Sri Sivamahapuranamu-I    Chapters   

అథ ద్విచత్వారింశోధ్యాయః

దక్షుని ఉద్ధారము

బ్రహ్మోవాచ |

శ్రీ బ్రహ్మోశ ప్రజేశేన సదైవనమునినా చ వై | అనునీతశ్శంభురాసీత్ర్పసన్నః పరమేశ్వరః || 1

ఆశ్వాస్య దేవాన్‌ విష్ణ్వాదీన్‌ విహస్య కరుణానిధిః | ఉవాచ పరమేశానః కుర్వన్‌ పరమనుగ్రహమ్‌ || 2

బ్రహ్మ ఇట్లు పలికెను -

బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, దేవతలు, మునులు కలిసి అనునయించగా, పరమేశ్వరుడగు శంభుడు ప్రసన్నుడాయెను (1). కరుణా సముద్రుడగు పరమేశ్వరుడు విష్ణువు మొదలగు దేవతలను ఓదార్చి, చిరునవ్వు నవ్వి, గొప్ప అనుగ్రహమును ఇచ్చువాడై ఇట్లు పలికెను (2).

శ్రీ మహాదేవ ఉవాచ |

శృణుతం సావధానేన మమ వాక్యం సురోత్తమౌ | యథార్థం వచ్మి వాం తాత వాం క్రోధం సర్వదాసహమ్‌ || 3

నాఘం తనౌ తు బాలానాం వర్ణమేవానుచింతయే | మమ మాయాభి భూతానాం దండస్తత్ర ధృతో మయా || 4

దక్షస్య యజ్ఞభంగోయం న కృతశ్చ మయా క్వచిత్‌ | పరం ద్వేష్టి పరేషాం యదాత్మనస్తద్భవిష్యతి || 5

పరేషాం క్లేదనం కర్మన కార్యం తత్కదాచన | దక్షస్య భగ్న శీర్‌ష్ణో హి భవత్వజముఖం శిరః || 6

శ్రీ మహాదేవుడిట్లు పలికెను -

దేవశ్రేష్ఠులారా! మీరిద్దరు నా మాటను సావధానముగా వినుడు. వత్సలారా! మీకు నేను సత్యమును చెప్పెదను. మీరు చూపిన క్రోధమును నేను సర్వదా సహించితిని (3). బాలురు చేయు పాపములను నేను పరిగణించను. వారి బాల్యమును మాత్రమే పరిగణించెదను. వారు నా మాయచే పరాజితులై యుందురు గనుక, వారి యందు దండమును ప్రయోగించను (4). దక్షుని యజ్ఞమును ధ్వంసము చేసిన వాడను నేను కాదు. ఇతరుల అభివృద్ధిని ద్వేషించు వ్యక్తి తాను స్వయముగా భ్రష్ఠుడగును (5). కావున ఎప్పుడైననూ ఇతరులను నొప్పించే పనిని చేయరాదు. శిరస్సును కోల్పోయిన దక్షుడు మేక తలను పొందును గాక! (6).

మిత్రనేత్రేణ సంపశ్యేద్యజ్ఞభాగం భగస్సురః | పూషాభిధస్సురస్తాతౌ దద్భిర్యజ్ఞ సుపిష్టభుక్‌ || 7

యాజమానైర్భగ్నదంత స్సత్యమేతన్మయోదితమ్‌ | బస్తశ్మశ్రుర్భవేదేవ భృగుర్మమ విరోధకృత్‌ || 8

దేవాః ప్రకృతి సర్వాంగా యే మ ఉచ్ఛేదనం దదుః | బాహుభ్యామశ్వినోః పూష్ణో హస్తా భ్యాం కృతవాహకౌ || 9

భవంత్వధ్వర్యవశ్చాన్యే భవత్ర్పీత్యా మయోదితమ్‌ || 10

భగదేవత మిత్రుని నేత్రముతో యజ్ఞభాగమును దర్శించగలడు. వత్సలారా! పూషన్‌ అను దేవతకు దంతములు పోయినవి గదా! ఆయన యజమానుని దంతములతో మెత్తని పిండి రూపములోనున్న యజ్ఞ భాగమును (7). భక్షించగలడు. నేను చెప్పు వచనము యథార్థము. నాపై విరోధమును బూనిన భృగువు మేక యొక్క గెడ్డమును పొందగలడు (8). నా యందు విరోధమును ప్రదర్శించిన దేవతలు అందరూ తమ అవయవములను యథాపూర్వకముగా పొందగలరు. ఇతర ఋత్విక్కులు అశ్వినీ దేవతల బాహువులతో, పూషన్‌ యొక్క హస్తములతో యజ్ఞ కార్యములను (9) చక్కబెట్టగలరు. ఈ వ్యవస్థను మీ యందలి ప్రీతిచే నేను ప్రకటించితిని (10).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా పరమేశానో విరరామ దయాన్వితః | చరాచరపతిర్దేవస్సమ్రాట్‌ వేదాను సారకృత్‌ || 11

తదా సర్వ సురాద్యాస్తే శ్రుత్వా శంకర భాషితమ్‌ | సాధు సాధ్వితి సంప్రోచుః పరితుష్టాస్సవిష్ణ్వజాః || 12

తతశ్శంభుం సమామంత్ర్య మయా విష్ణుస్సురర్షిభిః | భూయస్తద్దేవయజనం య¸° చ పరయా ముదా || 13

ఏవం తేషాం ప్రార్థనయా విష్ణుప్ర భృతిస్సురైః | య¸° కనఖలం శంభుర్యజ్ఞవాటం ప్రజాపతేః || 14

బ్రహ్మ ఇట్లు పలికెను -

దయానిధి, చరాచర జగత్ర్పభువు, ప్రకాశస్వరూపుడు, సర్వులపై సమ్రాట్‌, వేద మార్గానుయాయి అగు పరమేశ్వరుడిట్లు పలికి మిన్నకుండెను (11). అపుడు విష్ణువు, బ్రహ్మ, దేవతలు, ఇతరులు అందరు శంకరుని మాటలను విని సంతసించినవాహై'సాధు సాధు' అని పలికిరి (12). అపుడు విష్ణువు, నేను, దేవతలు, ఋషులు కూడి శంభుని వెంటనిడుకొని మిక్కిలి ఆనందముతో మరల ఆ యజ్ఞవాటికకు వెళ్లితిమి (13). ఈ తీరున విష్ణువు మొదలగు దేవతలు ప్రార్థించగా శంభుడు దక్షప్రజాపతి యొక్క కనఖలమనే యజ్ఞ వాటిక వద్దకు వెళ్లెను (14).

రుద్రస్తదా దదర్శథ వీరభ##ద్రేణ యత్‌ కృతమ్‌ | ప్రధ్వంసం తం క్రతోస్తత్ర దేవర్షీణాం విశేషతః || 15

స్వాహా స్వధా తథా పూషా తుష్టిర్ధృతిస్సరస్వతీ | తథాన్యే ఋషయస్సర్వే పితరశ్చాగ్నయస్తథా || 16

యేన్యే చ బహవస్తత్ర యక్ష గంధర్వరాక్షసాః | త్రోటితా లుంచితాశ్చైవ మృతాః కేచిద్రణాజిరే || 17

యజ్ఞం తథావిధం దృష్ట్వా సమాహూయ గణాధిపమ్‌ | వీరభద్రం మహావీరమువాచ ప్రహసన్‌ ప్రభుః || 18

వీరభద్రుడు ఆ యజ్ఞమును ధ్వంసము చేసి దేవతలను, ఋషులను పరాజితులను గావించిన తీరున అపుడు రుద్రుడు దర్శించెను (15). స్వాహా, స్వధా, పూషన్‌, తుష్టి, ధృతి, సరస్వతి, ఇతర ఋషులు, పితృదేవతలు, అగ్నులు (16), ఇంతేగాక అక్కడకు వచ్చిన యక్ష గంధర్వ రాక్షసాదులు ఎంతోమంది అవయవములను గోల్పోయిరి. కొందరి కేశములు ఊడబెరుకబడెను. ఆ రణరంగములో మరికొందరు మరణించిరి (17). ఆ విధముగా నున్న యజ్ఞశాలను చూచి శంభువు గణాధ్యక్షుడు, మహావీరుడునగు వీరభద్రుని పిలిపించి, నవ్వుతూ ఆతనితో నిట్లనెను (18).

వీరభద్ర మహాబాహో కిం కృతం కర్మతే త్విదమ్‌ | మహాన్‌ దండో ధృతస్తాత దేవర్ష్యాదిషు సత్వరమ్‌ || 19

దక్షమానయ శీఘ్రం త్వం యేనేదం కృతమీదృశమ్‌ | యజ్ఞో విలక్షణస్తాత యస్యేదం ఫలమీదృశమ్‌ || 20

ఏవముక్తశ్శంకరేణ వీదభద్రస్త్వరాన్వితః | కబంధమానయిత్వాగ్రే విహసన్మునిసత్తమ || 22

హే వీరభద్రా! మహాబాహో! నీవు ఎట్టి కర్మను చేసితివి ? వత్సా? చూడుము. నీవు దేవతలు, ఋషులు మొదలగు వారిపై అతిశీఘ్రముగా కఠినమగు దండమును అమలు చేసితివి (19). వత్సా! దక్షుడు ఇట్టి విచిత్రమగు యజ్ఞమును అనుష్ఠించి, ఇట్టి ఫలమును పొందినాడు. నీవాతనిని శీఘ్రముగా గొనిరమ్ము (20). ఈ తీరున శంకరునిచే ఆజ్ఞాపింపబడినవాడై వీరభద్రుడు సత్వరమే దక్షుని మొండెమును తెచ్చి శంభుని ఎదుట పారవైచెను (21). ఓ మహర్షీ! లోకములకు శుభములనిచ్చు ఆ శంకరుడు తలలేని ఆ మొండెమును చూచి చిరునవ్వుతో వీరభద్రుని ఉద్దేశించి ఇట్లనెను (22).

శిరః కుత్రేతి తోనోక్తే వీరభద్రోబ్రవీత్ర్పభుః | మయా శిరో హుతం చాగ్నౌ తదానీ మేవ శంకర|| 23

ఇతి శ్రుత్వా వచస్తస్య వీరభద్రస్య శంకరః | దేవాన్‌ తథాజ్ఞపత్ర్పీత్యా యదుక్తం తత్పురా ప్రభుః || 24

విధాయ కార్త్స్నన చ తద్యదాహ భగవాన్‌ భవః | మయా విష్ణ్వాదయస్సర్వే భృగ్వాదీనథ సత్వరమ్‌ || 25

అథ ప్రజాపతేస్తస్య సవనీయపశోశ్శిరః | బస్తస్య సందధుశ్శంభోః కాయేనారం సుశాసనాత్‌ || 26

సంధీయమానే శిరసి శంభుసద్దృష్టి వీక్షితః | సద్యుస్సుప్త ఇవోత్తస్థౌ లబ్ధప్రాణః ప్రజాపతిః || 27

శిరస్సు ఎక్కడ ? అని ప్రశ్నించగా, వీరభద్రప్రభుడు ' హే శంకరా! నేను శిరస్సును ఆ సమయములోనే అగ్నిహోత్రమునందు హోమము జేసితిని' అని పలికెను (23). వీరభద్రుని ఈ పలుకులను విని శంకురుడు తాను పూర్వమునందు చెప్పిన తీరుగనే దేతలను ఆజ్ఞాపించెను (24). శివభగవానుడు చెప్పిన తీరుగనే మేము విష్ణువు మొదలగు అందరితో గూడి భృగువు మొదలగు వారిని శీఘ్రముగా స్వస్థులను చేసితిమి (25). అపుడు శంభుని గొప్ప ఆజ్ఞచే ఆ దక్ష ప్రజాపతికి యజ్ఞ పశువు యొక్క శిరస్సును వెంటనే సంధానము చేసిరి (26). శిరస్సును సంధించగానే, శంభుని కృపాదృష్టి వానిపై పడెను. వెంటనే ఆ ప్రజాపతి ప్రాణములను పొంది నిద్రనుండి లేచిన వాడు వలె లేచి నిలబడెను (27).

ఉత్థితశ్చాగ్రతశ్శంభుం దదర్శ కరుణానిధిమ్‌ | దక్షః ప్రీతమతిః ప్రీత్యా సంస్థితస్సుప్రసన్నధీః || 28

పురా హరమహాద్వేష కలిలాత్మభవద్ధి సః | శివావలోకనాత్సద్య శ్శరచ్చంద్ర ఇవామలః || 29

భవం స్తోతుమనాస్సోథ నాశక్నో దనురాగతః | ఉత్కంఠా వికలత్వాచ్చ సంపరేతాం సుతాం స్మరన్‌ || 30

అథ దక్షః ప్రసన్నాత్మా శివంలజ్జా సమన్వితః | తుష్టావ ప్రణతో భూత్వా శంకరం లోకశంకరమ్‌ || 31

దక్షుడు లేవగానే ఎదురుగా కరుణానిధియగు శంభుని చూచి, సంతసించిన మనస్సు గలవాడై, మిక్కిలి ప్రసన్నమైన అంతరంగము గలవాడై ప్రీతితో నిలబడెను (28). అతడు పూర్వము శివుని యందలి తీవ్రమగు ద్వేషముచే మలినీకృతమైన అంతరంగము కలవాడుగా నుండెను. శివుని చూచుట తోడనే ఆతని అంతరంగము శరత్కాలచంద్రుని వలెన నిర్మలమాయెను (29). అతడు అపుడు శివుని స్తుతింపగోరెను. కాని మరణించిన కుమార్తె గుర్తుకు వచ్చుటచే ఆ దుఃఖముతో, మరియు శివుని యందలి భక్తితో ఆతడు మాటలాడలేక పోయెను (30). అపుడు దక్షుడు కొంతసేపటికి ప్రసన్నమైన మనస్సుగలవాడై సిగ్గుతో కూడినవాడై, లోకములకు మంగళములనిచ్చు శివశంకరుని నమస్కరించి స్తుతించెను (31).

దక్ష ఉవాచ |

నమామి దేవం వరదం వరేణ్యం మహేశ్వరం జ్ఞాననిధిం స నాతనమ్‌ |

నమామి దేవాధిపతీశ్వరం హరం సదా సుఖాఢ్యం జగదేక బాంధవమ్‌ || 32

నమామి విశ్వేశ్వర విశ్వరూపం పురాతనం బ్రహ్మ నిజాత్మరూపమ్‌ |

నమామి శర్వం భవ భావభావం పరాత్పరం శంకరమానతోస్మి || 33

దేవదేవ మహాదేవ కృపాం కురు మమోస్తు తే | అపరాధం క్షమస్వాద్య మమ శంభో కృపానిధే || 34

దక్షుడిట్లు పలికెను -

వరములనిచ్చువాడు, సర్వశ్రేష్ఠుడు, జ్ఞాన సముద్రుడు, సనాతనుడు, దేవ ప్రభువులకు ప్రభువు, పాపములను హరించువాడు, సర్వదా సుఖస్వరూపుడు, ప్రాణులకు ఏకైక బంధువు అగు మహేశ్వర దేవుని నమస్కరించుచున్నాను (32). జగత్తునకు అధీశ్వరుడు, జగత్స్వరూపుడు, పురాతనుడు, పరబ్రహ్మయే స్వీయ ఆత్మగా గలవాడు, ప్రాణులను సంహరించువాడు, జగత్తులోని పదార్థముల ఉనికికి మూలమైన సత్తా స్వరూపుడు, పరాత్పరుడు అగు శంకరుని నమస్కరించుచున్నాను (33). ఓ దేవదేవా !మహాదేవా!దయను చూపుము. నీకు నమస్కారము. హే శంభో! దయానిధీ!ఈనాడు నేను చేసిన అపరాధమును క్షమించుము (34).

అనుగ్రహః కృతస్తే హి దండవ్యాజేన శంకర | ఖలోహం మూఢధీర్దేవ జ్ఞాతం తత్త్వం మయా న తే షష 35

అద్య జ్ఞాతం మయా తత్త్వం సర్వోపరి భవాన్మతః | విష్ణు బ్రహ్మాదిభిస్సేవ్యో వేదవేద్యో మహేశ్వరః || 36

సాధూనాం కల్పవృక్షస్త్వం దుష్టానాం దండధృక్‌ సదా | స్వతంత్రః పరమాత్మా హి భక్తా భీష్ట వరప్రదః || 37

విద్యా తపో వ్రతధరానపృజః ప్రథమం ద్విజాన్‌ |ఆత్మతత్త్వం సమావేత్తుం ముఖతః పరమేశ్వరః || 38

సర్వాపద్భ్యః పాలయితా గోపతిస్తు పశూనివ | గృహీత దండో దుష్టాంస్తాన్‌ మర్యాదాపరిపాలకః || 39

హే శంకరా! నీవు నన్ను దండించు మిషతో అనుగ్రహమునే చూపితిని. హే దేవా! నేను దుష్టుడను. మూర్ఖుడను. నేను నీ తత్త్వము నెరుగకుంటిని (35).ఈనాడు నాకు

నీత్త్వము తెలిసినది. నీవు సర్వులపై అధీశ్వరుడవు. విష్ణు బ్రహ్మాదులు నిన్ను సేవించెదరు. కల్ప వృక్షము వంటి వాడవు. నీవు సర్వదా దుష్టులను దండించెదవు. స్వతంత్రుడు, భక్తులకు కోరికలను వరరూపములో నిచ్చువాడు అగు పరమాత్మవు నీవే (37). పరమేశ్వరుడవగు నీవు ఆత్మ తత్త్వము లోకములో ప్రవర్తిల్ల జేయుటకై విద్యను, తపస్సును, దీక్షను కలిగియున్న బ్రాహ్మణులను ముందుగా నీ ముఖము నుండి సృజించితివి (38). నీవు పశువుల కాపరి పశువులను పాలించు తీరున భక్తులను సర్వ విధముల ఆపదలనుండి రక్షించెదవు. మరియు ధర్మ మర్యాదలను పాలించె నీవు దుష్టులపై దండమును ప్రయోగించెదవు (39).

మయా దురుక్త విశిఖైః ప్రవిద్ధః పరమేశ్వరః | అమరావతి దీశానాన్‌ మదనుగ్రహకారకః || 40

స భవాన్‌ భగవాన్‌ శంభో దీనబంధో పరాత్పరః | స్వకృతేన మహార్హేణ సంతుష్టో భక్తవత్సల || 41

నేను చెడుమాటలనే బాణములతో పరమేశ్వరుని వేధించితిని. అయిననూ నీవు నన్ను అనుగ్రహించితివి. అటులనే మిక్కిలి దీనమగు ముఖములు గల ఈ దేవతలను అనుగ్రహించుము (40). హే దీనబంధూ!శంభో!భక్తవత్సలా! అట్టి నీవు భగవానుడవు. పరాత్పరుడవు. నీవు సృష్టించుకున్న నీ స్వరూపమైన ఈ విస్తారమైన బ్రహ్మండములో నీవు ఆనందరూపుడవై ఉన్నావు (41).

బ్రహ్మోవాచ |

ఇతి స్తుత్వా మహేశానం శంకరం లోక శంకరమ్‌ | ప్రజా పతిర్వినీతాత్మా విరరామ మహాప్రభుమ్‌ || 42

అథ విష్ణుః ప్రసన్నాత్మా తుష్టావ వృష భధ్వజమ్‌ | బాష్ప గద్గదయా వాణ్యా సుప్రణమ్య కృతాంజలిః || 43

బ్రహ్మ ఇట్లు పలికెను -

లోకములకు మంగళములనిచ్చే మహా ప్రభుడగు మహేశ్వరుని దక్ష ప్రజాపతి ఈ తీరున వినయముతో నిండిన అంతకరణము గల వాడై స్తుతించి ఊరకుండెను (42). అపుడు విష్ణువు దోసిలి యొగ్గి నమస్కరించి కన్నీటితో బొంగురుపోయిన పలుకులతో ప్రసన్నమగు మనస్సుతో వృషభధ్వజుని స్తుతించెను (43).

విష్ణు రువాచ |

మహాదేవ మహేశాన లోకానుగ్రహకారక | పరబ్రహ్మా పరాత్మా త్వం దీనబంధో దయానిధే || 44

సర్వవ్యాపీ సై#్వరవర్తీ వేద వేద్యయాశాః ప్రభో | అనుగ్రహః కృతస్తేన కృతాశ్చాసుకృతా వయమ్‌ || 45

దక్షోయం మమ భక్తస్త్వాం యన్నినింద ఖలః పురా | తత్‌ క్షం తవ్యం మహేశాద్య నిర్వికారో యతో భవాన్‌ || 46

కృతో మయాపరాధోపి తవ శంకర మూఢతః | త్వద్గణన కృతం యుద్ధం వీరభ##ద్రేణ పక్షతః || 47

త్వం మే స్వామీ పరబ్రహ్మ దాసోహం తే సదాశివ | పోష్యశ్చాపి సదా తే హి సర్వేషాం త్వం పితా యతః || 48

విష్ణువు ఇట్లు పలికెను -

హే మహాదేవా!మహేశ్వరా! లోకములననుగ్రహించువాడా!దీనబంధో! దయానిధీ! పరబ్రహ్మ పరమాత్మవు నీవే (44). హే ప్రభో! సర్వ వ్యాపి, యథేచ్ఛా సంచారి, వేదములచే తెలియదగిన యశస్సు గలవాడు అగు నీవు అనుగ్రహమును చూపితివి. మేము పాపములను చేయునట్లు ఆ దక్షుడు చేసినాడు (45). నా భక్తుడగు ఈ దక్షుడు పూర్వములో నిన్ను నిందించినాడు. ఈతడు దుష్టుడు. కాని మహేశా! నీవు నిర్వికారుడవు. కాన నీవు ఆ దోషమును మన్నించుము (46). హే శంకరా! అజ్ఞానముచే నేను కూడ నీయందు అపరాధమును సలిపితిని. నేను దక్షుని పక్షమున నుండి నీ గణములకు అధ్యక్షుడగు వీరభద్రునితో యుద్ధమును చేసితిని (47). నాకు ప్రభువగు పరబ్రహ్మవు నీవే. హే సదాశివా! నేను నీ దాసుడను. నీవు అందరికీ తండ్రివి గాన, నీవు నన్ను కూడ సర్వదా రక్షించవలెను (48).

బ్రహ్మోవాచ |

దేవ దేవ మహాదేవ కరుణాసాగర ప్రభో | స్వతంత్రః పరమాత్మా త్వం పరమేశోద్వయోవ్యయః || 49

మమ పుత్రోపరికృతో దేవానుగ్రహ ఈశ్వర | స్వాపమానమగణయన్‌ దక్షయజ్ఞం సముద్ధర || 50

ప్రసన్నో భవ దేవేశ సర్వశాపాన్నిరాకురు | సబోధః ప్రేరకస్త్వం మే త్వమేవం వినివారకః || 51

ఇతి స్తుత్వా మహేశానం పరమం చ మహామునే | కృతాంజలి పుటో భూత్వా వినమ్రీకృతమస్తకః || 52

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! నీవు స్వతంత్రుడవగు పరమాత్మవు.అద్వితీయ, అవ్యయ, పరమేశ్వరుడవు నీవే (49). హే ఈశ్వరా! దేవా! నీవు నీకు కలిగిన అవమానమును లెక్కించకుండగా నా కుమారునిపై అనుగ్రహమును చూపితివి. దక్షుని యజ్ఞమును ఉద్ధరించుము (50). దేవేశా! నీవు ప్రసన్నుడవు కమ్ము. శాపముల నన్నిటినీ త్రోసిపుచ్చుము. జ్ఞాన స్వరూపుడవగు నీవే నన్నీ తీరున ప్రేరేపించితివి. దీనిని నివారించవలసినది నీవే. ఓ మహర్షీ! ఇట్లు నేను దోసిలియొగ్గి తలవంచి నమస్కరించి ఆ పరమ మహేశ్వరుని స్తుతించితిని (52).

అథ శక్రాదయో దేవా లోకపాలా స్సుచేతసః | తుష్టువుశ్శంకరం దేవం ప్రసన్నముఖపంకజమ్‌ || 53

తతః ప్రసన్న మనసస్సర్వే దేవాస్తథా పరే | సిద్ధర్షయః ప్రజేశాశ్చ తుష్టువుశ్శంకరం ముదా || 54

తథోపదేవనాగాశ్చ సదస్యా బ్రాహ్మణాస్తథా | ప్రణమ్య పరయా భక్త్యా తుష్టువుశ్చ పృథక్‌ పృథక్‌ || 55

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీ ఖండే దక్ష దుఃఖ నిరాకరణ వర్ణనం నామ ద్విచత్వారింశోధ్యాయః (42).

తరువాత ఇంద్రుడు మొదలగు లోకపాలురు, దేవతలు మంచి మనస్సు గలవారై, ప్రసన్నమైన ముఖ పద్మము గల శంకర దేవుని స్తుతించిరి (53). తరువాత ప్రసన్నమగు మనస్సు గల దేవతలందరు, ఇతరులు, సిద్ధులు, ఋషులు, ప్రజాపతులు శంకరుని ఆనందముతో స్తుతించిరి (54). మరియు ఉపదేవతలు, నాగులు, సభలో నున్న బ్రాహ్మణులు శివుని వేర్వేరుగా పరాభక్తితో నమస్కరించి స్తుతించిరి (55).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో దక్షదుఃఖ నిరాకరణ వర్ణనమనే నలుబది రెండవ అధ్యాయము ముగిసినది (42).

Sri Sivamahapuranamu-I    Chapters