Nadichedevudu   Chapters  

 

62. 'ప్రతిష్ఠ ఎప్పుడు?'

- శ్రీరామ శరణ్‌ కుందుర్తి వెంకట నరసయ్య

నాగాయలంక లాంచీలరేవు గట్టున సంతరోజున చేపల తట్టలు, గడ్డి మూటలు పెట్టుకుని అమ్ముకునే వారు. అక్కడి నుండి లాంచీలమీద సుమారు వేయి మంది పెనుమూడి మీదిగా గుంటూరుజిల్లాకు పోతారు. దాదాపు వేయిమంది అక్కడికి వస్తారు.

అలాంటి తావులో భగవంతుడు జ్ఞాపకం వస్తే బాగుంటుందని తోచి, స్వహస్త పరహస్తాలతో శ్రీ కోదండరామాలయం, రమాసహిత సత్యనారాయణ ఆలయం రెండూ నిర్మించడం జరిగింది. జయిపూర్‌ నుంచి చలవరాతి విగ్రహాలు తెప్పించాము. 1964 మే నెల 31 తేదీ నాటికి ప్రతిష్ఠకు ముహూర్తం నిశ్చయించాము. అందుకు సమస్తమైన ఏర్పాట్లు జరిగాయి.

ఇంతలో, కంచి పెద్దస్వాములు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి షష్ఠిపూర్తి మే నెల 25 తేదీన కంచికి మూడుమైళ్ల దూరంలో అంబి గ్రామంలో జరుగుతుందని తెలిసింది. నేనూ, మా శిష్యుడు తుంగల నాగభూషణం ఇద్దరం బయలుదేరిపోతూ, 31 తేదీ ప్రతిష్ఠ నాటికి తప్పకుండా వస్తామని, ప్రతిష్ఠకు పూర్వం జరగవలసిన అధివాసాదులు చేసి సిద్ధంగా ఉండండని చెప్పి, మేము అంబికి బయలుదేరామ. అప్పుడు అక్కడికి శ్రీ మండలీక వెంకటశాస్త్రి, శ్రీ కుప్పాలక్ష్మావధానులూ, శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి గార్లు కూడా వచ్చారు.

షష్టిపూర్తి రోజున మా కెవరికీ స్వామి వారి తీర్థం దొరకలేదు. ఆ మర్నాడు 26 తేదీ తీర్థం పుచ్చుకుందా మనుకున్నాము. ఆనాడే నేను స్వామి దర్శనం చేసింది. అంతకు పూర్వం స్వామిని నే నెన్నడూ చూడలేదు. నేను తీర్థానికి చెయ్యి చాచాను. స్వామి నాకు తీర్థమిచ్చి, చేతిలో ఉన్న పెద్దఉద్ధరిణ కింద పెట్టి, ''ప్రతిష్ఠ ఎప్పుడు?'' అని అడిగారు. నేను నిర్ఘాంతపోయాను. ''మా ఇంట్లో మందిరంలో ఎప్పుడో అయింది'' అన్నాను. ''అది కాదు. నది ఒడ్డున ఏర్పాటుచేశావే, 'రామ పాదక్షేత్రం,' అక్కడ ప్రతిష్ఠ'' అన్నారు.

నేను: దానిని మే 31 తేదీ చేదామని అనుకున్నాము.

స్వామి: 31 వ తేదీన చేస్తారా?

స్వామి ప్రశ్నార్థకంగా అన్న మాటలో ఆ రోజున ప్రతిష్ఠ జరగదనే ధ్వని వినిపించింది.

స్వామి మాకు అక్షింతలు, కుంకుమ, కిస్‌మిస్‌ పండు ప్రసాదం ఇచ్చి, యంత్రానికి ప్రత్యామ్నాయంగా వాటిని విగ్రహాల కింద ఉంచండని సెలవిచ్చారు.

ఇంతలో 28-5-64 న జవహర్‌లాల్‌నెహ్రూ పరమపదించారు. అందుచేత ఆనాడు రైళ్లు, బస్సులు నడవ లేదు. 29 తేదీ బయలుదేరి 30వ తేదీ సాయంత్రానికి మేము ఊరు చేరాము.

మేము ఊరిలో లేనందున 'గురువుగారు లేని ప్రతిష్ఠా' అంటూ గ్రామస్థులు ఏ పనీ మొదలుపెట్టలేదు. అందుచేత, మళ్లా జూన్‌ 11తేదీన ప్రతిష్ఠకు ముహూర్తం పెట్టి ఆపని నిర్వహించాము. స్వామివా రన్నది నిజమైంది!

మరొక విచిత్రమేమంటే, స్వామివా రా స్థలాన్ని 'రామపాద క్షేత్ర' మని ఎందుకన్నారు? తరవాత రెండునెలలకు నాగార్జునడాము విరిగి కృష్ణానదికి అంతులేని వరద వచ్చింది. అప్పుడు ఆ వరదనీరు గుడిలో శ్రీరామపాదాలనంటి తగ్గిపోయింది. ఆ వరద ఇంకో అంగుళం పెరిగినట్లయితే దివి తాలూకా లో 70 గ్రామాలు వరదకు కొట్టుకుపోయేవి.

ఇప్పుడు అక్కడ చక్కగా పూజలు, కార్తీక స్నానాలు, 108 సత్య నారాయణ వ్రతాలు సక్రమంగా జరుగుతున్నవి. వినాయక, కేదారేశ్వర ఆంజనేయ విగ్రహాల ప్రతిష్ఠ కూడా జరిగింది.



యోగులు, సిద్ధులు ఉన్నారు.

నేటికికూడా దేశంలో కొందరైనా సిద్ధులూ, యోగులూ లేకపోలేదు. అత్యుష్ణాన్ని, అతిశీతలాన్నీ వారి శరీరాలు సహిస్తాయి. తలుచుకుంటే వారు వర్షం కురిపిస్తారు. కురుస్తూవున్న వర్షాన్ని ఆపనూగలరు.

మనకు స్థిరమైన నమ్మకంలేదు. అన్నిటిమీదా అపనమ్మకమే. నేటికంటే పూర్వకాలంలో దివ్యశక్తులు కలవారు ఎక్కువగా ఉండే వారు. కాబట్టి, మన పురాణాలలో ఈ మహిమలను విశేషంగా ఉదహరించారు. గాథలలో మహిమలున్నంతమాత్రాన మన పురాణాలను కట్టుకథలనడం సబబుకాదు. నేటి భౌతికశాస్త్రం రుజువు చేయలేని దానినంతా కల్పనగా భావించడం ఆంగ్లవిద్యకు మెప్పుకాదు.

Nadichedevudu   Chapters