Sri Laxmihrudayamu    Chapters   

శ్రీలక్ష్మీహృదయతంత్రప్రరోచన

ఈ లక్ష్మీహృదయ తంత్రమునకు తాత్పర్యవ్యాఖ్యావిశేషములు వ్రాసినవారు శ్రీకాకుళ వస్తవ్యులు శ్రీ శ్రియానందనాథ దీక్షానామధేయులు శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మ మహాశయులు

విశ్రుతసాధక శ్రేష్ఠుల పండితులు కవులు భిష్మఙ్మణులునగు వీరిని తెలుపుట యన జ్యోతిషాంపతినికరజ్యోతితో చూపుటయే.

కవితారూపమును ధరించిన హరికథలు వైద్య గ్రంథములు పెక్కు వ్రాసినప్పటికిని వీరి రచనములు వచనములు గాని, కైతలుగానితల్లిపై ముచ్చటలే యధికము.

జాగతికములగు సమస్తదార్థములయందును అలౌకిక ములగు నెల్లభావములందును వీరికి నిరంతరమును తల్లిరూపేకనుపట్టుచున్నందున ఎట్టి గ్రంథమునందును మంత్రతంత్రాది కములకును మాతృవ్యాఖ్యానమే వీరికి గోచరించుచుండును. అందులో దేవీసంబంధములగు గ్రంథములందు వీరి వ్యాఖ్యఅపారముగా సారగర్భితముగా సాగుచుండును.

శ్రీలక్ష్మీహృదయము అల్పశబ్దపరచయ మున్నవారికి సుళవుగ అర్థమగు రచన.

అట్లయ్యు వీరి విశేషతాత్పర్యములు చదువుచున్నచో అట్టి మన అభిప్రాయములు అనాలోచితములుగా బొడకట్టును. ఉదాహరణమున కొక్కటి తెల్పుచున్నాను.

శ్లో|| శ్రీధరే శ్రీమహాభూతే త్వదంతస్థం మహానిధిం,

శీఘ్రముద్ధృత్య పురతః ప్రదర్శయ సమర్పయ.

వసుంధరే శ్రీవసుధే వసుదోగ్ద్రి కృపామయి,

త్వత్కుక్షిగత సర్వస్వం శీఘ్రం మే సంప్రదర్శయ.

వష్ణుప్రియే రత్నగర్భే సమస్తఫలదే శివే,

త్వద్గర్భగత హేమాదీన్‌ ప్రదర్శయ ప్రదర్శయ.

ఈ శ్లోకములలో సంబోధనలుతప్ప నీ గర్భస్థమగు మహానిధులను నాకు జూపుమనునదియే మూడుశ్లోకములందును పౌనఃపున్యమగు నొకేభావము మనకు తోచును. మరి వీరి విశేషవివరణము తిలకించినచో మన అభిప్రాయమెంత యథాజాతమో విదితమగును.

ముప్పదియెనిమిదవ శ్లోకములోని "మహానిధి" అను దానికి శుభాదిక నవనిధులను ధరియించి యున్నదానవే కాదు, సకలసపందలను ధరియించియున్నావు, కావున జ్ఞానానంమయి వనియు, ముప్పపదితొమ్మిదవ శ్లోకమున "త్వత్‌కుక్షిగత సర్వస్వం" అని ప్రచ్ఛన్నముగా నీయందున్న ధనములన్నియు ఇష్టవస్తువు లన్నియు నాకొసంగుమనియు, నలువదవశ్లోకమున "త్వద్గర్భగత హేమాదీన్‌" అని యున్నచోట హేమాదిరత్నములు విద్యలు మొదలగునవి నీగర్భమున నున్నందున రత్నగర్భవైతివి- మొదలగు విశేషములు తెల్పియున్నారు. ఈ యుదాహరణమువలన వీరి వివరణ మెంతటి సారగర్భితమో మనకు దెలియగలదు.

వీరు పెక్కేండ్లు ఉపాధ్యయపదవి యందుండుటచే బాలావబోధమునకై యలవడిన పునరుక్తులు వీరి రచనములో అధికముగ గన్పట్టుచుండును. అట్టివి శ్రీశబ్దవ్యుత్పత్తి మొదలగు వానియందు మనకు చూపట్టును.

స్పష్టావబోధనకై పునః పునర్విచారణ అవసరమనియే నా అభిప్రాయము.

ఇక వీరి రచనలలో ఎన్నో గ్రంథములనుండి ఉదాహృతులు కోకొల్లలుగా నిచ్చుచుందురు. శ్రీ శంకరుల శారీరక మీమాంసనుండిటయు, భగవద్గీతనుండియు, ఉపనిషత్తుల నుండియు, వేదములనుండియు అట్టి యుదాహరణము లెక్క లేనన్ని దొరలచుండును.

ఇట్టి మహనీయుని గ్రంథమున నల్పప్రజ్ఞుడ నగు నాయట్టివాడు పీఠికారూపప్రరోచన వ్రాయుట సాహసమే. అయినను శ్రిగురుదేవుల యభిప్రాయానుసారము నా యెఱిగినంత తెల్పికొన్నాడను. పాఠకపిండితులు నాసాహసమును మన్నింతురుగాక యని ప్రార్థన.

ప్లవంగ-భాద్రపద శుద్ధ 10 ఇట్లు

ముత్తుకూరు గురుదేవ శిష్యుడు

13-9-1967 ఆకిలి శ్రీరామశర్మ

__

Sri Laxmihrudayamu    Chapters