Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

జన్మరాహిత్యం

లోకంలో పుణ్యంవల్ల సుఖం, పాపంవల్ల దుఃఖం వస్తాయని అందరికీ తెలుసు. పుణ్యఫలం కావాలి- అనే ఆశ అందరికీ ఉంటుంది. కాని, పుణ్యం వచ్చేపని చేయాలనే ఆశ ఎవరికీ లేదు. అలాగే దుఃఖం వద్దనేకోరిక ఉంటుంది, కాని పాపం చేయవద్దనే బుద్ధి సాధారణంగా ఉండదు. భోజనం చేస్తేనే ఆకలిపోతుంది. సుఖం కలుగుతుంది, అలాగే పాపంపోవడానికి భోజనం కోసం ప్రయత్న చేసినట్లుగా పుణ్యకార్యప్రయత్నం చేయాలి.

ఒక దరిద్రుడు చాలా కాలంగా ఒక మామిడిపండు తినాలనే ఆశించాడు, కాని, కొనుక్కునేందుకు పైసల్లేవు. ఎట్లాగో కష్టపడి పైసలు పోగుచేసుకున్నాడు, పైసలు సంపాదించిన నాటికి మామిడిపళ్లు దొరకలేదు. అలా ఆలోచిస్తూవుండగా సంవత్సరం గడచిపోయింది. అప్పుడు పండ్లువచ్చాయి, వానికి ఒక పండు దొరికింది. తీరా తినాలని అనుకొన్నప్పటికి ఇంటివద్ద భార్యా, పిల్లలుజ్ఞాపకాని కొచ్చారు. వారికి భాగం పెడితే తనకు తక్కువవుంది. తానే తింటే వాళ్ళకు భాగం వుండదు, పోనీ ఈఏటికి నేను పూర్తిగా తిని, మళ్ళీ సంవత్సరం వాళ్ళకు పెట్టాలనే అనుకున్నాడు. మానవుని బుద్ధికోతివంటిది. ఈ పండు పదిమందీ చూస్తుండగా గొప్పగా తినాలని తోచింది. అందుకు కొద్దికొద్దిగా తినడం ప్రారంభించాడు, ఆనందతన్మయత్వంలో ఉంటూ ఉండగా దారిలో మట్టిలో పడిపోయింది, ఆరోజుల్లో తారురోడ్లు లేవు, బురద అయింది. నీళ్లుపోసి కడుక్కొనితినాలి, అంటే రసం రుచిపోతుంది, పైగా పదిమందిలోను ఉండటం చేత అంతాచూస్తారు, బాగుండదు. చూస్తూచూస్తూ చాలా కాలానికి లభ్యమవడం చేత వదలలేడు. ఈ విధంగా దుఃఖం వానికి సంప్రాప్తమయింది. ఆశ ఉండటం మంచిదే, కాని ''దురాశ దుఃఖానికి దారితీస్తుంది'' అని ఈ మామిడి పండు ఉదాహరణ చెప్పాము.

8-20

ఆశలోకూడా అన్యాయంగా సొమ్ము కూడబెట్టాలనేది ఉండకూడదు. ఈశ్వరునియందు భక్తివల్లనే సుఖం వస్తుంది, లోకంలో బంధువులకూ, స్నేహితులకూ మనకష్టాన్ని చెప్పుకొంటే, వాళ్ళ కష్టాలు ఏకరవుపెడుతారు. దైవానికి మన కష్టం చెప్పుకొంటే ఎదురు మాటరాదు. పరిష్కారమార్గం ఈశ్వరుడు ఒక్కడే అనుగ్రహించగలవాడు. మానవుని దగ్గరలేని ఆశక్తి, ఓరిమి ఈశ్వరునిదగ్గరనే యున్నది. ఈశ్వరభక్తి వల్ల ఈలాటి లాభం ఉంది.

''శివానందలహరి'' అని శంకరులు రచించిన గ్రంథం ఒకటి ఉన్నది, అందులో -

''అంకోలం నిజబీజ సంతతిః'' అనే శ్లోకం ఒకటి ఉంది. దాని తాత్పర్యం ఇది - ఊడుగచెట్టు గింజలు రాత్రి రాలిపోతాయి. ఉదయమే అవి తిరిగి చెట్టును అంటుకొనిపోతాయి.

మానవుడు పగలల్లా సంసారం, వ్యాపారం చేస్తాడు, రాత్రి నిద్రపోతాడు, అట్లా కాకుండా రాత్రి సమయంలోనైనా, ఈశ్వరధ్యానము చేయాలి. అనగా ఊడుగుగింజ చెట్టుకు అంటుకొనునట్లు మనస్సు ఈశ్వరలగ్నం కావాలి. అందుకు సమయం కూడా అనుకూల పడాలి, అనడానికి ఈ ఉదాహరణ ఉపకరిస్తుంది. ఆ శ్లోకంలో ఇంకొక ఉదాహరణ ''అయస్కాంతోపలం సూచికా'' అంటే - సూది సూదంటురాయిని అంటుకుంటుంది, అలాగే మనమనస్సు శివుని యందు అంటుకోవాలి. పతివ్రత భర్తను అనుగమించినట్లు జన్మాంతరాల్లో కూడ అనుబంధం అలాగే వుంటుంది.

''సాధ్వీనైజ విభుం'' అన్నమాటకు తాత్పర్యము అది. అలాటి విడివడని అనుబంధం భక్తి ఈశ్వరునితో ఏర్పడాలి, ''లతా క్షితిరుహం'' అని ఇంకొక ఉదాహరణ. చెట్టుతో లత పెనవేసుకొని ఉంటుంది. తీగను విడదీస్తే అది చచ్చిపోతుంది. చెట్టునుమాత్రం తీగ అల్లుకొన్న గుర్తులు అలాగే ఉంటాయి. చెట్టుతో ఎడబాటునకు తీగ వాడిపోయినట్లు భగవంతునితో దూరమైనపుడు మనం కూడా బాధపడాలి. తీగతో అనుబంధం పోయినందుకు చెట్టుకూడా దుఃఖపడుతోందా అన్నట్లు ఆ తీగ అల్లుకొన్న గుర్తులు స్పష్టపరుస్తున్నాయి, అలాగే భక్తునితో ఎడబాటునకు భగవంతుడు కూడా బాధపడుతూ ఉంటాడు. ''సింధు స్సరి ద్వల్లభం'' నది సముద్రుని గురించి పోయి లీనమౌతుంది.

లీనమయినతరువాత ''నది'' అనే పేరే ఉండదు. ఇది ఐదవభక్తి, భక్తుడు భగవంతునితో సర్వాత్మనా లీనమయిపోవడం జన్మరాహిత్యం. సాయుజ్యం అంటే ఇదే. ఇట్లా ఐదు రకాల భక్తి భూమికలను శంకరులవారు ఈ శ్లోకంలో వివరించారు.

''కర్తవ్యో మమకారః'' అంటే నాది అనే మమకారం అవసరమే. మమకార మనేది ఎంతవరకు ఉంటే అంతవరకు కష్టాలే, అయినా ఈశ్వరునియందు ఈలాటిమమకారం ఉంచుకొంటే దుఃఖంలేదు. లోకంలో ''నాది'' అనేది త్యాగం చేయాలి. మనకు త్యాగం అలవాటులో లేదు. కాన మమకారాన్ని త్యాగం చేయకుండా అలవాటులో లేదు. అంటారా అపుడు ఈ మమకారాన్ని పరిమితంగా పుత్ర, మిత్ర, కళత్రాదులయందు ఏవో కొన్ని చోట్లనే ఉంచి, అవి మాత్రమే నాది. నాది అనుకొనక, అది విశ్వవ్యాప్తంచేసి, ప్రపంచమంతా నాదే అనుకోవాలి. అట్టి అవధిలేని మమకారంవల్ల సంతోషం వస్తుంది. అందరు ఈశ్వరుని బిడ్డలే, అంతా ఒక్కటే అని మమకారం పెట్టుకొంటే సరిపోతుంది.

అంగడికి వెడతాము. యజమాని ఒక్కడే వుంటాడు. రకరకాల గుడ్డలను గుమాస్తాలు చూపిస్తారు. విసుగు లేకుండా వర్ణిస్తారు. చివరకు ఒక్క గుడ్డ తీసుకొంటాము. బిల్లు ఇస్తారు. బిల్లు ఇచ్చినతర్వాత, ''అయ్యా వెళ్ళండి, ఇంకా కొనేవారు వస్తున్నారు. చోటు ఇవ్వండి.'' అని అంటారు. ఆ మాదిరి మానవుడు కూడా పనిఅయేదాకా, అంటే వేదవిహిత ధర్మం ఆచరించడం కోసం, సుఖలాభంకోసం, పుత్రమిత్రాదులయందు మమకారం ఉండవచ్చు. ఆపని అయాక ఆ మమకారాన్ని ఆ ఆదరాన్ని వదులుకోవాలి. మన తల్లీ, మన ఇల్లూ, మనకుక్క అని అనుకుంటే, కుక్క చచ్చినా దుఃఖపడతావు. కాన అంతా ఈశ్వరరూపము అనుకొని తాను సాక్షిగా ఉంటే క్రమముగా మనస్సు భగవంతునియందు లగ్నమై పోతుంది. బట్టలకొట్టు యజమానికి కొట్టునకు వచ్చిన జనుల మీద, ఎంతవరకు ఆదరము ఉందో, అంతవరకే సంసారం మీద మనం ఆదరం పెట్టుకొవాలి. క్రమంగా ఈశ్వరుడు, నేను ఒక్కటే అన్న ఐదవరకం భక్తి మనకు సిద్ధిస్తుంది.


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page