Maa Swami    Chapters   

12. నాకేల కనకాభిషేకము?

ప్రతిదినము భక్తులు నాకు పూలమాలలు, బిల్వరామములు, తులసీమాలలు తెచ్చి సమర్పిస్తూ వుంటారు. ఇవి కాక పండ్లు, కొబ్బరికాయలు వేరే తెచ్చి ఇస్తుంటారు. తమకు తోచిన విధంగా ద్రవ్యరూపంగా భక్తిని వేరే చెల్లిస్తూ వుంటారు. విద్వాంసులు అభినందన పత్రికలు వ్రాసి చదువు తుంటారు. కవిత్వం తెలిసినవాళ్ళు తెలుగులో, గీర్వాణంలో- పద్యాలు, శ్లోకాలు వ్రాసి నా ఎదుట పఠిస్తుంటారు. ఈ ప్రేమ కలాపమంతా నాకు కనకాభిషేకం లాగే వుంటుంది. ఇది చాలదని ప్రత్యామ్నాయంగా కాక ప్రత్యక్షంగానే కనకాభిషేకం చేస్తున్నారు.

ఇవన్నీ స్వీకరించడానికి నాకుగల అర్హత ఏమి? అని యొచిస్తే ఒకే ఒక కారణం కనపడుతూ వుంది. శంకర భగవత్పాదులవారి దివ్యనామము ఏదో భాగ్యవశంగా నాకు లభించినదానివల్ల. ఆ పేరిట, ఆ స్వామిని స్మరించి మీరందరూ ఈ మర్యాదలను నాకు చేస్తున్నట్లు వెల్లడి ఔతుంది.

ఇంత గౌరవమర్యాదలు మీవద్దనుండి స్వీకరిస్తున్న ఆచార్యపాదుల గుణగణము లేమి?

శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్‌

నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్‌

శ్రుతులూ, స్మృతులూ, పురాణములూ వారిలో వాసం చేసినవట! ప్రపంచంలోని సమస్త జీవరాసులూ, వారి కరుణాస్రవంతిలో మజ్జన మాడినవట! ఆ మహామహుని నామమాత్రాన మీరు నాకు ఇంత ఘనంగా మర్యాదలు చేస్తున్నారు. ఈ గౌరవానికి పాత్రమగుట మేమెట్లా నడచుకోవాలో వారు నిర్దేశించే వున్నారు. వారి ఆజ్ఞపాలనం నేను అనుదినమూ చేయగలిగినట్లైతే, అది దైనందిన కనకాభిషేకమే. వారి నామధారణాభాగ్యము ఎవరొ కొందరికే లభించివున్నది. కాని ప్రతి ఒక్కరూ ఏవిధంగా జీవితం గడపవలెనో వారు బోధించే వున్నారు. అనగా ఒక్క వ్యక్తికి కనకాభిషేకం చేయడానికి బదులు, మన మందరమూ వారి ఆజ్ఞాపాలన చేయగలిగినట్లైతే, వారి అనుగ్రహమనే కనకధారలో, ఆనందవర్షములో సంప్లావితులము కాగలము.

ధర్మార్ద కామమోక్షములనేవి చతుర్విధ పురుషార్ధములు. ఇపుడు మీరు చేస్తున్న కనకాభిషేకము కేవలము అర్ధసంబంధమైనది. ఆచార్యులవారి ఆజ్ఞాపాలనం చేశామో- అర్ధమొకటేకాదు, అన్నిటికంటే ముఖ్యమైన ధర్మధార, ప్రేమధార, మోక్షధారలో మునిగి మనం ఆనందించవచ్చును. మన అభిలాషలన్నీ ఫలవంతములు కాగలవు. అపుడు మన జీవితములు పురుషార్ధ సమన్వితములుగా సుసంపన్నములుగా గడుపుకోవచ్చు.

భగవత్పాదులవారి ఆజ్ఞ ఏమి? ఈశ్వర ప్రణిధానమే అది. ఆ పరమాత్మను ఏవిధంగా పూజించాలి?

భగవంతుని అర్చామూర్తులకు గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యములనే పంచోపచారపూజలు చేస్తుంటాము. వీనికి మరికొన్ని ఉపచారములు కలిపి షోడశోపచారములు చేస్తుంటాము. ఇవీ చాలవని రాజోచితంగా చేసే, అరువది నాలుగు ఉపచారములు, చతుష్టష్ట్యుపచారములు వేరే కల్పించి వున్నారు. ఇవి కాక భగవత్పాదులవారు వేరే పూజావిధిని ఏదైనా సూచించారా?

''వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేశవ్య విధీయతా మపచిత''-

నాయనా? నీవు లోకక్షేమముకోసం నీ ఆత్మశ్రేయస్సుకోసం వేదములు విధించిన నిత్యకర్మలు చేస్తూ వచ్చినావంటే అదే ఈశ్వరారాధన ఔతుంది- అని అన్నారు.

వారి ఆజ్ఞ పరిపాలించాలని మన కందరికీ ఆసక్తి ఉన్నది. కాని దానికి కావలసిన శ్రద్ధ ఉన్నదా? ఆ శ్రద్ధకొఱకై మనం ఎవరిని ఆశ్రయించాలి? ఆ శ్రద్ధ ఆచార్యపాదుల అనుగ్రహంవుంటే కానీ లభించదు. వారి పాదములను నమ్ముకోవడమే దానికి మార్గం. భక్తికి సులభమార్గము గురువును నమస్కరించి వారి పాదముల నాశ్రయించి వారి పాదసేవ చేయటమే.

''సద్విద్వాన్‌ ఉపలర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకే సేవ్యతాం''

''సవిద్వాంసులు, గురువులు- వారి పాదుకలను సమాశ్రయింపుము.''

మనం చేసే నమస్కారాలన్నీ కట్టకడపట ఎవరికిపోయి చేరుతుంది? 'సర్వదేవనమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి' కేశవుడంటే పరమాత్మయే. నాబోటి సన్యాసులకు మీరందరూ నమస్కరిస్తారు. సర్వసంగపరిత్యాగ్యం చేసిన సన్యాసులు, ఈ నమస్కారాలన్నీ నాకే అని అనుకుంటే ఆధోగతే. ''ఈ నమస్కారాలు నావి కావు. ఇవన్నీ కేశవునివి''- అన్న భక్తిభావనతో సన్యాసి 'నారాయణ, నారాయణ' అని నారాయణ నామోచ్చారణ చేయాలి. నమస్కార పరంపరను నారాయణునికే అర్పించాలి.

ప్రపంచంలోని జీవితం ఒక యాత్రలాగా వున్నది. యాత్ర అంటే ఒకమార్గం వుండవలె. దానినే 'అధ్వా' అని అంటారు. అది ఒక్కడ అంతమౌతుందో అది 'పారం'. వేదమార్గంలో వెళ్ళేవారికి 'పార' మేది? నారాయణమూర్తియే. నమస్కారాలు ఎవరికి అర్పించాలి? నారాయణునికే. ఆయన దివ్యపాదములకే. అట్లు భగవత్పాదములుగా వుండేవి ఏవి? మన ఆచార్యులు భగవత్పాదులే.

మీరు చేస్తున్న వివిధ సపర్యాక్రియలన్నీ నేను వారి పాదములకే సమర్పిస్తున్నాను. మీరు స్థూలంగా చేస్తుంటే, నేను సూక్ష్మంగా- మానసికంగా వారికి అంకితం చేస్తున్నాను. వారి నామధారణామాత్రమున మీరు నాకు చేస్తున్న ఉపచారములను, వారికి నేను అర్పించకపోతే కృతజ్ఞతాలోపం కదా! ఈ కనకాభిషేకం ఒక్క రోజుకు పరిమితంకాక, అనుదిన కనకాభిషేకంగా వర్ధిల్లాలి. అది ఆచార్యపాదుల ఆజ్ఞాపాలనమే అన్న విషయం మనం విస్మరించరాదు.

వేదహిత కర్మానుష్ఠానమే ఈశ్వరార్చన-అని ఆచార్యుల వారన్నారు.అయితే ఈశ్వరపూజయే మన అంతిమ లక్ష్యమా? కాదు. కర్మాచరణ చేత మనము సాధించే లక్ష్యము ఈశ్వరపూజ. ఈ పూజ మరొక లక్ష్యమునకు సాధానాంగముగా నున్నది. ఆ అంతిమ లక్ష్యమేమి? దానిని భగవత్పాదులవారు, లోపాన పంచకములో కట్టకడపట- పరబ్రహ్మాత్మనా స్థీయతాం- అని వివరించారు.

కర్మలను చక్కగా ఆచరించు కర్మఫలములపై కోరిక ఉంచుకోవద్దు. పాపములను పోగొట్టు కొని సత్సాంగత్యము ఆలవరచుకో- అంటూ క్రమక్రమంగా చెప్పుకుంటూపోతూ, 'పరబ్రహ్మాత్మనా స్థీయతాం' అని తమ బోధను ముగించారు.

సమస్తోపాధిస్థితియై యున్ది పరబ్రహ్మమే. కాని మన మనస్సు ఏకంలో కాక అనేకంలో చిక్కుకొని తపిస్తున్నది. వివిధ రూపములలో కనపడేదంతా పరమేశ్వరుడే అన్న నిశ్చయాత్మకబుద్ధి మనకు కలిగినదంటే ఇదివేరు. నేను వేరు అన్న భేదభావము- సమసిపోయి, అంతా నేనే- అనే పర్వాత్మక బుద్ధి- అనుభవానికి వస్తుంది. అదే మోక్షం. ఆచార్యులవారు పరబ్రహ్మాత్మనా స్థీయతాం- అంటూ చెప్పేది అదే.

ఈ అనుభవసిద్ధికే వారు ఈశ్వరారాధన చేయమన్నారు. దానివలన చిత్థశుద్ధి కలుగుతుంది. చిత్తైకాగ్రత ఏర్పడుతుంది. కర్మ, భక్తి రూపములైన పూజలు సోపానపరంపరలై పరమోచ్చస్థితికి మనలకు తీసుకొని వెళ్ళుతవి. ఈ కారణంచేతనే ఆచార్యులు అనుగ్రహించిన ఐదు శ్లోకములను- 'సోపానపంచక' మని వ్యవహరిస్తున్నారు.

జీవబ్రహ్మ- అభేదము అనుభవములో అర్ధమౌతుంది. జ్ఞానమార్గాన్ని స్థీరీకరించిన భగవత్పాదులవారు భక్తిమార్గాన్నీ కర్మాచరణనూ బోధించారు. దీనివలన మనస్సు పక్వమై ఏకాగ్రమౌతుంది. పిదప మనస్సు ఇతర విషయములను వదలి పరమసత్యంలో మగ్నమౌతుంది. వారు సూచించినదీ ఇదే.

అనగా ఫలాభిసంధిలేని కర్మాచరణ తద్ద్వరా ఈశ్వర ప్రణిధానము, ఫలమును ఎదురు చూచినపుడు- అది లభిస్తే సంతోషం- లభించకపోతే దుఃఖం కలుగుతున్నది. మనిషికి శాంతి లేకుండా పోతుంది. ఫలం ఏదైనాసరే- అది ఈశ్వరునిది. వానికే అర్పిస్తున్నాను- అన్న భావన ఉంటే శాంతి తానుగ ఏర్పడుతుంది.

కర్మలన్నీ చేసిన పిదప 'జనార్దనః ప్రీయతాం' అంటూ వుంటాం.ఈ కర్మ నా ప్రీతికోసం కాదు- జనార్దనుని ప్రీతికోసం అని దీని భావం. అట్లా చేస్తే శాంతి లేకుంటే అశాంతియే. కర్మానుష్ఠానం జనార్దనుని యందు ప్రీతి వుంటేకాని చేయలేము. ఆ ప్రీతి కలుగుటకు పంచోపచార, షోడశోపచార, చతుష్టష్ట్యుపచారములను విధించారు. దానికంటె శ్రేష్ఠమైన పూజ నిష్కామకర్మ- ఫలాభిసంధి లేక వేదచోదితమైన కర్మానుష్ఠానమే. ఇవన్నీ కట్టకడపట 'పరబ్రహ్మాత్మనా స్థీయతాం' అన్న తుది మెట్టుకు తీసుకొని పోగలవు.

అందుచేత శాస్త్రవిహిత కర్మలను చేయుటకు వలసిన శ్రద్ధను మనకు అనుగ్రహింప వలెనని పరమేశ్వరుణ్ణి ప్రార్ధనచేయాలి. ఆ శ్రద్ధ మనకు కలిగినందంటే- 'బ్రహ్మై వాహం' అన్న అనుభవం సిద్ధిస్తుంది. అట్టి బ్రాహ్మీస్థితియే కనకాభిషేకం. కనకాభిషేక మేమి? రత్నాభిషేకమే!

''నమః పార్వతీపతయే హర హర మహాదేవ!''

Maa Swami    Chapters