Sruthi Sourabham    Chapters    Last Page

11. స్వాధ్యాయ ప్రవచనాల వల్ల

తపోయోగ ఫలాలు

వేద భాష్యాచార్యులయిన సాయణాచార్యుల వారు స్వాధ్యాయము వలన తపః ఫలము, యోగశాస్త్ర ఫలము సిద్ధిస్తాయి. కనుక స్వాధ్యాయ పరులకు యోగము, తపస్సు అవసరం లేదని స్వాధ్యాయ బ్రాహ్మణ భాష్యంలో ప్రతిపాదించారు.

'తస్మాత్‌ స్వాధ్యాయోధ్యేతవ్యః' అనే విధి వాక్యాన్ని వ్యాఖ్యానిస్తూ 'యస్మాత్‌ స్వాధ్యాయ వ్యతిరేకేణ సుకృత మార్గో నజ్ఞాయతే తస్మాత్‌ స్వాధ్యాయోధ్యేతవ్యః. గ్రహణాధ్యయనం బ్రహ్మయజ్ఞాధ్యయనంచ కర్తవ్యమ్‌. తచ్చోభయం పరమ పురుషార్థ సాధనమితి ఉపనిషది బహూనా మృషీణాం మత భేదోపన్యాస ప్రసంగేన విస్పష్ట మామ్నాతమ్‌'' ''స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్యః. తద్ధితపస్తద్ధి తపః'' ఇతి. సత్యవదన మేవ పరమ పురుషార్థ సాధనమితి రాథీతరమతమ్‌. కృచ్ఛ్ర చాన్ద్రాయణాది రూపం తప ఏవ తత్సాధన మితి పౌరుశిష్టేర్మతమ్‌. మౌద్గల్య స్త్వత్యన్త రహస్యదర్శీ రహస్యార్థత్వా త్తదేత దుభయ మువాచ. తత్ర గ్రహణార్థ మధ్యయనం స్వాధ్యాయః. గృహీతస్య వేదస్య ప్రకర్షేణ ప్రతిదినం బ్రహ్మయజ్ఞ రూపేణ వచనం ప్రవచనం. ఉభే ఏవోత్తమే పురుషార్థ సాధనే. సత్యాదీనా మత్రార్థ సిద్ధత్వాత్‌. యోహి నిరంతరం స్వాధ్యాయం పఠతి తస్యానృత వదనే కః ప్రసఙ్గః. తపోస్యాత్రార్థ సిద్ధమ్‌. నిషిద్ధ విషయ ప్రవణానామిన్ద్రియాణాం బలక్షయ ద్వారేణోద్ధతత్వం వారయితుం కృచ్ఛ్ర చాన్ద్రాయణాదినా శరీర శోషణ రూపం తపః క్రియతే. స్వాధ్యాయ పరస్యతు విషయ మాత్ర చింతైవ నాస్తి; కుతో దుష్ట విషయేషు ప్రవృత్తిః.

విషయ ధ్యాన నివృత్యర్థ మేవ చిత్తవృత్తి నిరోధరూపం యోగం వక్తుం కృత్స్నం యోగశాస్త్రం ప్రవృత్తమ్‌. సా చ విషయ ధ్యాన నివృత్తిః స్వాధ్యాయ నిరతస్యాప్రయాసేనైవ సిద్ధా. తత్ర కిమనేన యోగ శాస్త్రేణ, కృచ్ఛ్ర చాంద్రాయణాదినా తపసావా? ఏతత్సర్వ మభిప్రేత్య మౌద్గల్య 'స్తద్ధి తపస్తద్ధి తప' ఇతి ప్రసిద్ధి వాచకేన హి శ##బ్దేన వీప్సయాచ స్వాధ్యాయ ప్రవచనయో రత్యాదరం దర్శయతి.''

- తైత్తిరీయారణ్యకం - 2 ప్ర. - 15 అను. భాష్యం

(స్వాధ్యాయం లేకుండా సుకృత మార్గం తెలియనందువల్ల వేదాన్ని గ్రహణం కోసం అధ్యయనం చేయాలి. బ్రహ్మ యజ్ఞంలో పారాయణం కూడా చేయాలి. అవి రెండూ పరమ పురుషార్థానికి సాధనాలు. ఈ ఉపనిషత్తులో చాలామంది ఋషుల అభిప్రాయాలు చెప్పడం సందర్భంగా 'స్వాధ్యాయ ప్రవచనాలే ఉత్తమ పురుషార్థ సాధనా'లని మౌద్గల్యుడన్నారు. 'అదే తపస్సు అదే తపస్సు' అని స్పష్టంగా చెప్పడం జరిగింది.

సత్యం పలకడమే పరమ పురుషార్థ సాధనమని రాథీతరుని అభిప్రాయం. కృచ్ఛ్రం చాంద్రాయణం వంటి తపస్సే ఆ పురుషార్థ సాధనమని పౌరుశిష్టి అభిప్రాయం. అత్యంత రహస్యదర్శి అయిన మద్గౌల్యుడు రహస్య విషయాలయిన ప్రవచనాలనే రెండూ తపస్సులని చెప్పారు. వేదం కంఠస్థమవడం కోసం అధ్యయనం చేయడం స్వాధ్యాయం. చదివిన వేదాన్ని ప్రతిదినం బ్రహ్మయజ్ఞం రూపంలో పారాయణ చేయడం ప్రవచనం. ఈ రెండూ ఉత్తమ పురుషార్థానికి సాధనాలు. వీటి వల్ల సత్యం మొదలయినవి గూడా సిద్ధిస్తాయి. నిరంతరం వేదాధ్యయనం చేసేవాడికి అసత్యమాడే అవకాశముండదు. వీరికి తపస్సు చేసిన ఫలం గూడా లభిస్తుంది. శాస్త్రం నిషేధించిన విషయాలపై ఆసక్తితో ఉండే ఇంద్రియాల ఉద్ధతత్వాన్ని వారించడం కోసం కృచ్ఛ్రం, చాంద్రాయణం మొదలయిన వ్రతాల వల్ల శరీరాన్ని ఎండించడ మనే తపస్సు చేస్తారు. స్వాధ్యాయ పరుడికి శబ్ద స్పర్శ రూప రస గంధాలను గురించిన ఆలోచనే ఉండదు. ఇక దుష్టవిషయాలలో వారెందుకు ప్రవర్తిస్తారు ?

విషయాలను ధ్యానం చేయకుండా మళ్ళడం కోసం, చిత్తవృత్తిని నిరోధించడం రూపమయిన యోగాన్ని ఉపదేశించడం కోసం సమస్త యోగ శాస్త్రము ప్రవర్తించింది. స్వాధ్యాయ నిరతుడు ప్రయాస లేకుండానే శబ్ద స్పర్శ రూప రస గంధాలనే విషయాలకు దూరంగా ఉంటున్నాడు. అతనికి యోగశాస్త్రంతో పనేమిటి? కృచ్ఛ్రం, చాంద్రాయణం మొదలయిన తపస్సులతో పనేమిటి?

ఇదంతా మనస్సులో పెట్టుకుని మౌద్గల్యుడు అదే తపస్సు గదా! అదే తపస్సు గదా అని ప్రసిద్ధిని తెలిపే 'హి' శబ్దంతో రెండు సార్లు చెప్పి స్వాధ్యాయ ప్రవచనాల యెడ అత్యాదరాన్ని చూపారు.)

అని సాయణాచార్యుల వారు స్వాధ్యాయ ప్రవచనాలు చేసేవారికి తపఃఫలం యోగఫలం అప్రయత్నంగా సిద్ధిస్తాయని వివరించారు. కనుక వేద పండితులీ విషయం గుర్తించడం వల్ల వారిహపరాలను సులభంగా పొంద గలుగుతారు.

కాని దుష్ట విషయ ప్రవృత్తి ఉన్నవారికి, విషయ ధ్యానం చేసేవారికి తపః ఫలం యోగ ఫలం లభించడం లేదని శ్రీ సాయణాచార్యుల వారు తమ వివరణం ద్వారా సూచించారని గమనించాలి.

వేదాధ్యయనం వల్ల యోగ ఫలం సిద్ధించడాన్ని మరికొన్ని ఉక్తులు బలపరుస్తాయి. మనుస్మృతి వేదాధ్యయనాన్ని ఇలా ఆరంభించాలని చెప్పింది.

శ్లో. బ్రహ్మణః ప్రణవం కుర్యా దాదావంతేచ సర్వదా

స్రవ త్యనోంకృతం పూర్వం పరస్తాచ్చ విశీర్యతే

ప్రాక్కూలాన్‌ పర్యుపాసీనః పవిత్రై శ్చైవ పావితః

ప్రాణాయామైస్త్రిభిః పూతః తత ఓంకార మర్హతి

(ఎప్పుడూ వేదాధ్యయనానికి ప్రారంభంలో, సమాప్తిలో ఓంకారం చేయాలి. మొదట ఓంకారం చేయకపోతే అధ్యయనం చేసినది మరచిపోతాడు. చివర ప్రణవం చేయకపోతే వేదమే రాదు. తూర్పు కొసలుండేలా వేసికొన్న దర్భాసనంపై కూర్చొని, చేతికి దర్భ పవిత్రమును ధరించడంచేత పవిత్రుడై మూడు ప్రాణాయామాలు చేసి మరింత శుద్ధుడైన తర్వాత ఓంకారం చేయాలి.) - మనుస్మృతి - 2 అ. 74, 75 శ్లో.

ఇపుడు ప్రాణాయామం చేయడం ఆంధ్ర ప్రాంతంలో అలవాటు లేదు గాని 'శ్రీ గురుభ్యో నమః, హరిః ఓం' అని గురువందనం వాచికంగా చేసి హరిని స్మరించి ప్రణవం చేయడం జరుగుతోంది. ఈ గురువందనం గూడా మనుస్మృతి చెప్పింది.

శ్లో. అధ్యేప్యమాణస్త్వాచాంతో యథా శాస్త్ర ముదఙ్ముఖః

బ్రహ్మాంజలి కృతోధ్యాప్యోలఘువాసా జితేంద్రియః

బ్రహ్మారంభేవసానేచ పాదౌ గ్రాహ్యే గురో స్సదా

సంహత్య హస్తావధ్యేయం సహి బ్రహ్మాంజలి స్మృతః

(అధ్యయనం చేయబోయే శిష్యుడు శాస్త్రాన్ననుసరించి శుద్ధ వస్త్రం ధరించి, ఇంద్రియాలను జయించి, ఉత్తర ముఖంగా తిరిగి, ఆచమనం చేసి బ్రహ్మాంజలితో ఉండగా గురువు అధ్యయనం చేయించాలి. వేదం ప్రారంభించే ముందు, చివర గురువు పాదాలు పట్టుకొని నమస్కరించాలి. చేతులు కట్టుకుని అధ్యయనం చేయాలి. అదే బ్రహ్మాంజలి.)

తూర్పుగా తిరిగి అధ్యయనం చేయవచ్చని 'ప్రాఙ్ముఖో దక్షిణత శ్శిష్య ఉదఙ్ముఖోవా' అనే గౌతమ స్మృతి తెలుపుతుంది. 'ప్రాణాయామాస్త్రయః పంచదశ మాత్రాః' అని గౌతమ ముని చెప్పడం వల్ల పదిహేను మాత్రల కాలంతో ఒక్కొక్క ప్రాణాయామం చొప్పున 3 సార్లు ప్రాణాయామం చేయాలి.

వేదాన్ని ఆరంభించేటప్పుడు ఓంకారాన్ని ప్లుతంగా ఉచ్చరించాలని 'ఓమభ్యాదానే' అని పాణిని ముని తెలిపారు. - అష్టాధ్యాయి - 8-2-87 సూ.

'తతః క్షీయతే ప్రకాశావరణమ్‌' (ప్రాణాయామం వల్ల మనస్సుకు ప్రకాశ రూపమయిన వివేక జ్ఞానానికి ఆవరణమయిన అజ్ఞానం తొలగుతుంది.) ''ధారణాసుచ యోగ్యతా మనసః'' (ప్రాణాయామం వల్ల మనస్సుకు ధారణలు చేసే యోగ్యత వస్తుంది.) - యోగ సూత్రములు - 2 పా. 52, 53 సూ.

'దేశ బంధ శ్శిత్తస్య ధారణా' (చిత్తాన్నొకచోట నిలపడమే ధారణ) అని పతంజలి పేర్కొన్నారు. - యోగ సూత్రములు - 3 పా. 1 సూ.

మంత్ర శాస్త్రంలో ప్రణవ ధ్వనిచే కుండలిని మేల్కొని సహస్రార పద్మాన్ని తాకుతుందని, అక్కడ నుండి అమృతం వర్షిస్తుందని చెప్పారు.

శ్లో. మూలాధారే ధ్వనిం శ్రుత్వా ప్రబుద్ధా శక్తి కుండలీ

జ్వల త్పావక సంకాశా సూక్ష్మ తేజ స్స్వరూపిణీ

మూలాధారా చ్ఛిరః పద్మం స్పృశంతీ విద్యుదా కృతిః

తయా స్పృష్ట శిరః పద్మాదమృతౌఘ ప్రవర్షిణీ

వేదాధ్యయనం చేసేటపుడు, ప్రధానంగా సంహితాధ్యయనంలో ఎడతెగకుండా గుక్కఆపకుండా చెబుతూన్నందువల్ల యోగ శాస్త్రంలో ప్రధానమైన ఉడ్యానబంధ మేర్పడుతుంది.

శ్లో. బద్ధోయేన సుషుమ్నాయాం ప్రాణ స్తూడ్డీయతే యతః

తస్మా దుడ్డీయనాఖ్యోయం యోగిభి స్సముదాహృతః

(కట్టువడియున్నప్రాణము, ఉడ్డీయన బంధంచేత సుషుమ్నా నాడియందు పైకెగురుతుంది కనుక ఈ బంధానికి ఉడ్డీయన మని పేరు వచ్చింది. ఉడ్డీయన మంటే పైకి ఎగరడం.)

శ్లో. ఉదరే పశ్చిమం తానం నాభే రూర్ధ్వఞ్చ కారయేత్‌

ఉడ్డీయనా హ్యసౌ బన్ధో మృత్యుమాతఙ్చ కేసరీ

(కడుపునందు నాభికి పై భాగమును క్రింది భాగాన్ని వీపును తాకే విధంగా వెనుకకు లాగాలి. ఇదే ఉడ్డీయన బంధం. ఇది మృత్యువనే ఏనుగుకు సింహం వంటిది.

శ్లో. ఉడ్డీయానంతు సహజం గురుణా కథితం సదా

అభ్యసే త్సతతం యస్తు వృద్ధోపి తరుణాయతే

(గురువుపదేశించిన సహజమైన ఈ ఉడ్డీయన బంధాన్ని నిరంతరం అభ్యాసం చేసే వృద్ధుడు కూడా ¸°వనవంతుడవుతాడు.)

శ్లో. నాభే రూర్ధ్వ మధశ్చాపి తానం కుర్యాత్ర్పయత్నతః

షణ్మాస మభ్యసే స్మృత్యుంజయత్యేవ నసంశయః

(నాభికి పై భాగం, క్రింది భాగం ప్రయత్నపూర్వకంగా వెనుకకు లాగడం వల్ల విస్తరించాలి. ఇలా ఆరు నెలలు అభ్యసించినవాడు మృత్యువును జయిస్తాడు. సంశయం లేదు.)

శ్లో. సర్వేషా మేవ బంధానాముత్తమోహ్యుడ్డియానకః

ఉడ్డియానే దృఢే బన్ధే ముక్తి స్స్వాభావికీ భ##వేత్‌

(బంధాలన్నింటిలోకి ఉడ్డీయన బంధముత్తమం. ఈ బంధాన్ని దృఢంగా అభ్యసిస్తే ముక్తి స్వభావం చేత సిద్ధిస్తుంది.)

- హఠయోగప్రదీపిక - 3 ఉప. - 56, 58, 59, 60, 61 శ్లో.

వేదసంహితను స్వరసహితంగా చదవడం వల్ల సహజంగా ఉడ్డీయన బంధమేర్పడడం, దానివల్ల పైన చెప్పిన లాభాలు కలిగే అవకాశముంది.

ఉపనయనం వేదాధ్యయనం అయిన వారు తమకుపనయనం వల్ల శక్త్యుద్బోధం జరగలేదని తలచినపుడొక మంత్ర సిద్ధుని ద్వారా శక్త్యుద్బోధం కోసం ప్రయత్నించాలి. మొదట ఉపనయనంలో శక్త్యుద్బోధం కలిగి తరువాత అశ్రద్ధ, అనాచారాల వల్ల ఆ శక్తిని కోల్పోయినవారు 10 వేల సార్లు గాయత్రీ మంత్ర జపం చేయడం వల్ల వారిలో మరల దివ్యశక్తి మేల్కొంటుంది.

మంత్ర శాస్త్ర సంప్రదాయంలో భూశుద్ధి, భూతశుద్ధి, పాప పురుష దహనం, అంతర్మాతృకాన్యాసం, బహిర్మాతృకాన్యాసం చేయడం వల్ల గూడ దివ్యశక్తి మేల్కొనడం జరుగుతోంది.

ఆశ్రమానుగుణమయిన బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల 'ఓజస్సు' అనే 8వ ధాతువు ఏర్పడుతుంది.

శ్లో. రసాదితః క్రమాత్పాకః శుక్రాన్తేషు తు ధాతుషు

శుక్ర పాకాత్స్వయం భిద్యేదోజోనామాష్టమీ దశా

క్షేత్రజ్ఞస్యతదోజస్తు కేవలాశ్రయమిప్యతే

యథా స్నేహః ప్రదీపస్య యథాభ్రమశనిత్విషః

- ప్రపంచ సారతంత్రం

(అన్నరసం క్రమంగా పరిణతమయి శుక్రం వరకు ఉన్న 7 ధాతువులుగా పరిణమిస్తుంది. శుక్రం గూడా పరిణితి పొందితే ఓజస్సనే 8వ దశ ఏర్పడుతుంది. నూనె దీపానికి, మేఘం, పిడుగు కాంతికి ఆధారమయినట్లు ఓజస్సు క్షేత్రజ్ఞునికి ముఖ్యమయిన ఆశ్రయం.)

అని శ్రీ శంకర భగవత్పాదుల వారు చెప్పారు. కనుక సాధకుడు ఓజస్సును సంపాదించడం చాలా ప్రయోజనకరం.

మంత్రశాస్త్రంలో మంత్రం పురశ్చరణ వల్ల శక్తి వంతం అవుతుందంటారు. అలాగే 'ఛందసాగ్‌ం స్వాధ్యాయేన' అని శ్రుతి 'స్వాధ్యాయం వల్ల ఛందస్సు శక్తిమంతం అవుతుందని చెబుతోంది. కనుక నిష్కామంగా చేసే స్వాధ్యాయ ప్రవచనాలు ప్రధానంగా వేద పండితునికి సత్య తపో యోగ ఫలాలను ప్రసాదిస్తాయని నిశ్చయంగా చెప్పవచ్చును.

కాన స్వాధ్యాయ ప్రవచనాల వల్ల సత్య తపో యోగ ఫలాలు లభిస్తాయని సాయణాచార్యులు తెల్పడం సముచితంగా ఉంది.

కాని వేద పండితులందరికీ ఇట్టి పరిణత స్థితి కలుగుతోందా! కలుగకపోతే ఏం చేయాలని ప్రశ్నలున్నాయి. సాయణాచార్యులు పైన తెల్పినట్లు దుష్ట విషయ ప్రవృత్తి. విషయ ధ్యానం అనే దోషాలుంటే వాటిని తొలగించుకోవాలి.

మంత్ర శాస్త్ర సంప్రదాయంలో మంత్ర సిద్ధిని పొందిన మహనీయుడు చెవిలో మంత్రం చెప్పడం వల్ల శక్తిపాతం జరిగి శిష్యునిలో దివ్యశక్తి మేల్కొంటుంది. ఈ విధానాన్నే దీక్ష అంటారు. అలాగే బ్రహ్మచారికి వేదసిద్ధుడైన గురువరేణ్యుడు చేసే శక్తి పాతమే ఉపనయనం. కనుక ఉపనయనం లోనే శిష్యునిలో దివ్యశక్తి మేల్కొనాలి. కాని ఇప్పుడు తండ్రులే ఉపనయనం చేయడం జరుగుతోంది. తండ్రి వేద సిద్ధుడు కాకపోవడం వల్ల శిష్యునిలో దివ్యశక్తి ప్రబోధం జరుగక పోవచ్చు. కనుక ఉపనయనం చేయదలచిన తండ్రి ఉపనయనం చేయడానికి ముందు కనీసం 12 వేలు గాయత్రీ మంత్రం జపించిన పిదప ఉపనయనం చేస్తే శిష్యునిలో దివ్యశక్తి ప్రబోధానికి అవకాశం ఉంటుంది.

- 'ఉపనయన ప్రయోగం' యాజుష పూర్వ ప్రయోగం - 13 పుట,

గోమఠం నారాయణ జోస్యర్‌, మైసూర్‌

బ్రహ్మచర్యం, ఉపనయనం, ఓంకారం, దర్భలు, ప్రాణాయామం మొదలయిన వాటివల్ల శక్త్యుద్బోధం జరిగితే తరువాత స్వర పూర్వకమయిన వేదమంత్రోచ్చారణ వల్ల యోగ ఫల ప్రాప్తి కలుగుతుందని సారాంశం.

Sruthi Sourabham    Chapters    Last Page