Maa Swami    Chapters   

1. పరదేవతా స్వరూపులు

చిలుకూరి పాపయ్యశాస్త్రి

శ్రీమాత పరదేవత, శ్రీమాత నద్వైతభావనతో భావించు సుకృతులు, పరదేవతా స్వరూపులు. అట్టివారు సకలదేవతా స్వరూపులు. శ్రీ మచ్ఛంకరభగవత్పాదులు పరదేవతాస్వరూపులను విషయము పరతత్త్వమును తెలియగోరు వారికి జిజ్ఞాసావస్థలోనే భాసించును. జ్ఞానులయిన వారి కిట్టి అనుభూతి కలుగుననుటలో సంశయము లేదు. ''శంకర శ్శంకర స్సాక్షా ద్వ్యాసో నారాయణో హరిః'' అనగా శంకారాచార్యులవారు సాక్షాత్తు శంకర స్వరూపులు. వ్యాసభగవానులు విష్ణు స్వరూపులు, అను నీ ఆర్యోక్తినిబట్టి ఆదిశంకరులు పరమేశ్వరమూర్తులే యనునది తద్భక్తులందరకు సువిదితమే. శ్రీమచ్ఛంకరభగవత్పాద విరచిత వివిధ దేవతాస్తోత్రములను ఏ కొంచమైనా శ్రద్ధాభక్తులతో మననము చేయువారుండిన వారి హృదయముల కీవిషయము విదితముకాక మానదు. శ్రీవారు శివానందలహరిలోగానీ, సౌందర్యలహరిలోగాని పార్వతీ పరమేశ్వర స్తుతులను, సుతులను, సతులను గావించిన తావులందని యాక్రందనము లన్నియు సంసార సాగర నిమగ్నులైన ప్రాణుల నుద్ధరించుటకు, ఆర్త రక్షణమునకు ననుట నిర్వివాదమైన విషయము.

శంకరవిభూతి శంకరభగవత్పాదులందు సంపన్నమై యుండెననుటకు తద్విరచిత స్తుతులతో తన్ము ఖోద్గత వాక్య సమన్వయమే నిదర్శనము. శివానందలహరిలోని ఈ క్రింది శ్లోకమును పరికింతము.

యోగక్షేమ ధురంధరస్య సకల శ్రేయః ప్రదో ద్యోగినో

దృష్ఠాదృష్ట మతోపదేశ కృతినో బాహ్యాంతర వ్యాపినః

సర్వజ్ఞస్య దయామయస్య భవతః కిం వేదితవ్యం మయా

శంభో త్వం పరమాం తరంగ ఇతి మే చిత్తే స్మరామ్య స్వహమ్‌.

aRPLi˳Ü[! ¬dsª«so ˳ÏÁNRPVòÌÁ ¹¸…WgRiZOP[Qª«sV ˳ØLRiª«sVVƒ«sV ª«sz¤¦¦¦LiÀÁƒ«sªy²R…ª«so. @LiµR…LRiNRPV

శ్రేయస్సును కలుగజేయుట కుద్యమించువాడవు కనపడునవి, కనబడనవి అయిన మతముల నుపదేశించుటలో నేర్పరివి లేక అట్టి మతముల నుపదేశించుటయే పనిగాగలవాడవు, బయటను, లోపలను నిండియున్న వాడవు, సర్వమూ తెలిసినవాడవు, దయానిధివి అయిన నీకు నేనేమి తెలుపవలెను. నీవు పరమాంతరంగుడవని అనుదినము నా చిత్తములో నిన్ను స్మరించుచున్నాను- అని ఈ భావము. శంకర భగవత్పాదులు శివానందలహరిలో వారి దివ్యానుభూతిని వివరించి యున్నారు. దానితోపాటు పరమేశ్వర విభూతిని బహుముఖముల భక్తానుసంధాన యోగ్యము గావించియున్నారు. ఆదిశంకరుల వాగమృతధారల్లో నాప్లపము చేయగల వారున్న వారికి పై శ్లోక విషయమంతయు వారిలోనే సమన్వితమగును. వారిలోనేగాదు, శంకరభగవత్పాదులు ప్రతిష్టించిన సర్వజ్ఞ పీఠాధిష్ఠాతలయిన శ్రీచరణు అదరియందు నట్టి శంకరవిభూతి స్పష్టముగా గోచరించుచునే యుండును.

ఆంధ్రభూమియందు జన్మించిన ప్రాణుల సుకృతపరిపాకముచే ఈ పుణ్యభూమిని తపపాదరజ స్పర్శచే పవిత్రతరము చేయుటకై సంచరించుచు, తాము అవగాహనము చేసిన జలాశయములను పుణ్యతీర్ధములుగును, తాము వసించిన ప్రదేశములను దివ్యక్షేత్రములుగను జేయుచు, యావత్ప్రాణి సమూహమునకు దర్శనము ప్రసాదించుచు, అనుగ్రహించుచున్న శ్రీమజ్జగద్గురు కాంచీకామకోటి పీఠాధీశ్వరులయిన శ్రీ మచ్చంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీచరణులందును, శ్రీమజ్జయేంద్ర సరస్వతీ శ్రీచరణులందును, పై శ్లోకమందు నిరూపితమయిన శంకరదివ్యవిభూతి సుస్థిరమై యున్నది. శ్రీవారలు తమ్ము భక్తితో దర్శించువారికి, స్మరించువారికి యోగక్షేమములు భారమును వహించు వారై యుందురు. తమ్ము దర్శింపవచ్చు వారినందరినీ ఆనందకళా సంభరితమైన మాటలతో యోగక్షేమ పరిప్రశ్నము చేయుచు వచ్చినవారి నందరినీ ఆనంద పరిపూర్ణ హృదయులను గావింతురు. వారిని దర్శించి తిరిగివచ్చు వారందరూ ఆనందమయులై మరలుదురు.

శ్రీవారలు చేయు ప్రతిస్పందము చరాచర ప్రపంచమునకు సకలశ్రేయస్సులూ కలిగించుటకే యగుచుండును. వారి సదుపదేశములోని ప్రత్యక్షరమును ప్రాణులందరకు శ్రేయస్సును (అత్యంతిక సుఖమును) కలిగించుటకు ఉద్యుక్తమై యుండును. బ్రహ్మాండమంతయు స్వస్వరూపముగా భావించు యోగీంద్రుల యుద్యోగ మెప్పుడు నట్టులే యుండుననుట, అట్టి భావనగలవారికే విదితము. శ్రీవారల చరణసన్నిధి నుండి భగవద్భాగవత విషయిక చర్చ ప్రసక్తమైనపుడు తన్ముఖారవిందమునుండి సకలమతములు తత్త లక్ష్యములు ఉపదేశరూపమున బహిర్గతములగుచునే యుండును. భగవత్స్వరూపులయిన వారి దివ్యదృష్టికి విదితము కానిదేదియు నుండబోదు. అక్షరస్వరూపాను సంధానముచే వాణీవిలాసమునందు వారి చిత్తమున కందనిదేదియు నుండదు.

వాజ్మయమందలి గద్యపద్యరూపమైన సకల భాషా ప్రపంచము వారికి కరతలామలకమై యుండును. కావుననే శ్రీవారు ప్రపంచభాష లన్నిటిలోనూ ప్రసంగము చేయుటయేకాక, అక్షరాస్యుల కందరకు సదుపదేశము చేయ నుద్యమించి వారిని కృతార్ధులను చేయుదురు.

''యా వర్ణపద వాక్యార్ధ గద్యపద్య స్వరూపిణీ,

వాచి నర్తయతు క్షిప్రం సా మాం మేధా సరస్వతీ.''

అని పరదేవతను ప్రార్థించు శ్రీవారలకు అవిదితమేదియు నుండబోదని కొంచెమెరిగిన వారికైనను తెలియుచుండును. శ్రీవారలలో సర్వజ్ఞత్వము అందరకు గోచరించుచునే యుండును. వారి సన్నిధినుండెడి యే ప్రాణిహృదయమునం దెట్టి సంకల్పము గలవో అది వారికి ఆగంతుకుడు తెలుపకుండగనే విదిత మగుచుండును. శ్రీవారలను భక్తితో దర్శింపవచ్చిన వారి యార్తిననుసరించి శ్రీవారి దయ వారి వారిపై ప్రసరించి, వారివారికి ప్రత్యేక దర్శన భాషణ భాగ్యములు లభించుచుండును. శ్రీవారలకు గల దయ అపారము. ఏ ప్రాణి దేనిని గోరినను దానిని వారికి దయతో ప్రసాదించుచునే యుందురు. ఎవరి కేది ఈయదగునో, సర్వజ్ఞులయిన శ్రీవారలకది ముందుగానే విదితమయి, వారివారికి పరదేవతాస్వరూపులైన శ్రీవారలు వాంఛాదిక సమృద్ధులనొసగు చుందురు.సర్వజ్ఞులయి సర్వవ్యాపకులై పరమేశ్వర స్వరూపులైన వారికి ఎవ్వరు నేదియు తెలుపనక్కరలేదు. భౌతిక సమృద్ధికై ప్రాకులాడుచు శ్రీవారలను దర్శింపవచ్చిన వారికి తమదర్శన, భాషణ ప్రసాదములచే సకలార్తి హరులగు చుండగా, ఆధ్యాత్మిక సంపత్సమృద్ధికై తద్దర్శన సేవాభాషణ భాగ్యముల నభిలషించెడి జనులకు, దయానిధులయిన శ్రీవారలనుండి లభించు భాగ్య మనిర్వచనీయము. ఈ విధముగా పర్యాలోచనము చేయునప్పుడు జగద్గురువులు చంద్రశేఖర స్వరూపులనుట సర్వదా సర్వథా తథ్యము.

''య స్సర్వజ్ఞః సర్వవిత్‌ యస్య జ్ఞానమయం తపః''

అను ఉపనిషద్వాక్యముచే జ్ఞానమయ తపస్సంపన్నులు సర్వవేత్తలయి యుండుట సహజము. శ్రీవారలట్టి జ్ఞానమయ తపస్సంపన్నులలో నిప్పటివారిలో నగ్రగణ్యులు. గావున వారిలో సర్వజ్ఞత్వ మేర్పడియుండుట సహజము. వారు పరదేవతాస్వరూపులై ప్రపంచమంతటిని స్వస్వరూపముగానే భావించుట సకల లోకశ్రేయః ప్రజోద్యోగము చేయుచునే యుందురు. భారతదేశమునకు పక్కనున్న పాకిస్తానుతో చెలరేగిన యుద్ధాగ్నిజ్వాలలను చల్లార్చుట యావత్ప్రపంచ క్షేమకరమైన విషయము. భారతవీరులకు విజయము లభించినపుడు గాని ఆ సమరాగ్నిజ్వాల చల్లారదు. అట్టి విజయమును భారతవీరులకు సమకూర్చుటకు యావద్భారతము సుభిక్షమై యుండుటకు, ప్రపంచశాంతి యేర్పడుటకు శ్రీవారలు తాము తపస్సుచేసి, దేశమందంతటను పరమేశ్వరారాధనము చేయించి, భారతవీరులకు విజయసంసాధకముగ తేనె నభిమంత్రించి, దానిని బంగారు పాత్రలోనుంచి, యుద్ధభూమియందగ్రేసరులై ఆ తంత్రమును నడిపించెడి వారికి (మేజర్స్‌) బుద్ధిపాటవ మేర్పడుటకై ప్రసాదముగా స్వీకరింపబంపినారు. ఆ పాత్రను తమ సన్నిహితులచేత రణభూమికి బంపి వారిచే గ్రహింపజేసినారు. ఇంతకంటె సకలలోక శ్రేయస్సంపాదకమైన ఉద్యమము వేరొకటి యుండునా? ఇది పరమేశ్వర విభూతిగాక మరేమిటి? శ్రీవారల యీ విధమయిన అనుగ్రహము భారతదేశ విజయసాధన మగుటయేగాక, ప్రపంచశాంతి సంపాదకమయిన తాష్కెంటు సమావేశము సఫలమగుటకు నిదానమైనది. శ్రీవారలు పరదేవతా స్వరూపులనుటకు, పరమేశ్వరవిభూతి వారిలో సంపన్నమై యున్నదనుటకు ఇంతకంటె నిదర్శన మేమి కావలయును?

శ్రీవారు లపరశంకరావతారు లనుటకు, శ్రీశైలమును వారు దర్శించినపుడు సామాన్య మానువులకుకూడ బోధపడు నిదర్శనములు కొన్ని తటస్థించినవి. శ్రీశైలము శ్రీదేవతావాసము. అచట శ్రీశంకరభగవత్పాదులు పరదేవత నారాధించి సాక్షాత్కరమందిన చోటు. శ్రీవారు హాటకేశ్వర సమీపమున 27 మెట్లున్న లోయలోని గుహలో యోగ సాధనచేసి సమాధినిష్ఠులైయున్న యావానముగలదు. అది శ్రీవారికి విదితమై ఆ తావునకు స్వయముగ పాదచారులైపోయి, అచట ఆకులతో కప్పబడియున్న లింగమూర్తిని వెలికిదీసి యభిషేకించి, ఆ గుహలోనే శ్రీవారలు సమాధి స్థితులై యుండి, యోగతారావళి శ్రీశంకరభగవత్పాద విరచిత మగుటకు శ్రీవారు నిదర్శనము నుపదేశించుయున్నారు. అపర శంకరస్వరూపులు గనుక శ్రీవారలు వానిని తెలిపినారు. అటులనే త్రిపురాంతమున తుప్పలలో కప్పబడియున్న శ్రీచంద్రమౌళీశ్వరుని బయటపెట్టి ఆ దేవునకభిషేకాదికమును నిర్వర్తించి, ఆ దేవతామూర్తి అచట అంతర్హితమై యున్న సంగతిని లోకమున కెరిగించినారు. శ్రీశంకరభగవత్పాద హృదయమును సమగ్రముగ తెలుసుకొని, ప్రత్యక్షరమునందు వారి హృదయము నావిష్కరించుచు, వైదికధర్మము నుద్ధరించుటకై యవతరించిన శ్రీమత్కాంచీకామకోటి పీఠాధీశ్వరులు సాక్షాచ్ఛంకరస్వరూపులనుటకు విప్రతిపత్తి యుండబోదు. శ్రీవారలు జగజ్జననీ స్వరూపులు.

లోకా స్సమస్తా స్సుఖినో భవంతు.

Maa Swami    Chapters