ఉంటుంది. భారతదేశంలో రాజకీయాలలో కూడ మహాత్ముల సలహాలను తీసుకొనే ఆచారం వున్నది. ప్రపంచంలో అన్ని దేశాలవారూ ఈ ఆచారాన్ని పాటించగలిగితే శాంతీ సౌఖ్యములకు కొదవ ఉండదు.'

''మీరు ఈ పీఠానికివచ్చి ఎన్నేళ్ళైనది?''

''నేను ఈ పీఠానికి 1907లో వచ్చాను. అప్పుడు నాకు పండ్రెండేళ్ళు. తర్వాత నాలుగేళ్ళు ధ్యానంలోనూ, విద్యాభ్యాసంలోనూ కావేరీతీరంలో ఒక గ్రామంలో గడిపాను. అటు తర్వాతనే, మఠనిర్వహణ కార్యంలో నేను ప్రవేశించాను. 1918లో నేపాలు మహారాజావారు తమ దేశానికి రమ్మని ఆహ్వానించారు. తర్వాత ఉత్తరదిశగా మేము ప్రయాణం చేశాము. కాలినడకన రోజూ ఎక్కువదూరం పోవటానికి వీలులేదు. ఈ ప్రయాణం కొన్ని సంవత్సరాలకాలం పట్టింది. దారిలో ఒక్కొక్క గ్రామంలోనూ విడిదిచేయాలి. ఎవరన్నా ఆహ్వానిస్తే వారికోరిక త్రోసివేయడానికి వీలులేదు. స్థానిక ఆలయంలో ప్రవచనం చేయవలసి వస్తుంది ప్రజల కోరికపై.''

''నేను నిజమైన యోగిని దర్శించాలని ఉత్సహపడుతున్నాను. నేను చూచినవారంతా మట్లాడేవారే. వారి యోగసిద్ధి ప్రత్యక్షముగా కనబడటంలేదు. ఈ నా కోరిక ఏమన్నా విపరీతమా?''

స్వాములవారు ప్రశాంతంగా బ్రంటన్‌వైపు చూచి, తమ చిబుకమును వ్రేళ్ళతో తడువుతూ ఇలా అన్నారు.

''నిజమైన యోగంలో ప్రవేశం మీరు వాంఛిస్తున్నారంటే అదేమీ విపరీతమైన కోరికకాదు. మీ భావశుద్ధే మీకు సహాయకారి ఔతుంది. మీ వాంఛితార్ధాన్ని నేను చూడగలుగుతున్నాను. మీలో ఒక జ్యోతి వెలగడానికి ప్రారంభించింది. ఆ జ్యోతియే మీరు కోరిన చోటుకు మిమ్ములను తీసుకవెళ్ళగలదు.''

''అయితే మీరు ఈవిషయంగా ఏమి సలహా ఇస్తారు?''

''మీ యాత్రలన్నీ పూర్తిచేయండి. మీ యాత్రలలో చూచిన మహాత్ములలో మీకునచ్చిన వారిని ఎన్నుకోండి. ఆయనవద్దకు వెళ్ళితే, ఆయన మీకు తప్పక ఉపదేశం చేస్తాడు.''

''ఒకవేళ నాకు ఎవరూ నచ్చకపోతే? అప్పుడు ఏమి చేయమంటారు?''

'అపుడు ఐకాంతిక భక్తిని చేయాలి. దేవుడే కావలసిన ఉపదేశమిస్తాడు. క్రమంగా ధ్యానం అలవాటు చేసుకోండి. ఉత్తమవిషయాలను, అనురాగంతో భావనచేయండి. తరచు ఆత్మవిషయమై చింతన చేయండి. ఈ ఆత్మచింతన, ఆత్మను దాపులోనికి తెస్తుంది. ఉదయం లేవగానే ధ్యానంచేయటం మంచిది. తర్వాత సాయంసమయం అనుకూలమైన కాలం. అపుడు లోకం ప్రశాంతిగా వుంటుంది. ధ్యాననిరోధములైన విషయములు ఆ కాలంలో తక్కువ.'

''ఒకవేళ నేను ఆ ప్రయత్నలో విఫలమొందితే మీవద్దకు సహాయానికి రావచ్చునా?''

ఈ మాటకు స్వాములవారు తల అడ్డంగా ఆడించారు. ''నేను మఠాధిపతిని. నాకు విరామం అంటూ ఉండదు. నాకున్న కాలమంతా మఠ నిర్వహణలోనే సరిపోతుంది. కొన్ని సంవత్సరాలు నేను మూడుగంటలకు పైగా నిద్రపోయినది లేదు. అలాంటపుడు నేను ప్రత్యేకంగా శిష్యులను ఏలా స్వీకరించగలను? మీకు తనకాలాన్ని ఇవ్వగల మహాత్ముణ్ణి మీరు వెదకాలి.''

''నిజమైన మహాత్ములు అరుదు అని అంటారు. అందులోనూ నాలాంటి పాశ్చాత్యునికి అతడు సుదర్లభుడు.''

స్వాములవారు తల ఊపి,

''సత్యమెప్పుడూ ఉన్నదే. దానిని తెలుసుకోనూవచ్చు''

'మీరు అలాంటి ఒక సిద్ధపురుషుని వద్దకు నన్ను పంపలేరా?''

స్వాములవారు కొంతసేపు మౌనముద్ర వహించారు. కొంతసేపయిన పిదప ఇలా అన్నారు;

''నాకు తెలిసిన మహాత్ములు ఇద్దరు ఉన్నారు. ఒకరు కాశీలో వున్నారు. వారిని దర్శించటం కష్టం. ఇంతవరకూ ఏ పాశ్చాత్యుడూ వారిని చూచినదిలేదు. వారివద్దకు మిమ్ములను పంపితే వారు మిమ్ములను అంగీకరించక పోవచ్చును.''

''మరి రెండోవారో?''

''ఆయన దక్షిణదేశంలో ఉన్నారు. వారివద్దకు మీరు వెళ్ళవచ్చును. ఆయనను మహర్షి అని అంటారు. వారు అరుణాచలంలో ఉన్నారు. మీరు దక్షిణంవదలిపోయేదానికి ముందు వారిని తప్పక దర్శించండి. మీ అభీష్టం నెరవేరుతుంది. ఆదుర్దా పడనవసరంలేదు. మీరు దేనిని అన్వేషిస్తున్నారో దానిని పొందగలుగుతారు.''

బ్రంటన్‌ స్వాములవారివద్ద సెలవుతీసుకొని వెంకటరమణితో కలసి మద్రాసుకు మరలినాడు. స్వాములవారిని కలిసిన పాశ్చాత్యులలో బ్రంటనే ప్రథముడు.

ఆ రాత్రి బ్రంటన్‌ తనగదిలో విశ్రమించి, దాదాపు మూడుగంటలపుడు మేల్కొన్నారు. గదిలో చీకటి. తన పడకవద్ద కాళ్ళున్న భాగంలో ఒక వెలుతురు ఉన్నట్లు కనపడింది. వెంటనే లేచి కూర్చున్నారు. కళ్ళునులుముకొని చూడగా- అతనికి ఆ వెలుతురులో స్వాములవారి మూర్తి గోచరించింది. చుట్టూ చీకటి. వెలుతురులో స్వామిమూర్తి. వారి మూర్తి అతని దృష్టికి భౌతికంగానే కనబడింది. 'వీరు ఏలా వచ్చారు? మనము వారిని చెంగల్పట్టులో వదలివచ్చాము కదా!' అని మళ్ళా కళ్ళుమూసుకొని కొంతసేపు ఉండి, ఇది భ్రమకాదుకదా అని కళ్ళు తెరచి చూచినారు. స్వామివారి మూర్తి యధాప్రకారం ఆ చోటనే వున్నది. మార్పేమీలేదు. కాషాయములను దాల్చిన ఆ మూర్తి నిజంగా కనబడింది. ఆయన పెదవులు కదినట్లూ, వారు, ఓపిక పట్టు. నీవు కోరునది సిద్ధిస్తుంది. అని చెప్పక చెప్పినట్లూ అతనికి తోచింది.

తర్వాత ఆ మూర్తి ఉన్నట్టుండి అదృశ్యమైనది. ఆ తర్వాత అతనికి నిద్రపట్టలేదు. చెంగల్పట్టులో శ్రీవారితో చేసిన సంభాషణను నెమరువేస్తూ శ్రీవారి మూర్తిని ధ్యానిస్తూ శేషరాత్రిని పాల్‌ బ్రంటన్‌ గడిపారు.

Maa Swami    Chapters