Maa Swami    Chapters   

ఆధునిక

2. మానవ సమాజములో మతము

క్రీ.శ. 1963 ఆగస్టు నెలలో మధురలో కుంభాభిషేకము జరిగినది. ఈ ఉత్సవమునకు ఆహ్వానింపబడి 'అమెరికన్‌ కాన్సల్‌ జనరల్‌' డాక్టరు ఆల్బర్టు బి. ప్రాంక్లిన్‌ మధురవెళ్ళి ఆ సమయమునందే రెండవ ఆగమశిల్ప సదస్సు జరుగుతూ ఉండగా శ్రీ కామకోటి పీఠాధిపతులను కలసుకొని దాదాపు అర్ధఘంట సమయము సంభాషించారు. ప్రాంక్లిన్‌గారికి ఏబది నాలుగు ఏళ్ళుంటాయి. ఆయన హార్వర్డు విశ్వవిద్యాలయములో 'ఫిలాసఫీ డాక్టరేటు' పట్టము పుచ్చుకొని అచ్చటనే కొంతకాలము ఉద్యోగముచేసి పిదప 'మేరీలాండు' విశ్వవిద్యాలయములోకూడ ఉద్యోగము చేశారు. భారతదేశమునకు వచ్చిన పిదప కుతూహలముకొలది సంస్కృతము, తమిళము, యోగశాస్త్రము చదువ నారంభించారు.

రోజురోజుకు నాగరికత ముదిరిపోతూ పారిశ్రామికయుగ ప్రవేశకారణముగా ప్రపంచమునందే విశ్రాంతికి విరామమునకు క్షామము దాపురిస్తూవున్న ఈ కాలములో మత విశ్వాసములు, మతానుష్ఠానములు పరిపూర్ణముగా మాయమయ్యే అపాయము వున్నదా? అని స్వాములవారిని ఫ్రాంక్లిన్‌గారు ప్రశ్నించారు. దానికి స్వాములవారు ఇచ్చిన సమాధానము ఆశాజనకముగా వున్నందున ఆయన చాల తృప్తిచెందారు. ఫ్రాంక్లిన్‌ తాను క్రైస్తవమతానికి చెందినవాడైనా తనకు ఇతర మతాలపై గౌరవము కలదనియు, ఇతర మతములను గూర్చి తెలుసుకొనవలెనన్న ఆసక్తి వున్నదనియు స్వాములవారితో చెప్పగా ఆయన 'మతప్రవక్తలందరు లోకసౌఖ్యమే ధ్యేయముగా భావించినారనియు,అన్ని మతాలకు మూలసూత్రాలతో సామరస్యము వున్నదనియు' అన్నారు. అంతేకాక ఫ్రాంక్లిన్‌గారికి వున్న మతసహనము, ఇతర మత విషయ గ్రహణములోకల ఆసక్తి సంతోషకరములని స్వాములవారు అభినందించారు.

డాక్టరు ఫ్రాంక్లిన్‌:- రేడియోలు, విమానములు అపరిమితంగా పెరిగిపోయిన ఈ కాలములో దేశ##దేశాల మధ్య ఉన్న దూరము తరిగిపోయి ఒకరిని గూర్చి ఒకరు తెలుసుకొనుటకు అవకాశము పెరిగింది. వైజ్ఞానికముగానే కాక తమవిషయాలలోకూడ పరస్పర బోధనలకు సౌకర్యము లెక్కువగా కల ఈ కాలము మత సామరస్యానికి దారీతీయగలదని మీరు అభిప్రాయపడుతూ ఉన్నారా?

స్వామి:- ఈ కాలంలో అన్నిటికంటె రాజకీయాలకే ప్రాముఖ్యం ఎక్కువ. ''మా రాజకీయ విధానమే ప్రధానమైనది, అదే గొప్పది, దానిని మించిన దేదీలేదు''- అని వాదించుట పరిపాటి అయిపోయింది. ఉదాహరణకు- చైనా తన రాజకీయ విధానమే శ్రేష్టమైనదని చాటుతూ ఉన్నది. కాని మతవిషయములో అట్టి నిర్బంధాలు ఏవీలేవు. పరిజ్ఞాన తృష్ణ కలవారు ఏ మతంనుండియైనను ఏ విషయమైనను గ్రహింపవచ్చును. అట్టి విషయగ్రహణమును ఏ మతము నిషేధింపదు. అయితే ప్రతిమతమునందు అటువంటి యత్నాలను నిషేధించే సంకుచిత స్వభావులు ఉండనే ఉంటారు. అదే విధముగా సౌహార్దము, హృదయవైశాల్యముకల ఉదారస్వభావులు మరియు జ్ఞానమును అందరకు పంచిపెడుతూ చేతనైన సాయము చేసేవారు కూడ అన్ని మతములలోను ఉన్నారు. మీరన్నట్లు ఈ కాలంలో నాగరికతద్వారా వివిధ దేశాలు దగ్గరైనందున వివిధ మత సామరస్యానికి అనుకూలతలు ఎక్కువ అనియే చెప్పాలి.

డాక్టరు ప్రాంక్లిన్‌:- నాగరికత కారణంగా ఎదురుచూడని మార్పులు కలుగుతూ, జీవనవిధానము లోనే ఒక క్లిష్టత ఏర్పడుతూ ఉన్నది. పైగా మానవులకు చిత్తచాంచల్యము కలిగించి, మనస్సును భ్రమింపజేసే విషయాలు, అవకాశాలు ఈ కాలంలో ఎక్కువ. హిందూమతం ఈనాటిదికాదు. కొన్ని వేల ఏళ్ళనాటిది. కాని యీనాటికి కూడ ఎక్కువ మార్పులు లేక తన స్వరూపమును రక్షించుకొంటూ వస్తూఉన్నది. స్వాములవారు అమిత నిరాడంబర జీవులని, అహారపానీయాలలో ఎక్కువ నియమము కలవారని పాదసంచారము చేస్తున్నవారని విన్నాను.ఈ నాగరికత ప్రపంచములో తారుమారైన జీవనవిధానాలలో, మనస్సుకు భ్రమ కలిగించే వాతావరణంలో హైందవమతానికి, ఆధ్యాత్మిక రక్షణకు ఏదైనా వుపాయము వున్నదంటారా? సాధారణ మానవునకు మనోనిగ్రహము యీ కాలములో సాధ్యమా?

స్వామి:- మనశ్చలనము కలిగించే విషయాలు ఈనాడే కాదు, ఎప్పుడూ వుండేవే. కాని పారమార్ధిక ప్రయోజనము కోరేవారు త్యాగముతో మనోనిగ్రహము సంపాదించేవారు. నాగరికతవలన భోగభాగ్యాలు ఎక్కువైనందువలన మనశ్చలనము కలిగించే అవకాశాలు ఎక్కువ. కనుక యీ కాలములో మనోనిగ్రహము మరింత త్యాగము చేస్తేకాని సాధ్యముకాదు.

డాక్టరు ఫ్రాంక్లిన్‌:- భారతదేశము పారిశ్రామికముగా ముందంజవేస్తూ పురోగమిస్తున్నది. అందుచేత దేశంలో సమృద్ధి ఏర్పడి తాత్కాలికముగా తమవ్యాప్తికి, ఆధ్యాత్మికాభివృద్ధికి భంగము లేకుండ వుండుటకు మతంలో ఏవైనా మార్పులు అవసరమా?

స్వామి:- దేశములో సాధువులు, మహాత్ములు పారమార్ధికాభివృద్ధికి తోడ్పడుతూ వుంటారు. అట్టి పవిత్రజీవులు తమ సమక్షము చేతనే ప్రపంచములో పరివర్తన తీసుకొనిరాగలరు. ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల హృదయాలలో సైతము గౌరవమును భక్తిని నాటగల తపోధనులు దేశంలో వుంటే మతవిచ్ఛితి ఎన్నటికీ కలుగదు. నాగరికతాకారణంగా పల్లెలు, పట్టణాలు మారవచ్చు. జీవనవిధానాలు మారవచ్చు. కాని ప్రజలలో వున్న పరమార్ధవస్తువులో మార్పువుండదు. ఒకవేళ మతానుష్ఠానాలలో కొంచెము మార్పు కలుగవచ్చునేమో కాని మతం బోధించే మూలసిద్ధాంతాలలో ఏవిధమైన మార్పు ఉండదు. ఈ విషయము ఒక్క హిందూమతానికే కాదు, అన్ని మతాలకూ అనువర్తిస్తుంది.

డాక్టరు ఫ్రాంక్లిన్‌:- హిందువులు, హిందూమతము ఒకప్పుడు అనన్యసౌభాగ్యముతో వర్ధిల్లి కల్క్యవ తారము సమీపించుటతో మనుష్యునితో పరిక్షీణత ప్రారంభ##మై, మానసిక దౌర్భాగ్యముతోబాటు, ఆకారనష్టికూడ ప్రాపించబోతూ వున్నదని అంటారుకదా! కల్య్యవతారకాలము సమీపించినదని మీరు అంటారా?

స్వామి:- ఈ మధ్య శతాబ్దములో కూడ మతవిషయిక చైతన్యము క్షీణించినపుడు మహాత్ములు పుట్టి మరల మతము చైతన్యవంత మగుటకు కారకులయ్యారు. అట్లే ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు మహాత్ములు పుట్టుట సహజము. ఇక రాబోయే కాలములో కూడ అటువంటి మహాత్ములు పుట్టవచ్చు. ఇతరయుగాలలో ఎంతయో తపస్సు చేస్తేకాని సాక్షాత్కారమయ్యేదికాదు. కాని ఈ కాలములో కొంచెము నామజపము చేసినప్పటికి చాలు భగవంతునిపై తీవ్రమైన ప్రేమ,తీవ్రమైన భగవత్సంయోగాకాంక్ష సాక్షాత్కారము సంపాదించి పెడతాయి. భగవత్ప్రేమయొక్క విశిష్టతను బోధించిన వారిలో శ్రీకృష్ణచైతన్యులు ప్రధానులు. యీ విధముగా అప్పుడప్పుడు మహాత్ములు ఉద్భవిస్తూ వుంటారు. అందువలన మతం క్షీణిస్తుందని మనము భయపడనక్కరలేదు. ఎక్కడైన అట్లు క్షీణించినా ఇంకొకచోట వృద్ధి అవుతుంది. ఒక దేశములో సముద్రము హఠాత్తుగా వెనుకకు వెడితే ఇంకొక దేశములో సముద్రము ముందుకు వస్తుంది. మతవిషయము కూడ అంతే.

డాక్టరు ఫ్రాంక్లిన్‌:- మిమ్ములను కలుసుకొన్నందుకు మీ ఆశీస్సుల నందుకొన్నందుకు చాల సంతోషము. మరొకమారు మిమ్ములను దర్శిస్తాను.

శ్రీస్వాములవారు:- భావశుద్ధి కలవారు చాల అరుదుగా ఉంటారు. అటువంటివారిని కొందరను నేను చూచాను. వారిలో మీరు ఒకరు. (వారి సంభాషణ ఆనాడట్లు ముగిసింది.)

కుంభాభిషేకమును గురించి, స్వాములవారిని గురించి డాక్టరు ఫ్రాంక్లిన్‌ 'స్పాన్‌' అనే పత్రికలో యీ విధముగా వ్రాశారు-

''మీనాక్షిదేవి గోపురవిమానము చూస్తూ మేమంతా ఆలయప్రాంగణంలో నిలిచివుండగా ఆ జనసందోహామునకు మధ్య ఒక కలకలము బయలుదేరింది. ఆహూతులైన పెద్ద మనుష్యులందరు ఒకప్రక్కకు గౌరవముగా జరిగి త్రోవ ఈయగా దండము ధరించి ఒక సన్యాసి ముందుకువచ్చి విమానము మీదకు వెళ్ళుటకై వేసిన నిచ్చెనను సమీపించారు. అటు, ఇటు చూస్తూ ప్రతి చిన్న విషయమును శ్రద్ధగా ఆయన గమనిస్తున్నారు. ఈ వయోధికుడైన వ్యక్తి ఎవరు? ఆయనకొక పేరు-ఊరు వుండవచ్చు. 'ఆయన వయస్సు ఇంత, అని మనము బహుశః లెక్కకట్టవచ్చును. కాని ఆయన అందరియొక్క సమిష్టిరూపంగా కనపడుతున్నారు.ఇక ఆయన వయస్సు మనుష్యుడేనాటినుండి భావనాకాశములో విహరించుట కారంభించాడో ఆనాటినుండి గణించాలి అనిపిస్తుంది. తన విశ్వాసముకొఱకై అన్నిటిని త్యాగముచేసిన త్యాగధనుడాయన. అన్నిమతములకు త్యాగమేకదా హృదయము. ఆయన నిచ్చెనను సమీపించి వయస్సుకు మించిన జవసత్త్వాలతో ఏడెనిమిదిమెట్లు గబగబ ఎక్కినారు. ఈ కుంభాభిషేక మహోత్సవము పూర్తి అయ్యేవరకు ఆందరను ఆకర్షించిన ప్రధానవ్యక్తి ఆయనయే.

శ్రీస్వాములవారు మైలాపూరులో ఉన్నప్పుడు మరొకమారు ఆయనను దర్శించారు. ''అప్పుడాయన మాటల సందర్భములో స్వాములవారితో- మీ ఆయురారోగ్యముల అభివృద్ధికై భగవంతుని ప్రార్ధిస్తున్నాను''- అన్నారు. అప్పుడు స్వాములవారు- ''మీరు చూపుతూ ఉన్న భక్తిప్రపత్తులు వ్యక్తిగతముగా (నాకు) కాక వేయేండ్లుగా వస్తూఉన్న భారతదేశపు పారమార్ధికసంస్థకు అనగా సన్యాసాశ్రమానికి చెందుతాయి''- అని బదులు చెప్పారు. ''ప్రపంచములో సుఖశాంతులు నెలకొనుటకై అట్టి సంస్థలు ఎంతో అవసరముకదా!''- అని ఫ్రాంక్లిను మరల స్వాములవారియెడ తమ గౌరవాన్ని వెలిబుచ్చారు. మధురలో ఆయనను దర్శించిన విషయము స్మృతికి వచ్చినపుడు తనకు తెలియని సుఖానుభూతి యేదో ఒకటి కలుగుతూ ఉన్నదని ఫ్రాంక్లిను స్వాములవారితో అన్నారు. ఆ తరువాత స్వాములవారికి ఆయనకు ఈ విధముగా సంభాషణ జరిగింది.

ఫ్రాంక్లిను:- ''చెన్నపురిలో కొంతకాలము ఉండి ఆ తరువాత మామూలుగా మీ పాదయాత్ర ప్రారంభిస్తారనుకొంటాను.''

స్వామి:- ఔను! సాధ్యమైనంతవరకు కాలినడకనే పోవాలనుకొంటున్నాను. ఈ నడకవలన ఆరోగ్యముకూడ బాగా ఉన్నదికదా!

ఫ్రాంక్లిన్‌:- మీ పాదయాత్రలో కలుసుకొనాలని నాకున్ను కుతూహలముగా ఉన్నది.

స్వామి:- దానికేమి! నేను బయలుదేరేవేళ మీకు కబురుపంపుతాను.

ఇలా ఫ్రాంక్లిన్‌గారితో స్వాములవారు ఇష్టాగోష్టిచేస్తూ హిందువుల పండుగలను వ్రతాలను విశదీకరిస్తూ ఇలా అన్నారు.

''చైత్రమాసములో శుద్ధపాడ్యమి నుండి నవమివరకు ఉన్న దినాలను ''వసంత నవరాత్రులని'' వ్యవహరిస్తారు. యక్షస్వరూపములో ప్రకాశరూపిణియై దేవతలకు జ్ఞానోపదేశము చేసిన ఉమాదేవి జ్ఞాపకార్ధం ఈ ఉత్సవములను చేస్తూ ఉంటారు. మేమీ వసంత నవరాత్రులు ఒకే చోట ఉండి చేయాలి. అందుచేత విశాలముగా ఉన్నదని ఈ సంస్కృత కళాశాలకు వచ్చి చేరాము. ఈ వసంత నవరాత్రులలోనే 'శ్రీరామనవమి' ఉత్సవాలు రామావతారమును పురస్కరించుకొని చేస్తూ వుంటారు. రామావతారము, మరియు జ్ఞానరూపిణి ఉమాదేవి దేవతలను అనుగ్రహించుట- ఈ రెండు నవమినాడే జరిగినవి. వసంతర్తువులో చైత్రమాసములో వచ్చే వసంత నవరాత్రములవలెనే శరదృతువులో ఆశ్వయుజ మాసములో ఆరునెలల తరువాత శరన్నవరాత్రములు వస్తాయి. అవి దుర్గాదేవియొక్క అవతారమును పురస్కరించుకొని చేయబడతాయి. శ్రీకృష్ణుని జననం శ్రావణ బహుళ అష్టమినాడు జరిగింది. అనాడే గోకులంలో యోగమాయ లేక దుర్గాదేవి అవతరించింది. యోగమాయను కృష్ణుని స్థానములో ఉంచి కృష్ణుని వ్రేపల్లెకు తీసుకొని వచ్చుట, కంసుడు యోగ మాయను చంపబోగా ఆమె అతని చేతులనుండి తప్పించుకొని దుర్గగామారి, అదృశ్యమగుటకూడ కృష్ణాష్టమినాడే జరిగింది.

సంవత్సరాన్ని సరిగా రెండు భాగాలుచేస్తే పూర్వార్ధములో శివునకు ప్రియమైన శివరాత్రి, ఉత్తరార్ధములో మహా విష్ణువునకు ప్రీతికరమైన కృష్ణజయన్తి వస్తున్నాయి. రెంటికి మధ్యదూరము సరళ రేఖవలె 180 డిగ్రీలు. ఈ విధంగానే ఆద్యంతాలులేని వర్తులరూపములో ఉన్న శివలింగమును పూజించుట అన్నది ఆద్యంతాలులేని నిరాకార పరబ్రహ్మకు ఒక స్వరూపము కల్పించి ప్రపంచములో దర్శించుటయే అయియున్నది. సృష్టి నిమిత్తమై నిరాకార పరబ్రహ్మ ప్రకృతి పురుష రూపాలను ధరిస్తూ ఉన్నాడు. ఈ పరమ పురుషునే బ్రహ్మమని వ్యవహరిస్తున్నారు. ప్రకృతిని స్త్రీ రూపములో శక్తి అని వ్యవహరిస్తూ ఉన్నారు. వ్యావహారిక పరిభాషలో విద్యుచ్ఛక్తిని 'పోజిటివ్‌' 'నెగిటివ్‌' లుగా విభజించినట్లే పరబ్రహ్మనుకూడ ప్రకృతి పురుషులుగా విభజిస్తున్నాము. ఈ విభాగము ఉంటేనే కార్యము. లేకపోతే కార్యములేదు.

Maa Swami    Chapters